అమరావతికి… అటూ… ఇటూ!

అమరావతి… ఆంధ్రుల కలల సౌధం… రాజసం ఉట్టి పడే రాజధాని కోసం ఉరుకులు… పరుగులు…! గత నిశ్శబ్ధానికి స్వస్తి పలికి రెండో ఇన్నింగ్స్ ‌ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో వైఫల్యాలను దాటుకొని సమర్థత, సాఫల్యతల నిరూపణలో ఆయత్తమైంది. గత పాలకుల నిర్లక్ష్యం… నిరాసక్తత వెరసి అద్భుత నగరి భవిష్యత్‌ ‌ప్రశ్నార్థకమైన తరుణంనుంచి ఇప్పుడిప్పుడే మళ్ళీనడకలు వేగం పుంజుకొన్నాయి. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించి తీరాలన్న తపనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం సహకారంతో అనేక ప్రాజెక్టుల సాఫల్యతకు శ్రీకారం చుడుతోంది. అందిన అవకాశాలన్నింటినీ ప్రోది చేసి భవిష్యత్‌ ‌తరాలకు ఇదీ ఆంధ్ర… అన్న కీర్తిని మిగల్చాలని తలపోస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాధినేత కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు నివేదికల సమర్పణ, నిధులు రాబట్టడంపై రాష్ట్రప్రభుత్వం అంతులేని కసరత్తు చేస్తోంది. పాలనలో భాగంగా ఏడాదికాలం దాదాపు దగ్గరవుతున్న సమయంలో వీలైనంతగా కాలాన్నీ, సద్వినియోగాన్నీ ధృషిలో పెట్టుకుని ప్రణాళికా వ్యూహరచనలు చేస్తోంది. అందులో చాలా ప్రాజెక్టులకు టెండర్లు నిర్ధారణ పని పూర్తి లక్ష్యాల్లో విశదీకరిస్తోంది.

3 ఏళ్లలో వీలైనన్ని పనులు పూర్తవ్వాలని నిర్దేశించడం జరుగుతోంది.క్షేత్ర స్థాయిలో చూస్తే… ఈ ప్రాంతంలో అమరావతి పై అనేక కోణాలు వెలుగులోకొస్తున్నాయి. ప్రధానంగా ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పూనుకొంది. రోడ్డు, రవాణా సౌకర్యాకు కీలక ప్రాధాన్యమిస్తోంది. ఇన్నర్‌, ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్లు, సీడ్‌ ‌యాక్సెస్‌ ‌రోడ్లు… ఇలా సరికొత్త రవాణా వ్యవస్థకు రూపకల్పన చేస్తోంది. భవిష్యత్తులో ధీటైన రాజదానిగా పేరొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ లోగా ఈ ప్రాంతంలో మౌలిక అవసరాల గుర్తింపునకు ప్రాధాన్యమిస్తున్నారు. ఉదాహరణకు… మంగళగిరి పరిసర గ్రామాలు, ప్రాంతాలనుంచి రాజధాని నిర్మాణ సామాగ్రి చేరవేతకు కీలకమైన రోడ్డు బ్రిడ్జిలు ఈ పాటికే ప్రతిపాదనల దశ దాటి నిధుల కేటాయింపుదాకా కేంద్రానికి చేరాయి. కేంద్రం చేయూతతో త్వరత్వరగా ఈ పనులు పూర్తి చేసి మెటీరియల్‌ ‌చేర్చేందుకు అవకాశమేర్పడింది. రానున్న వర్షాకాలం లోపే పనుల్లో పురోగతి ఉండాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. మొత్తంమీద 92 ప్రాజెక్టులను గుర్తించి, రూ.65వేల కోట్ల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. అమరావతిలో ప్రపంచ స్థాయి రైల్వేస్టేషన్‌తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఆలోచనలు ఊపందుకుంటున్నాయి. విమానాశ్రయం ఏర్పాటుకు 5నుంచి 7వేల ఎకరాల భూమి అవసరమౌతుందని అంచనాలున్నాయి. శ్రీకాకుళంలో నిర్మించాలని భావిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు తరహాలోనే ఇక్కడా విమానాశ్రయంపై అంతర్గత చర్చలు సాగుతున్నట్లు భోగట్టా. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఇది ఉపయుక్తమన్న భావన ఉంది.

