– పటేల్ భారత్ చరిత్ర సృష్టించారు
– జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ
గాంధీనగర్,అక్టోబర్ 31: చరిత్ర రాయడంలో సమయం వృథా చేయకూడదని, దానిని సృష్టించాలని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విశ్వసించారని, అందుకే ఆయన దేశాన్ని ఏకం చేసి చరిత్ర సృష్టించారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. గుజరాత్లో ఐక్యతా విగ్రహం వద్ద పటేల్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత 550 సంస్థానాలను ఏకం చేసి అసాధ్యమైన పనిని సుసాధ్యం చేశారు. ఆయనకు ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ దార్శనికత అత్యంత ముఖ్యమైంది. దానిని మేం సమర్థిస్తాం అని అన్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే ఏక్తా దివస్ను జరుపుకొంటున్నాం. భారతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. విభజన శక్తులకు దూరంగా ఉండాలి. దేశ సమగ్రతకు మావోయిజం ముప్పుగా పరిణమించింది. మావోయిస్టుల ఏరివేత కోసం ఎన్నో ఆపరేషన్స్ చేశాం. మావోయిజం మూలాలను సమూలంగా పెకిలిస్తాం. కశ్మీర్ మొత్తాన్ని భారత్లో కలపాలని పటేల్ ఆకాంక్షించారు. దానిని నెహ్రూ గౌరవించలేదు. పటేల్, అంబేడ్కర్ను కాంగ్రెస్ అవమానించింది. ఆయన దూరదృష్టిని మరిచిపోయిందని అన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించింది. దానివల్ల కశ్మీర్, దేశంలో అశాంతి నెలకొంది. ఉగ్రవాదాన్ని దాయాది దేశం పెంచి పోషించింది. ఇంత జరిగినా ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తలవంచింది. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసింది. మన దేశం నిజమైన బలం ఏంటో ఆ ఉగ్రవాదులకు తెలిసింది. దేశ ఐక్యతను బలోపేతం చేసే చర్యలను ప్రోత్సహించాం. ఆయన ఆకాంక్షలను మేం గౌరవించాం. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటుంటే కొందరికి బాధగా ఉంటుంది. దేశం నుంచి చొరబాటుదారులను తరిమికొట్టాలని ప్రతిజ్ఞ చేద్దాం అని మోదీ పిలుపునిచ్చారు. పటేల్ జయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల చేశామని వెల్లడించారు. పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివస్ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ ఏర్పాటుచేశారు. ఇందులో సైనిక దళాల కవాతు ఆకట్టుకుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





