- హైదరాబాదులో మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు
- కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొద్దిమందికే ఉద్యోగాలు
- గత పదేళ్లలో నిరుద్యోగులు అనేక అవస్థలు
- మధిర జాబ్ మేలాలో 5,000 మందికి ఉపాధి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: కోరి కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆ కొద్దిమంది రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వొచ్చాయని, గత పదేళ్లలో రాష్ట్రంలోని నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మధిర మండల కేంద్రంలో నిర్వహించిన భారీ జాబ్ మేలాలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆ మేరకు రాష్ట్రంలో మూడు అంచెల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. మొదట పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని తెలిపారు. మొదటి సంవత్సరంలోనే 56వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోందని తెలిపారు. రెండో దశలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజేషన్లో భాగంగా వచ్చిన మార్పుల మేరకు బహుళ జాతి సంస్థలకు రాష్ట్రంలో వనరులు ఏర్పాటు చేసి ఆ సంస్థల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయమని తెలిపారు.
బహుళ జాతి సంస్థలను ఆకర్షించి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ లో పర్యటించి 1.80 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నారని వివరించారు. ప్రస్తుతం సీఎం జపాన్ పర్యటనలో ఉన్నారని రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం ఈ పర్యటనలో భాగమమని అన్నారు. మూడవ దశలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 9,000 కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చామని, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఎంపికైన వారందరికీ రాష్ట్రవ్యాప్తంగా సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామని వివరించారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. భారతదేశం పారిశ్రామిక విప్లవాన్ని అందుకోలేకపోయింది, ఐటీ విప్లవాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని దూర దృష్టితో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ దేశంలో ఐటీ విప్లవానికి నాంది పలికారని తెలిపారు. వారి ఆలోచనల మేరకే హైదరాబాద్ లో నాటి కాంగ్రెస్ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి పునాదులు వేశారని గుర్తు చేశారు. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేలా మరో నాలెడ్జి సిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
చదువు పూర్తి చేసుకున్నవారు ఖాళీగా ఉండకుండా, సొంత ఆదాయంతో ముందడుగు వేసేందుకు జాబ్ మేలాలు ఉపయోగపడతాయి అన్నారు. ఇక్కడ ఉద్యోగం పొందిన వారు అక్కడే ఆగిపోకుండా ఇది మొదటి మెట్టుగా భావించి వచ్చిన జీతంతో నిరుద్యోగులు జీవితంలో పెట్టుకున్న గొప్ప లక్ష్యాలను సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. మధిరలో జాబ్ మేళా ద్వారా ఓకే రోజు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. యువత ఈ రాష్ట్రానికి గొప్ప వనరు, రాష్ట్ర జిడిపి పెరుగుదలకు, కుటుంబానికి, సమాజానికి వారు పెద్ద ఎత్తున ఉపయోగపడాలని ఆకాంక్షించారు. ఖాళీగా ఉండే యువత విద్రోహశక్తులు, మత్తు పదార్థాలకు బానిస అయ్యే అవకాశం ఉంటుంది, చివరి వయసులో తల్లిదండ్రులు బాధపడకుండా చూసుకోవాలి. యువత సన్మార్గంలో నడిచేందుకు జాబ్ మేళాలు ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి ఆలోచన మంచిది అయితే ఫలితాలు బాగా ఉంటాయి అన్నారు.
టెక్నికల్ స్కిల్స్ లేక ఉద్యోగాలు పొందలేకపోయిన వారికోసం రాష్ట్రంలోని 65 ఐటిఐ కళాశాలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించాలని ఆలోచనతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 60 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మాణానికి ఒకేసారి 11, 600 కోట్లు కేటాయించాం అన్నారు. ఈ స్కూల్స్ ద్వారా నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్య ఉచితంగా అందుబాటులోకి వస్తుంది అని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో విద్యారంగానికి ఒకేసారి ఇంత పెద్ద మొత్తం లో ఏనాడు నిధుల కేటాయింపు జరగలేదన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను అప్ గ్రేడ్ చేసి అన్ని వసతులు కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.