కట్టిన మూడేళ్లలోనే కూలింది..
కెసిఆర్ ఎనిమిదో వింత మాటలు నిజమయ్యాయి
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26: ప్రపంచంలో ఎనిమిదో వింత కాళేశ్వరమేనని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మూడేళ్లలో ప్రాజెక్టను కట్టి దానిని మూడేళ్లలోనే కూలేట్టు చేసిన ఘనత మాజీ సిఎం కెసిఆర్దని అన్నారు. అందుకే ఇది ఎనిమిదో వింత అవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు తాము బయట పెట్టలేదని.. వాళ్లే బయట పెట్టారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ఒక నాసిరకం ప్రాజెక్ట్ అని విమర్శించారు. శనివారం గాంధీభవన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం మాట్లాడుతూ… కాళేశ్వరం తన మానస పుత్రిక అని మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. కాళేశ్వరం 8వ వింత అని కేసీఆర్ అనలేదా అని ప్రశ్నించారు. మూడేళ్లలో నిర్మాణం, మూడేళ్లలో కూలిపోవడం 8వ వింతగా కేసీఆర్ చెప్పిందే నిజమైందని విమర్శించారు.
ఎన్డీఎస్ఏ రిపోర్టు ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాగోతం బయటపడిందని విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసింది కేసీఆర్ అని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద ఈ ప్రాజెక్టు కట్టకుండా.. కమీషన్ల కోసం వేరే చోట ప్రాజెక్టు కట్టారని మండిపడ్డారు. త్వరలోనే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్డీఎస్ఏకు ఎస్ఎల్బీసీ ప్రమాదాన్ని విచారణకు ఎందుకు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని అన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ ఇచ్చిన రిపోర్ట్పై కేటీఆర్కు అవగాహన లేదని, ఆయన మాట్లాడకపోవడం చాలా మంచిదని అన్నారు.
మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ నిర్మిస్తే విఫలమవుతుందని రిటైర్డ్ ఇంజనీర్ అధికారులే చెప్పారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం కథ త్వరలోనే అందరికీ తెలుస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. రీడిజైనింగ్ పేరుతో కాళేశ్వరం చేపట్టి మోసం చేశారన్నారు. ‘తెలివున్న వారెవరైనా కాళేశ్వరం చేపడతారా? మేడిగడ్డ కుంగిపోవడం చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారు. మేడిగడ్డ, సుందిళ్ల పనికిరావని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. వాటిలో నీళ్లు నింపితే ఈపాటికే మొత్తం కొట్టుకుపోయేది. ప్రాజెక్టు నిర్మాణానికి తుమ్మిడిహట్టి సరైన ప్రాంతమని ఇంజినీర్లు చెప్పారు. తుమ్మిడిహట్టి పూర్తయితే కాంగ్రెస్కు పేరు వొస్తుందని పక్కన పెట్టారని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు.