” గతంలో ఏ రాజకీయ పార్టీ జరపని విధంగా సుమారు పది లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. పై నుండి క్రింది స్థాయి నాయకులందరికీ తలా ఒక బాధ్యతలను అప్పగించడం ద్వారా వారిని కార్యోన్ముఖులను చేస్తున్నారు. లక్షలాది మంది వొస్తున్నందున ఎక్కడ ఎలాంటి లోటు జరుగకుండా రెండువేల మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. మండిపోతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని సుమారు పదిక్షల వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను సిద్దం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలకుగాను వెయ్యికిపైగా వైద్య బృందాలను, 20 అంబులెన్స్లను సిద్దంచేస్తున్నారు. ఇంతపెద్ద ఏర్పాట్లు చేస్తూ, లక్షలాదిమందిని సభకు ఆహ్వానిస్తున్న బిఆర్ఎస్ అధినాయకుడు కొత్తగా ఏం ప్రకటిస్తారన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకిస్తున్న అంశం…”
(మండువ రవీందర్రావు )
భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) తమ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నది. దాదాపు నెల రోజులుగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. మొదటినుండి బిఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లానే ఇందుకు తగిన స్థలంగా ఎంచుకున్నారు. వరంగల్తో పాటు ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాలకు మద్యగా ఉండే ఎల్కతుర్తిలోని 1250 ఎకరాల సువిశాల స్థలాన్ని అనువుగా గుర్తించారు. గతంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించనంత భారీ స్థాయిలో సుమారు పది లక్షల మందితో సభను విజయవంతం చేసేందుకు స్థానిక నాయకత్వం అహోరాత్రులు కృషిచేస్తున్నది.
తెలంగాణ స్వరాష్ట్రంకోసం పాతిక సంవత్సరాలక్రితం బి(టి)ఆర్ఎస్ ఆవిర్భవించింది. 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన ఈ పార్టీ ఇప్పుడు 25వ వసంతంలోకి అడుగిడబోతున్నది. ఉద్యమ పార్టీగా గత 24 ఏండ్లుగా అనేక ఒడిదొడుకులను, అవాంతరాలను తట్టుకుని ఇంతకాలం నిలబడగలిగింది. దక్షిణ భారత దేశంలో వెలుగు చూసిన ప్రాంతీయ పార్టీల్లో ఇంతకాలం మనగలిగిన రాజకీయ పార్టీలు చాలా అరుదు. ఉమ్మడి ఆంధప్రదేశ్లో స్వర్గీయ ఎన్టీరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, తమిళనాడులోని డిఎంకె, అన్నా డిఎంకేల తర్వాత చెప్పుకోదగిన పార్టీ బిఆర్ఎస్ మాత్రమే. తెలంగాణ రాజకీయ నాయకులు కొందరు తెలంగాణ పేరున రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసినా అవి ఎక్కువ కాలం మనుగడను సాగించలేకపోయాయి. అర్థాంతరంగా వారు ఆ పార్టీలను రద్దు చేసుకోవడమో, ఇతర పార్టీల్లో విలీనం చేయడమో జరిగిపోయింది. కాని, ఒక లక్ష్య సాధనకోసం ఉద్భవించి చివరి వరకు నిలిచిన పార్టీగా బిఆర్ఎస్ గుర్తింపుతెచ్చుకుంది. కేవలం రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా, ప్రభుత్వాన్ని ఏర్పరిచి పదేళ్ళపాటు పాలన సాగించిన ఘనత కూడా బిఆర్ఎస్కు దక్కుతుంది. అయితే ఏ ఆశయాన్ని ఆశించి ప్రజలంతా ఆ పార్టీ వెంట నడిచారో, ఆ ఆశయాన్ని పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందన్న అపకీర్తిని మాత్రం ఆ పార్టీ మూటకట్టుకుంది. అదే ఆపార్టీకి శాపంగా మారింది.
