రాష్ట్రపతి ముర్ముతో మోదీ భేటీ

ఆపరేషన్‌ సిందూర్‌పై వివరించిన ప్రధాని
నేడు అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం పిలుపు

న్యూదిల్లీ,మే7: పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌ ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిరది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం చేపట్టిన దాడుల గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపు నిచ్చింది.
గురువారం ఉదయం 11 గంటలకు జరగబోయే ఈ భేటీలో.. ’ఆపరేషన్‌ సిందూర్‌’ తదనంతర పరిణామాలను ఆయా పార్టీల నేతలకు ప్రభుత్వం వివరించనుంది. జాతీయ భద్రత విషయంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు తదితరులు ఈ భేటీకి  హాజరుకానున్నారు. మరోవైపు భారత మెరుపుదాడులను విపక్ష నేతలు స్వాగతించారు. పాకిస్థాన్‌ ఉగ్ర చర్యలకు వ్యతిరేకంగా భారత్‌ తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలు రద్దు
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాని మోదీ  చేపట్టాల్సిన పలు విదేశీ పర్యటనలు రద్దయ్యాయి. రద్దుకు గల కారణాలను కేంద్రం వెల్లడించినప్పటికీ దేశీయ అంశాలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా విదేశీ పర్యటనలు రద్దైనట్టు తెలుస్తోంది. ఈ నెలలో క్రోయేషియా, నార్వే, నెదర్‌ల్యాండ్స్‌ పర్యటించాల్సి ఉండగా ఇది రద్దయింది. మరో రెండు రోజుల్లో చేపట్టాల్సిన రష్యా పర్యటనను కూడా ప్రధాని మోదీ రద్దు చేసుకున్నారు. నాజీలపై సోవియట్‌ యూనియన్‌ విజయాన్ని పుస్కరించుకుని మే 9 విక్టరీ డే వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉండగా పర్యటన చివరి నిమిషంలో రద్దు చేసుకోవాల్సి వొచ్చింది. ఈ విషయాన్ని రష్యా ప్రతినిధి కూడా ధ్రువీకరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page