నారాయణగురు చూపిన మార్గంలో నడవాలి..
సమగ్ర సర్వే, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు ఆయనే స్ఫూర్తి
కేరళలో నారాయణ గురు ఓపెన్ వర్సిటీ సెమినార్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : మానవ జాతికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అదే మానవత్వం, సమానత్వమని సందేశం ఇచ్చి.. కేరళతో పాటు.. యావత్ భారతదేశాన్ని ప్రభావితం చేసిన నారాయణ గురు అందరికీ స్ఫూర్తి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఆదివారం కేరళ రాష్ట్రం కొల్లంలోని నారాయణ గురు ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ గురు ఇంటర్నేషనల్ లిటరసీ, కల్చరల్ ఫెస్టివల్లో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సెమినార్లో ముఖ్యఅతిథిగా భట్టి విక్రమార్క ప్రసంగించారు. నారాయణ గురు జీవితాన్ని, బోధనలను స్మరించేందుకు కొల్లంకు చేరుకోవడం తనకు ఒక విలువైన అవకాశం, గొప్ప గౌరవమని డిప్యూటీ సీఎం తెలిపారు.
సమానత్వంపై నారాయణ గురుకు ఉన్న దృఢమైన అభిప్రాయం, మానవత్వం, సమానత్వం అనే సందేశాలు నేటి కాలంలో ప్రధానంగా మారాయని తెలిపారు. నారాయణ గురు ఒక ఆధ్యాత్మిక నాయకుడికి మించిన వారని ఒక సంస్కరణ వాది, తత్వవేత్త, విప్లవకారుడు అని అభివర్ణించారు. కేరళ సమాజంలోని వివిధ కులాల్లో అన్యాయాలను నిర్మూలించడం ద్వారా ఆయన సమాజాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారని వివరించారు. అరువిప్పురం శ్రీ శివాలయం స్థాపన ఆయన చేసిన సాధారణ ఆధ్యాత్మిక చర్య కాదు.. అది కులవివక్షకు వ్యతిరేకంగా ఒక సాహసోపేతమైన ప్రకటన అని తెలిపారు. ఈ ప్రకటన కేవలం కేరళనే కాదు భారతదేశ మొత్తాన్ని ప్రభావితం చేసిందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కు, నారాయణ గురు ల మధ్య పోలికలు ఉన్నాయన్నారు.
నారాయణ గురును స్మరించుకునే సందర్భంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ను స్మరించుకోవడం సముచితమని తెలిపారు. నారాయణ గురు సమాజంలోని మార్పును కోరగా, అంబేడ్కర్ భారత రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని స్థిరపరిచారని తెలిపారు. ఇద్దరి వారసత్వాలు మన దేశ చరిత్రలో న్యాయానికి, సమానత్వానికి కొండంత ఆధారంగా నిలిచాయని తెలిపారు. కేరళ రాష్ట్ర సామాజిక పురోగతికి నారాయణ గురు నేతృత్వం ప్రధాన కారణమని అన్నారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య ఆలోచనల్లో సారూప్యత ఉందని తెలిపారు. తెలంగాణలో కొమురంభీం, చాకలి ఐలమ్మ నారాయణ గురు తరహాలోని సమానత్వం కోసం తిరుగుబాటు చేశారని వివరించారు. ఈ రెండు ప్రాంతాలు సమానత్వం, న్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. నారాయణగురు చూపిన మార్గంలో మనం ముందుకు సాగాలని, సామాజిక, ఆర్థిక సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
నారాయణ గురు కేవలం ఒక కల మాత్రమే కనలేదు, ఆ కలను నిజం చేసేందుకు సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఇప్పుడు మన కర్తవ్యం ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం, విభజనలను అధిగమించి ప్రతి ఒక్కరూ న్యాయంగా గౌరవంగా జీవించే సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. నారాయణ గురు జీవిత స్ఫూర్తిని మనమంతా స్వీకరించి సమానత్వం, న్యాయం, మానవత్వం కలిగిన సమాజాన్ని నిర్మిద్దామని భట్టి విక్రమార్క అన్నారు. ఈ విధంగా మనం కేవలం ఆయనకు గౌరవం ఇవ్వడమే కాదు మన భారతదేశానికి ఉన్న ప్రత్యేకతను కూడా ఉజ్వలంగా నిలిపే బాధ్యతను మనందరం నిర్వర్తించినట్లు అవుతుందని తెలిపారు.