పదిహేను నెలలకింద ఆ పార్టీని అధికారానికి దూరం చేయడానికి కూడా అదేకారణమన్న ఆరోపణ ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఏకైక లక్ష్యమంటూ ఉద్యమ పార్టీగా ఉద్భ వించిన బి(టి)ఆర్ఎస్ ఆ తర్వాత రాజకీయపార్టీగా రూపాంతరం చెందింది. అక్కడితో ఆగకుండా జాతీయ పార్టీగా పేరు మార్చుకుని బోర్లా పడింది. దేశ రాజకీయాల్లో సుగుణాత్మక మార్పు తీసుకొస్తామని బయలుదేరిన ఈ పార్టీ చివరకు సొంత ఇంట్లోనే గెలువలేకపోయింది. కనీసం పార్లమెంటులో తన వాయిస్ వినిపించే పరిస్థితి కూడా ఆపార్టీకి లేకుండాపోయింది. అధికారం కోల్పోయిన ఈ పదిహేను నెలలకాలంలో అనేక అవినీతి, అక్రమాల ఆరోపణలను మోస్తున్నది. ఇలాంటి పరిస్థితిలో ఇప్పుడు రజతోత్సవ వేడుకలకు సిద్దమవుతున్నది. పార్టీ పుట్టిన ఏప్రిల్ 27 ‘న భూతో న భవిష్యత్’ అన్న రీతిలో భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నది. ఈ సభ బిఆర్ఎస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అవుతుందనుకుంటున్నారు. ఆ పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో మరో ప్రస్థానానికి ఇది నాంది పలుకుతుందన్న భావన కూడా లేకపోలేదు. మరో విధంగా చెప్పాలంటే ఈ సభ ఆ పార్టీకి హనుమాన్ వ్యాయామశాల అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఉద్యమం చప్పపడుతున్నప్పుడల్లా ఆపార్టీ వరంగల్లో సభ పెట్టేది. సహజంగానే ఉద్యమంవెంట నడిచే వరంగల్ ప్రజలు సభను విజయవంతం చేయడంతో ప్రజాబలం తమ వెంటే ఉందన్న ధీమా ఆ పార్టీకి వొచ్చేది. ఇప్పుడు అదే అనవాయితీతో ఉమ్మడి వరంగల్నే ఈ భారీ బహిరంగ సభకు వేదికగా ఎంచుకున్నారన్న వాదన ఉంది. అధికారానికి దూరమైన బిఆర్ఎస్ ఈ పదిహేను నెలలకాలంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వొచ్చింది. అనేక అపనిందలు, అవమానాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అధికార కాంగ్రెస్, బిజెపి ఎన్నిమాటలన్నా మౌనమునిలా అన్నీ భరిస్తూ వొస్తున్న ఆ పార్టీ అధినేత కెసిఆర్ తన గళాన్ని విప్పేందుకు ఈ రజతోత్సవ సభ వేదికకానుంది. అసలే మాటల మాత్రికుడిగా పేరున్న కెసిఆర్ ఈ సభలో ఏం చెబుతారని యావత్ తెలంగాణ ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. మళ్ళీ తామె అధికారంలోకి రాబోతున్నామని ఆపార్టీ నాయకులు కొంతకాలంగా చేస్తున్న ప్రకటనలకు ఈ సభలో సమాధానం దొరుకుతుందనుకుంటున్నారు.
భారత రాష్ట్ర సమితి 2001 ఏప్రిల్లో 27 ఏర్పడినప్పటికీ ఆ పార్టీకి చివరి పద్నాలుగేళ్ళు అత్యంత కీలకమైనవిగా చెప్పాలి. ఆ పార్టీ అధినాయకత్వం కూడా తరుచూ తమ 14 ఏళ్ళ పోరాటాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటుంది. 1969 నాటి తెలంగాణ ఉద్యమం తర్వాత అంటే 32 ఏండ్ల విరామానంతరం మళ్ళీ అంతపెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టింది బిఆర్ఎస్సే. ఈ పద్నాలుగేళ్ళు ఉద్యమం అనేక కీలక మలుపులు తిరిగినప్పటికీ అంతిమ విజయాన్ని సాధించుకున్న ఘనత కూడా అ పార్టీకే దక్కింది. 1969 ఉద్యమం నాడు పట్టణాలకే పరిమితమైంది. ఆ ఉద్యమంలో విద్యార్ధులు, ఉద్యోగులు మాత్రమే ఎక్కువ సంఖ్యలో భాగస్వాములైనారు. ఈసారి అందుకు భిన్నంగా పద్నాలుగేళ్ళ ఉద్యమం సబండ వర్ణాలను ఏకం చేసింది. ప్రతి పల్లె ఉద్యమబాట పట్టింది. మనుష్య సంచారం లేని ప్రాంతాల్లో కూడా గులాబి జండా రెపరెపలాడింది. ఒక విధంగా తెలంగాణ నేలంతా ఉద్యమించిందనే చెప్పాలె. ఎవరికివారు స్వచ్చందంగా ఇందులో భాగస్వాములయ్యారు. అయితే ఇందులో బిఆర్ఎస్ కన్నా ముందు అనేకానేక సంస్థలు, మేధావుల కృషిలేకపోలేదు. ప్రాణత్యాగాలున్నాయి. ఇంకా చెప్పాలంటే 1969 కన్నా ముందు నుండే ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను లెక్కలు కట్టి, అన్యాయాలపై పుస్తకాలు ముద్రించి ప్రజల్లో భావ వ్యాప్తికి దోహదపడినవరనేకుల కృషి ఉంది.