శ్రామిక వర్గ చప్పుళ్ళు… యంత్రాల రణగొణలు: గత ప్రభుత్వ హయాంలో నిలిచిన పనులను మళ్ళీ గాడిన పెడుతున్నారు. అప్పట్లో ఆగిన నిర్మాణాలు ఇప్పుడిప్పుడే కార్మిక వర్గం సందడితో పునరుజ్జీవమౌతున్నాయి.  ముళ్ళకంపలు, చెట్ల తొలగింపు పనులు, ఈ పాటికి మొదలై ఒక దశకు చేరుకున్నాయి. నిర్మాణాల్లో పేరుకుపోయి, శిధిలమైన శకలాలలు తొలగింపు, మొలిచిన మొక్కలను నిర్మూలించి ప్రక్షాళిస్తున్నారు. రూ.40వేల కోట్ల అంచనా తో ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు ఖరారయ్యాయి. అలాగే ముందుగా గతంలో నిలిచిపోయిన పనులను పట్టాలెక్కిస్తున్నారు. ప్రాజెక్టులను దక్కించుకున్న కంపెనీలు రంగంలో దిగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన, యంత్ర సామగ్రిని సిద్ధం చేయడం, శ్రామిక సిబ్బందిని పురమాయించడం, ఇతరత్రా అవసరాల••నుగుణంగా కంపెనీలు తమ కార్యాచరణకు వ్యూహాలు, ప్రణాళికలు సాగిస్తున్నాయి. స్థానిక కార్మిక సిబ్బందితోపాటు ఇతర రాష్ట్రాల వారి బూట్ల చప్పుళ్ళు, యంత్రాల సైరన్లు మామూలవుతున్నాయి. నైపుణ్య కార్మికుల కోసం బెంగాల్‌, ఒరిస్సా, బీహార్‌ ‌లాంటి రాష్ట్రాల సిబ్బందిని మళ్ళీ పనుల కోసం పిలిపించడంతో ఇక్కడ నిర్మాణ రంగ సందడి వేగం పుంజుకొంటోంది. అప్పట్లో గత ప్రభుత్వం పనులు నిలిపేయడంతో వచ్చిన కంపెనీలు వెళ్ళిపోయాయి. వాళ్ల యంత్ర సామగ్రిని తరలించేశాయి. తాజాగా ప్రభుత్వ పాలనా మార్పిడితో పేరొందిన కంపెనీలు టెండర్లు దక్కించుకున్న సంస్థలు అమరావతి వైపు దృష్టి సారించాయి. అప్పటికీ, ఇప్పటికీ కూలీ రేట్లు పెరిగినా కార్మికులకు అవసరాలకు తగ్గట్టుగా వసతి సౌకర్యాలు, షెడ్ల ఏర్పాటుకు కంపెనీలు సమాయత్త మయ్యాయి. రాజధాని పరిసర ప్రాంతాల్లోనే సిబ్బంది అందుబాటులో ఉండేలా కంపెనీలు ప్లాన్‌ ‌చేస్తున్నాయి. గతంలో అమరావతి పనులు ఆగిపోయినప్పుడు బెంగుళూరు, హైదరాబాద్‌ ‌తదితర ప్రాంతాలకు వలస పోయిన కార్మికులు మళ్ళీ అమరావతికొస్తున్నారు.

రాజధాని విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధమౌతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. విమానాశ్రయం రింగ్‌రోడ్లు, రైల్వేస్టేషన్లు, కంపెనీలు సంస్థలకు వారి అభ్యర్థన మేరకు భూముల కేటాయింపు ఇలా భూమి లభ్యతపై తర్జనభర్జనలు సాగుతున్నాయని ప్రచారం నడుస్తోంది. డిపార్టుమెంట్లు వారీగా నివేదికల రూపకల్పన జరుగుతున్నట్లు ప్రచారం ఊపందుకొంది. ప్రసార మాధ్యమాల్లోనూ వెల్లడవుతోంది. భూసమీకరణ లేదా భూసేకరణ రూపాల్లో ఎలా ముందుకెళ్ళాలన్న అంశమై ఇంకా నిర్ణయం కాలేదని వార్తలున్నాయి. కొత్త ప్రాజెక్టుల కోసం అదనంగా ఎన్ని వేల ఎకరాలు అవసరమన్నది ప్రాధమిక దశలోనే చర్చలున్నట్లు అధికార వర్గాలు ఉటంకిస్తున్నాయి. మరో వైపు అమరావతి రాజధాని కోసం తొలుత ప్రణాళికల ప్రకారం 33 వేల ఎకరాల భూమిపై ఎన్నో అభిప్రాయాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఇప్పుడిక మరింత భూమి సమీకరణ అవసరం, వినియోగం, ప్రణాళికల తయారీలపై అప్పుడే సాధ్యాసాధ్యాల చర్చ మొదలైంది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే రాజధాని అసలు నిర్మాణాలు కొలిక్కి రావడం మొదలైందని, ఈ అయిదేళ్ళకాలం లోనే బోలెడంత నిర్మాణ ప్రక్రియను నెరవేర్చాల్సిఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రక్రియకు చాలా సమయం పడుతుందని, దీన్ని గమనంలోకి తీసుకోవలన్నదీ పరిశీలకుల అభిప్రాయంగా
ఉంది.

image.png
చెన్నుపాటి రామారావు
 రాజకీయ,ఆర్థిక, సామాజిక వేత్త,
విశ్లేషకులు
9959021483

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page