140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం
నికోసియా: సైప్రస్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరియోస్ 3ను ప్రదానం చేశారు. ప్రధాని ఈ గౌరవాన్ని స్వీకరిస్తూ ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి ఈ అవార్డును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ తొలి అధ్యక్షుడు మకరియోస్ 3 పేరుతో ఈ అత్యున్నత పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. సైప్రస్ ప్రభుత్వ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇరుదేశాల సంస్కృతి, సోదరభావం, వసుదైవ కుటుంబ భావనకు ప్రతీక అని చెప్పారు. రెండు దేశాల మధ్య క్రియాశీల భాగస్వామ్యం కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల తర్వాత సైప్రస్లో భారత ప్రధాని ఒకరు పర్యటించడం ఇదే ప్రథమం.