వారు అందించిన చైతన్యం ఈ పద్నాలుగేళ్ళ నిర్విరామ పోరాటానికి బాటలు వేసింది. తాను ఉద్యమాన్ని ప్రారంభించేప్పుడు గుప్పెడుమందే తనవెంట ఉన్నారని తరుచూ కెసిఆర్ చెప్పే ఆ గుప్పెడు మందిలో ప్రొఫెసర్లు కొత్తపల్లి జయశంకర్, కేశవరావు జాదవ్, బియ్యాల జనార్థన్రావు, విద్యాసాగర్ రావు,వి. ప్రకాశ్, ఇన్నయ్యలాంటివారి కృషి లేకపోలేదు.
ఈ మలివిడత ఉద్యమంలో తెలంగాణ సాహిత్యం, భావజాల వ్యాప్తి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది . తెలంగాణ కవులు, కళాకారులు ఉద్యమ ఆటపాటలతో ప్రజలను ఉర్రూత లూగించారు. ధూం ధాం పాటలు పల్లె జనాన్ని కదిలించింది. రచయితలు వాస్తవ చరిత్రను ప్రజల ముందుంచారు. 2011 సెప్టెంబర్ 13న జరిగిన సకలజనుల సమ్మె ఉద్యమాన్ని మరోకోణంలోకి తీసుకెళ్ళింది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు 42 రోజులపాటు సమ్మె చేయడం మరో చరిత్ర. సాగరహారం, మిలియన్ మార్చ్ ఇవన్నీ ఒక ఎత్తు కాగా, కెసిఆర్ ఆమరణ దీక్షతో ఉద్యమం కీలకదశకు చేరుకోవడానికి కారణమైంది కూడా ఈ పద్నాలుగు ఏళ్ళ కాలంలోనే. అది 2009 నవంబర్ 29. ఆనాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య. ఆయన అధికారం చేపట్టి అప్పటికి మూడు మాసాలే అయింది. ఆమరణ దీక్షకోసం కెసిఆర్ సిద్దిపేట బయలుదేరారు. అప్పటికే అలర్ట్ అయిన పోలీసులు ఆయనను అలుగునూర్ వద్ద అరెస్టు చేయడం, నాటకీయంగా ఖమ్మం జైలుకు చర్చడం, అనేక పరిణామాల అనంతరం మొదటిసారిగా తెలంగాణ సాకారమవుతున్నట్లుగా నాటి హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటనకు దారితీసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో తెలంగాణ జర్నలిస్టులు కీలకమైన పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహంలేదు. ఉద్యమం చల్లబడకుండా ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం కలిగించడంలో వారి కృషి ఉంది.
ముందుగానే చెప్పుకున్నట్లు లక్ష్యాన్ని చేరుకోవడంతోపాటు అధికారం చేపట్టిన తొమ్మిదిన్నర ఏండ్లకే బిఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పదిహేను నెలల్లోనే అనేక ఆటుపోట్లకు గురవుతున్నది. దాదాపు పదిమంది ఎమ్మెల్యేలు చెయ్యి జారిపోయారు. మరికొందరు పార్టీ మారుతారన్న వదంతులు వొస్తున్నాయి. అధికారం కోల్పోయి క్యాడర్ నిరుత్సాహంగా ఉంది. త్వరలో స్థానిక ఎన్నికలు రానున్నాయి. ఈ తరుణంలో పార్టీ రజతోత్సవ వేడుకలు ఆ పార్టీకి కలిసి వొచ్చినట్లు అయింది. క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు ఒక అవకాశంగా మారింది. గతంలో ఏ రాజకీయ పార్టీ జరపని విధంగా సుమారు పది లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు.
పై నుండి క్రింది స్థాయి నాయకులందరికీ తలా ఒక బాధ్యతలను అప్పగించడం ద్వారా వారిని కార్యోన్ముఖులను చేస్తున్నారు. లక్షలాది మంది వొస్తున్నందున ఎక్కడ ఎలాంటి లోటు జరుగకుండా రెండువేల మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నారు. మండిపోతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని సుమారు పదిక్షల వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను సిద్దం చేస్తున్నారు. అనారోగ్య సమస్యలకుగాను వెయ్యికిపైగా వైద్య బృందాలను, 20 అంబులెన్స్లను సిద్దంచేస్తున్నారు. ఇంతపెద్ద ఏర్పాట్లు చేస్తూ, లక్షలాదిమందిని సభకు ఆహ్వానిస్తున్న బిఆర్ఎస్ అధినాయకుడు కొత్తగా ఏం ప్రకటిస్తారన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకిస్తున్న అంశం. ప్రధానంగా మరోసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే కార్యక్రమం ఉంది. విపక్షాలు ఈసారి అధ్యక్ష పదవిని బిసికి లేదా ఎస్సీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో అపర మాంత్రికుడిగా పేరున్న కెసిఆర్ తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీ భవిష్యత్ను నిర్దేశించేవిగా ఉంటాయన్నది మాత్రం స్పష్టం.