భయంతో పరుగులు తీసిన జనం
నిజామాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: నిజామాబాద్లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణా రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో హాజరవుతున్నట్లుగా అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. ఈ మేరకు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సభా ప్రాంగణానికి కాస్త దూరంలో ఓ హెలీప్యాడ్ను కూడా ఏర్పాటు చేశారు.
కానీ, మంత్రుల హెలికాప్టర్ను పైలెట్ అనూహ్యంగా సభా ప్రాంగణంలోనే దించేశాడు. ఈ పరిణామంతో హెలికాప్టర్ రెక్కల గాలి వల్ల భారీగా దుమ్ము ఎగిసిపడింది. దీంతో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు సైతం నేలకూలాయి. జనం అంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఈ హెలికాప్టర్ గాలికి రైతుల కోసం ఏర్పాటుచేసిన స్టాళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరక్కుండా అధికారులు జాగ్రత్త పడాలని… సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారులు సూచించారు. మంత్రులు కూడా ప్రమాదం నుంచి సురక్షితంగా బైటపడి రైతు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.