హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో ఆస్తి వివాదం కారణంగా ఒక యువ న్యాయవాది దారుణంగా హత్యకు గురైన ఘటన తనను కలచివేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఆస్తులు, ఆర్థిక కారణాల పేరుతో రక్తసంబంధాలు తెగిపోవడం, మానవీయ బంధాలు నశించిపోవడం మన సమాజం ఎదుర్కొంటున్న అత్యంత విషాదకర పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. సోదర బంధం వంటి పవిత్రమైన సంబంధాలు కూడా ఆస్తుల కోసం హింసకు, హత్యలకు దారి తీస్తుండటం తీవ్రంగా కలవరపెడుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిని ఎంచుకుని సమాజానికి సేవ చేయాలనుకున్న ఒక యువతి ఇలాంటి దారుణానికి బలవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆస్తి వివాదాలకు హింసే పరిష్కారం అన్న భావన సమాజంలో పెరగడం ప్రమాదకరమని, సమస్యలను చర్చలు, న్యాయపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మానవ విలువలు, కుటుంబ బంధాల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





