– గిరిజన సంక్షేమం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ అధికారులను ఆదేశించారు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. జాతరకు గిరిజన సంక్షేమ శాఖ రూ.150 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.90 కోట్లు సివిల్ వర్క్స్కు, రూ.60 కోట్లు నాన్ సివిల్ వర్క్స్కు ఉద్దేశించినట్లు తెలిపారు. సివిల్ వర్క్స్ స్టేటస్, నాన్ సివిల్ వర్క్స్ యాక్షన్ ప్లాన్ మీద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్యసాచి ఘోష్ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్తో మాట్లాడారు. జాతర ఏర్పాట్లను మొత్తం 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. జోన్-3 జంపన్న వాగు ప్రాంతంగా నిర్ణయించినట్లు, జాతర సమయంలో 10 నుండి 12 వేలమంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నట్లు, ప్రతి జోన్కు ఒక జోనల్ ఆఫీసర్ను నియమించనున్నట్లు తెలిపారు. 24 శాశ్వత టవర్స్, 20 సెల్-ఆన్-వీల్స్, 350 వై-ఫై పాయింట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కోర్ రూట్లు, పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. మొత్తం 49 పార్కింగ్ ప్రదేశాలు (1050 ఎకరాలు) గుర్తించగా దాదాపు 4.5 నుండి 6 లక్షల వాహనాలు నిలిపే సదుపాయం కల్పించనున్నారు. ఈ ఏర్పాట్లు నవంబర్ 30 నాటికి పూర్తవుతాయని తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 24I9 ఫారెస్ట్ రోడ్లు (కచ్చా నుండి డబుల్ లేన్) రూపంలో అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో వైల్డ్లైఫ్ శాంక్చువరీలోని రహదారులు కూడా చేర్చారు. ఆర్ అండ్ బీ శాఖ ద్వారా రూ.42 కోట్లతో ఆలయం చుట్టూ రహదారులు, రూ.92 కోట్లతో ప్రధాన రహదారులు నిర్మితమవుతున్నాయి. జాతర సమయానికి ముందు, మధ్య, తరువాత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సందర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. జంపన్న వాగు వద్ద తాత్కాలిక రహదారి కూలిపోయిన కారణంగా మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. 517 బోరుపాయింట్లు/నీటి వనరులు, 250 కి.మీ రహదారులపై లైటింగ్ పనులు జరుగుతున్నాయి. స్థానికుల సహకారంతో 6 స్లాటర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. జంపన్న వాగు పునరుద్ధరణ పనులు సాగిస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. 9,111 విద్యుత్ స్తంభాలు, 259 ట్రాన్స్ఫార్మర్లు అమర్చే పనులు విద్యుత్ శాఖ చేపట్టింది. జాతర ప్రాంతమంతా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశ ఏర్పాట్లు (ఇల్యూమినేషన్) చేయనున్నారు. సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ మహేష్ భగత్, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ములుగు ఎస్పీ, విద్యుత్ శాఖ సీఎండీ వరుణ్ రెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొని తమతమ శాఖల పనులపై నివేదికలు అందజేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





