అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్..
స్పీకర్ మాటకు కంగుతిన్న మాజీ మంత్రి హరీష్ రావు
గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లలకే రోడ్లు వేశారన్న మంత్రి కోమటిరెడ్డి
వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక, గ్రామాల్లో పిల్లలు ఇవ్వలేని దుస్థితి ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ ముక్తసరిగా చేసిన వ్యాఖ్య.. హరీష్ రావుకు షాక్ తగిలినట్లు అయ్యింది. బడ్జెట్ చర్చలో హరీష్ రావు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామానికి, మండలానికి రోడ్లు వేశామని అన్నారు. తమ ప్రభుత్వం గ్రామీణ రోడ్లకు అధికంగా ఖర్చు చేసిందన్నారు. దీనికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీటుగా జవాబిచ్చారు. గజ్వెల్, సిరిసిల్ల, సిద్దపేట తప్ప రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు వేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో వేసినవే తప్ప పదేళ్లలో ఎక్కడా లేవన్నారు. అలాగే ఈ మూడు నియోజకవర్గాల కోసం అన్ని నిధులను వాడారని దుయ్యబట్టారు. ఇదే సందర్భంలో స్పీకర్ ప్రసాదరావు జోక్యం చేసుకుని.. వికారాబాద్ జిల్లాలో రోడ్లులేక పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదని ముక్తసరిగా అన్నారు. దీంతో హరీష్ రావుకు దిమ్మతిరిగినంత పనయ్యింది. రోడ్లపై మరో రోజు చర్చకు సిద్దమని చెప్పారు.
అంతకుముందు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ…గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని తెలిపారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వారికి ఆరు నెలలు లేదా మూడు నెలలకు చెల్లిస్తామన్నారు. ప్రతీ గ్రామం నుంచి మండలానికి డబుల్ రోడ్లు వేయిస్తామని తెలిపారు. బిఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కే రోడ్లు వేశారని చెప్పారు. ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని పేర్కొన్నారు. ఛాలెంజ్ చేస్తున్నా.. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీశ్రావుకు సవాల్ విసిరారు. కోమటిరెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు హరీశ్రావు తెలిపారు. బిఆర్ఎస్ హయాంలో ఆర్అండ్బీ పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. రోడ్ల గురించి ఒకరోజు ప్రత్యేకంగా చర్చిద్దామని హరీష్ చెప్పారు.