– నిరసనలు సరే.. మా సంగతేంటి?
– దాడిలో గాయపడ్డ పోలీస్ కుటుంబాల ఆందోళన
– మాకు న్యాయం చేయాలంటూ పలువురి డిమాండ్
న్యూదిల్లీ, జులై 31 : జంతర్మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా గాయపడిన దిల్లీ పోలీసు సిబ్బంది కుటుంబాలు న్యాయం కోసం డిమాండ్ చేశాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఆందోళనకారులు.. రాళ్లురువ్వడం సహా చెప్పులతో దాడి చేశారని ఆరోపిస్తూ శుక్రవారం మీడియా ఎదుట బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనల సమయంలో ఎంతో మంది పోలీసులు గాయపడినా.. వారి గురించి ప్రజలకు పట్టట్లేదని ఆయా కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ నిరసనల్లో గాయపడిన కొంతమంది పోలీసుల కుటుంబసభ్యులు శుక్రవారం డియా ముందుకొచ్చారు. నాటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ తమకు కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గాయపడిన ఓ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఏసీపీ) కుమారుడు మాట్లాడుతూ తన తండ్రి ఎదుర్కొన్న పరిస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ’మా నాన్న యూనిఫాం రక్తంతో తడిసిపోయింది’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళనల సమయంలో ఆయన తలకు తీవ్ర గాయమైందని, నాలుగు కుట్లు కూడా పడినట్టు చెప్పుకొచ్చారు. తన తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యానని వాపోయారు. నిరసనల సమయంలో గుంపులో కొందరు అసాంఘిక శక్తులు కలిసిపోయి మూకుమ్మడిగా రాళ్ల దాడికి దిగారని తన తండ్రి చెప్పినట్లు కుమారుడు వివరించారు. పోలీసులు స్పందించే అవకాశం లేకుండా వరుస దాడులు జరిగాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది.. నిరసనకారుల దాడులకు గురయ్యారని, గాయపడిన వారికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రజల రక్షణ కోసం పనిచేసే పోలీసులపై దాడులను సహించరాదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేను దిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నా. మా నాన్న 15 ఏళ్ల పాటు నేవీలో మెరైన్ కమాండోగా సేవలందించారు. ఇప్పుడు దిల్లీ పోలీసు విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల సమయంలో నాన్న ప్రధాన వేదిక అయిన జంతర్ మంతర్ వద్ద విధులు నిర్వహించారు. ప్రతి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత.. నిరసనల గురించి మాకు చెప్పేవారు. విద్యార్థుల ముసుగులో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఆందోళనల్లో చేరారని అన్నారు. ఆందోళనల సమయంలో మా నాన్నను కొంతమంది లాగి.. మూక దాడికి యత్నించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయనను హాస్పిటల్కి తరలించారు. దాదాపు నాలుగు గంటల పాటు నాన్న స్పృహలో లేరు. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆయన యూనిఫామ్ అంతా రక్తంతో తడిసిపోయింది. అలాంటి రోజు మా జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఈ ఘటన తర్వాత నేను సోషల్ మీడియా తెరవగా.. మా నాన్ననే నేరస్థుడిగా నిందిస్తున్నారు. ఆయనపై దాడి చేసిన వారే.. న్యాయం కావాలంటూ సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. అప్పుడే నిర్ణయించుకున్నా.. మాకూ న్యాయం జరగాల్సిందే. అందుకే గాయపడిన పోలీసుల కుటుంబాలతో కలిసి సుప్రీంలో పిటిషన్ వేశాం అని ఓ ఎస్సై కుమార్తె డియా ముందు తన ఆవేదనను పంచుకున్నారు. నా భర్త దిల్లీ పోలీసు విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. 33 ఏళ్లుగా పోలీసు శాఖలో ఉన్నారు. ఆందోళనల సమయంలో ఆయనపై కొంతమంది దాడికి పాల్పడ్డారు. రాళ్లు, చెప్పులు.. ఏది దొరికితే దాంతో కొట్టారని ఆయన చెప్పారు. రాళ్ల దాడికి ఆయన పెట్టుకున్న హెల్మెట్ విరిగిపోయింది. ఈ నిరసనల తర్వాత ఎక్కడ చూసినా.. ఆందోళనకారులను పోలీసులు కొట్టారనే వార్తలే కన్పిస్తున్నాయి. కానీ, నాణేనికి మరోవైపు కూడా ఉంది. దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రజల కోసం సేవలందిస్తున్న వారి ఆవేదనను దేశమంతా వినాలని ఓ అసిస్టెంట్ ఎస్సై భార్య సీమా భావోద్వేగానికి గురయ్యారు. మా తాత బీఎస్ఎఫ్లో పని చేశారు. 1971 యుద్ధంలో పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తితోనే నాన్న పోలీసు శాఖలో చేరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఆందోళనల సమయంలో బారికేడ్ల వద్ద విధులు నిర్వహిం చారు. ఉన్నట్టుండి తమపై ఆందోళనకారులు రాళ్లు విసిరారని నాన్న చెప్పారు. సీనియర్ అధికారులను రక్షించే క్రమంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. నాలుగు కుట్లు పడ్డాయ్. నేనూ విద్యార్థినే. విద్యార్థుల పట్ల నాన్న ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించరు. ఈ నిరసనల్లో రౌడీలు, సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని మరో పోలీసు కుమారుడు మీడియాకు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




