– పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికే ప్రాధాన్యం
– బ్యారేజీల భద్రతే అత్యంత ముఖ్యం
– 2027 నాటికి శ్రీశైలం ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రాజెక్టు పూర్తి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
– బ్యారేజీల భద్రతే అత్యంత ముఖ్యం
– 2027 నాటికి శ్రీశైలం ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రాజెక్టు పూర్తి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: పెండింగ్లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సచివాలయంలోని తన ఛాంబర్లో ఉన్నతాధికారులతో మంగళవారం విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయని తెలిపారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో తుమ్మడిహట్టి భాగాన్ని మొదటి అంశంగా తీసుకుంటూ ఇంజనీరింగ్ బృందాలు రెండు ప్రత్యామ్నాయ కాలువ మార్గాలను పరిశీలిస్తున్నాయని, ఏ మార్గాన్ని ఎంచుకోవాలనే నిర్ణయం 22 నాటికి తీసుకుంటామని అన్నారు. మైలారం నుండి 71.5 కి.మీ గ్రావిటీ కాలువ, 14 కి.మీ సొరంగం ద్వారా సుందిళ్లకు నీరు తరలిస్తామన్నారు. మరో మార్గం ప్రకారం మధ్యలో పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి యెల్లంపల్లి ద్వారా నీటిని మళ్లిస్తామన్నారు. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఖర్చు, హైడ్రాలిక్ సామర్థ్యం, భౌగోళిక అనుకూలత, విద్యుత్ అవసరాలను సమీక్షించినట్టు తెలిపారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రాజెక్టును డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భూగర్భ ఎస్ఎల్బీసీ టన్నెల్ తెలంగాణ నీటి పారుదల నిర్మాణంలో కీలక భాగమని, ఇది శ్రీశైలం జలాశయాన్ని కరవు ప్రాంతాలతో అనుసంధానిస్తూ 43 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ ద్వారా వేల ఎకరాల వ్యవసాయ భూములకు కృష్ణా నదీ జలాలను అందించడానికి రూపొందించినట్టు తెలిపారు. సాంకేతిక, పరిపాలనా అడ్డంకులను తొలగిస్తున్నామని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఉన్నత స్థాయి పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కింద మెడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ సంస్థలు, నిపుణ సంస్థలను పునరుద్ధరణ పనుల్లో పాల్గొనమని కోరిందని చెప్పారు. ప్రముఖ ఐఐటీ సంస్థ ప్రధాన సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇది నీటిపారుదల శాఖకు చెందిన చీఫ్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)తో కలిసి పనిచేస్తుందని వివరించారు. “ప్రధాన ఐఐటీ బృందం నిర్మాణ రూపకల్పన, పరీక్షలు, పునరుద్ధరణ ప్రణాళికను చేపడుతుంది. వర్షాకాలానికి ముందు పరీక్షలు పూర్తయ్యాయి, వర్షాకాలం అనంతరం పూర్తి పునరుద్ధరణ రూపకల్పన ఒక సంవత్సరంలో పూర్తవుతుంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పునరుద్ధరణ ప్రక్రియ ఎన్డీఎస్ఏ సిఫారసులకు అనుగుణంగా ఉంటుందని, ఏదైనా వ్యత్యాసం లేదా ఆలస్యం జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వారానికి ఒకసారి పురోగతి సమీక్షలు నిర్వహించి సాంకేతిక ఫలితాలను పద్ధతిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ బ్యారేజీల భద్రత అత్యంత ప్రధానం. ప్రతి దశలో జాతీయస్థాయి సంస్థలు పాల్గొంటూ శాస్త్రీయ, పారదర్శక, సవరణాత్మక విధానాన్ని అనుసరిస్తున్నాం అని ఆయన తెలిపారు.
న్యాయపరమైన అంశాల పరంగా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (కెడబ్ల్యూడీటీ-2) ముందు జరుగుతున్న విచారణల పురోగతిని మంత్రి సమీక్షించారు. సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తెలంగాణ వాదనలు ముగించారని, ఆంధ్రప్రదేశ్ తమ సమర్పణలను ప్రారంభించిందని తెలిపారు. ప్రతి సమావేశానికి సంబంధించిన సవివరమైన నివేదికలను సిద్ధం చేయాలని, ఢిల్లీలోని న్యాయ బృందంతో, రాష్ట్ర ,సుప్రీంకోర్టు న్యాయవాదులతో సమన్వయం సాధించాలని, వాదనల్లో ఏకరూపత ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. సమ్మక్క–సారలమ్మ ప్రాజెక్టు పురోగతిని కూడా సమీక్షించారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)ను సంప్రదించి నీటి కేటాయింపు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టిఏసీ) ఆమోదం కోరిందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ చురుకుగా కొనసాగుతోందన్నారు. సీతమ్మసాగర్, మొడికుంటవాగు, చనక–కోరటా పంపిణీ వ్యవస్థలు, కాళేశ్వరం ప్రాజెక్టుల పెట్టుబడి ఆమోద దరఖాస్తులు ఢిల్లీలో సమర్పించామని, వాటి సమీక్ష ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్వై) పరిధిలో తుది దశకు చేరుకుందని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటని అన్నారు. ప్యాకేజీ-6 , అదనపు మూడవ దశ ప్యాకేజీలకు ఆమోదం లభించిందని తెలిపారు. భూ సేకరణ పరిహారంగా రూ.33 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆదేశించి, అన్ని సవరించిన అంచనాలను (ఆర్ఈలు) ఈ నెలలోనే ఆమోదించాలని సూచించారు. దేవాదుల పూర్తిగా కార్య నిర్వాహక సామర్థ్యాన్ని ఈ ప్రభుత్వ కాలంలోనే చేరుకుంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు గణనీయమైన భౌతిక పురోగతి సాధించింది.. త్వరలోనే భూస్థాయి ఫలితాలను ఇస్తుంది అని పేర్కొన్నారు. డిండి ప్రాజెక్టుపై సమగ్ర సమీక్షా నివేదిక సిద్ధం చేయాలని, ఇందులో భౌతిక పురోగతి, నిధుల వినియోగం. పెండింగ్ పనులు ఉండాలని ఆదేశించారు. రిజర్వాయర్ల మట్టిని తొలగించడం, అవక్షేపాలను తొలగించడంపై ముసాయిదా విధానాన్ని సమీక్షించారు. ఈ ప్రతిపాదన అదనపు ప్రభుత్వ వ్యయం లేకుండా రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మెరుగుపరిచే స్వయం సమర్థ విధానాన్ని రూపొందించడమే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





