హుస్నాబాద్‌ గౌరవాన్ని పెంచుతా

మంత్రి పొన్నం ప్రభాకర్‌

సైదాపూర్‌, ప్రజాతంత్ర, జులై 19: పార్టీలకతీతంగా పేదలకు రేషన్‌ కార్డులు అందిస్తున్నామని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. మండల కేంద్రంలో విశాల పరపతి సహకార సంఘం హాల్‌లో శనివారం నూతన రేషన్‌ కార్డులు, కనల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, స్టీల్‌ బ్యాంక్‌, కాటమయ్య రక్షణ కవచాలను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా మీరు రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.. పెళ్లిళ్లు అయినవారు పిల్లలు పుట్టినా ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా రాని రేషన్‌ కార్డును ప్రజాప్రభుత్వంలో అందిస్తున్నామని, ఇప్పుడు ఈ మండలంలో 1301 రేషన్‌ కార్డులు ఇస్తున్నామంటూ రేషన్‌ కార్డులు రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 795 మంది పేర్లు కొత్తగా రేషన్‌ కార్డుల్లో చేర్పులు చేశామన్నారు. మీ ఆశీర్వాదంతో ప్రజా పాలన ప్రభుత్వంలో మంత్రిగా మీ పేరు నిలబెట్టేలా, హుస్నాబాద్‌ గౌరవాన్ని పెంచుతున్నానని చెప్పారు. పెద్దలకే పరిమితమయ్యే సన్న బియ్యం ప్రతి పేదవాడికి పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కి గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నామని, మహిళలు ఆర్టిసీలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని, బస్సులో ఎక్కడమే కాదు ఆర్టీసీ బస్సులకు మహిళా సంఘాల సభ్యులు ఓనర్లు అయ్యారని, మొన్ననే ఆర్టీసీ బస్సుల కిరాయిలకు సంబంధించి మహిళా సంఘాలకు చెక్కులు అందించామని వివరించారు. ఈరోజు 18 మందికి ఈ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు ఇస్తున్నాం.. ఈరోజు రూ.16 లక్షల విలువైన 45 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఇస్తున్నామని, మీరందరూ ఆరోగ్యంగా ఉండేలా మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌లలో అవసరమైన చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. మండలంలోని 35 సంఘాలుకుగాను ఇపుడు ఆరింటికి స్టీల్‌ బ్యాంక్‌ ఇస్తున్నామని, అందులో 16 రకాల వస్తువులు ఉన్నాయని, వీటితో ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా మార్చేలా మీరు కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల క్యాన్సర్‌, ఇతర వ్యాధులు వస్తున్నాయి.. అందువల్ల స్టీల్‌ బ్యాంక్‌ వినియోగం పెంచాలని సూచించారు. గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నామని, ఈ మండలంలో గత పదేళ్లలో ఒక్క డబుల్‌ బెడ్‌ రూం ఇవ్వలేదు.. ఒక్కటి కూడా నిర్మించలేదు.. ప్రజా పాలన ప్రభుత్వంలో ఈ మండలంలో మొదటి ఏడాది 585 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం.. రాష్ట్రం మొత్తం రూ.600 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం.. ఈ ఒక్క మండలంలోనే దాదాపు రూ.కోటి వడ్డీ లేని రుణాల చెక్కులు ఈరోజు మహిళలకు ఇస్తున్నాం.. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు ప్రత్యేక పథకాలు తెస్తున్నామని మంత్రి పొన్నం చెప్పారు. నియోజకవర్గంలో ఒక్క గుంట భూమి కూడా వృధా ఉండద్దు.. ఆయిల్‌పాం, డ్రాగన్‌ ఫ్రూట్‌, ఇతర ఏ పంటలు అయినా వేయండి.. గౌరవెల్లి ప్రాజెక్ట్‌ కాల్వల భూసేకరణ జరుగుతుంది.. మీ పంట పొలాలకు త్వరలోనే సాగు నీరు అందిస్తాం అని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో మెస్‌ చార్జీలు పెంచాం.. మీ ఊర్లకు ప్రైవేట్‌ బస్సు రాకుండా చేసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే మీ ఊరుకు ఐదు మంచి పనులు చేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *