ఐదుగురు మావోయిస్టుల మృతి
దండకారణ్యంలో కొనసాగుతున్న కూంబింగ్
ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్24: ములుగు జిల్లాలోని తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భీమారంపాడు సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన భీకర పోరు ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మాతో పాటు దాదాపు 2500 మంది మావోయిస్టులు భీమారంపాడు సపంలోని కర్రగుట్టలో ఉన్నట్లు నిఘా వర్గాలకు ఇటీవల సమాచారం అందింది. దీంతో కర్రగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు రెండు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది. అటవీ ప్రాంతం మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేయడంతో పాటు హెలికాప్టర్లతోనూ మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే తారసపడ్డ మావోయిస్టులపై కాల్పులు జరిపి ఐదుగుర్ని హతమార్చారు.
ఈ కూంబింగ్ ఆపరేషన్ నేపథ్యంలో భీమారంపాడు గ్రామస్తులు ఎవరూ కూడా బయటకు రావద్దని భద్రతా బలగాలు హెచ్చరికలు జారీ చేశాయి..ఈ ఆపరేషన్లో ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వొచ్చిన సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు . ఈ ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , బస్తర్ ఫైటర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, రాష్ట్ర పోలీసు విభాగాలు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, మరియు కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ వంటి విభాగాలు పాల్గొన్నాయి .ఈ ఆపరేషన్లో మావోయిస్టుల బెటాలియన్ 1 ను చుట్టుముట్టినట్లు సమాచారం. ఈ బెటాలియన్లో సుమారు 180-200 మంది సభ్యులు ఉన్నారు .ఈ ఆపరేషన్లో డ్రోన్లు, హెలికాప్టర్లు, మరియు శాటిలైట్ ఇమేజ్లను ఉపయోగించి భద్రతా బలగాలు మావోయిస్టుల కదలికలను గమనిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఒక ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ కానిస్టేబుల్ కూడా మృతి చెందినట్లు ఏలుస్తుంది . మావోయిస్టులు పెట్టిన ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ పేలుడు కారణంగా ఈ ఘటన జరిగింది. కాగా, ఈ ఆపరేషన్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.