నీళ్లు, నిధులు, నియామకాల కోసం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీటి యుద్ధం మాత్రం కొనసాతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణలోని గోదావరి నీటిని దుమ్ముగూడెం అనికట్ ద్వారా నాగార్జునా సాగర్ కు తరలించి అక్కడ నుంచి కోస్తాంధ్రకు, రాయలసీమకు తరలించాలనే కుట్రతో దుమ్ముగూడెం టైల్-పాండ్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులివ్వగా తెలంగాణా ఉద్యమకారులు, ప్రజలు దీనిని వ్యతిరేకిస్తూ తీవ్రమైన ఆందోళనలు, ఉద్యమాలు చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైయ్యాక ప్రభుత్వం దుమ్ముగూడెం ఆనికట్ నుంచి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల ఉమ్మడి సరిహద్దు ప్రాంత (ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్, పాలేరు శాసనసభ నియోజక వర్గాలు) ప్రజలకు తాగు-సాగు నీరందించాలానే ప్రధాన ఉద్దేశంతో ప్రతిపాదనలను సిద్ధంచేశారు. ఆ ప్రతిపాదనల ఆధారంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 16, 2016న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని రోళ్లపాడు గ్రామంలో సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టు కింద మొత్తం 24 మండలాల ప్రజలకు సాగు, తాగు నీరు అందించేందుకే సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపడుతున్నామని శంకుస్థాపన సందర్భంగా అప్పటి సీఎం కెసిఆర్ వెల్లడించారు. గోదావరి నదిపై భద్రాచలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ (దుమ్ముగూడెం ఆనికట్/ సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు) నుంచి గోదావరి నీటిని లిఫ్టుల ద్వారా తరలిస్తూ రోళ్లపాడు వద్ద నిర్మించనున్న బ్యాలన్సింగ్ రిజర్వాయర్లో నిలువ చేసి అక్కడి నుంచి సీతారామ ప్రాజెక్ట్ ఫేజ్ -1 కాల్వ ద్వారా ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజక వర్గాల భూములకు సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందించడం. పేజ్ -2 కాలువ ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టుగా ఉన్న పాలేరు చెరువుకు నీళ్లు అందించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను నిర్ధేశించారు. జీవోఎంఎస్ నెం.11 ఇరిగేషన్• క్యాడ్ (ప్రాజెక్టు 1 18.02.2016) అనుసరించి ఈప్రాజెక్టు నిర్మాణ వ్యయం తొలుత రూ.7,926 కోట్లతో 34 నెలల్లో ఈప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈప్రాజెక్టు నీటి నిల్వ సామర్ధ్యం 75 టిఎంసిలు కాగా 6.5 లక్షల ఎకరాలకు సాగు నీరందించడం ప్రధాన ఉద్దేశం.
మారిన ప్రాజెక్ట్ స్వరూపం..
అయితే కొందరు నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏజెన్సీ, గిరిజన ప్రాంతాలపై, ప్రజలపై వివక్ష పూరితంగా వ్యవహరించి సీతారామ ప్రాజెక్ట్ ప్రతిపాదిత నమూనాను సమూలంగా మార్చి, సీతారామ ప్రాజెక్ట్ లక్ష్యాన్ని దెబ్బతీశారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత నమూనా (డీపీఆర్) ను, కాలువల నిర్మాణ దిశను మార్చారు. జీవో నెం.72 ఐ అండ్ క్యాడ్ ప్రాజెక్ట్ 2018లో మరో జీవో చేసి దాని ప్రకారం రీడిజైన్ చేశారు. దీని ద్వారాగోదావరి నదిపై వేరు వేరు ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజీవ్ సాగర్ (దుమ్ముగూడెం ఆనికట్) ఇందిరా సాగర్ (రుద్రం కోట) ప్రాజెక్ట్ లను విలీనం చేస్తూ సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎల్ఫీ) గా నామకరణం చేశారు. సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ.13,243 కోట్ల రూపాయలకు పెంచారు. కాగా ఇటీవల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామా ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ.19,800 కోట్లకు పెంచారు.
సీతారామా ప్రాజెక్టు రీడిజైన్ ద్వారా 6,74,387 ఎకరాల భూమికి సాగునీరు అందించాలని నిర్ణయించగా అందులో నూతన ఆయకట్టు 3,28,853 ఎకరాలు కాగా, నాగార్జున సాగర్ ఆయకట్టు ఇతర నీటివనరుల ద్వారా సాగవుతున్న 3,45,534 ఎకరాల సాగు భూమికి నీటిని స్థిరీకరించడం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానకి ఎల్%•% టీ కనస్ట్రక్షన్, కేఎన్ ఆర్ కనస్ట్రక్షన్, ఏసీపీఎల్, ఎస్వీకే మెఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా స్ట్రక్షర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కంపెనీలకు కాంట్రాక్ట్ లు కట్టబెట్టారు. కాగా నిర్మాణ పనులు సగం కూడా పూర్తి కాకుండానే 80 నుంచి 90 శాతం పనులు పూర్తి అయ్యాయని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆగమేఘాలమీద ఆగస్ట్ 15, 2024న సీఎం రేవంత్ రెడ్డి తో ఏన్కూరు లింకు కెనాల్ ప్రారంభించి సాగర్ కాలువకు నీటిని వదిలారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రూ.10 వేల కోట్ల ఖర్చు పెట్టినా ఇప్పటివరకు కొత్త ఆయకట్టు లోని ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదు.
మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు ప్రాంతాలకు అన్యాయం..
సీతారామా ప్రాజెక్ట్ మొట్టమొదటి ప్రతిపాదిత నమూనాను మార్చడం, రోళ్లపాడు/సీతా రామప్రాజెక్ట్ ను కాల్వలను రద్దు చేయటంతో ఏజెన్సీ నియోజకవర్గంగా ఉన్న ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజక వర్గాల్లోని భూములకు ఈప్రాజెక్టు ద్వారా చుక్క నీరు అందకుండా పోతోంది. సీతారామా ప్రాజెక్టు కారణంగా పాఖాలేరు మున్నేరు ప్రాజెక్టు ప్రతిపాదనను కేసీఆర్ ప్రక్కన పెట్టినట్లు సమాచారం. అయితే నాడు కృష్ణ నదిపై నందికొండ వద్ద నిర్మించాల్సిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ను 10 కిలోమీటర్ల దిగువన నిర్మించి ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు నీళ్లు రాకుండా చేసి అప్పటి ఆంద్రప్రదేశ్ పాలకులు ఈ ప్రాంతానికి మొదటి సారి అన్యాయం చేశారు. పాఖాలేరుపై మున్నేరు ప్రాజెక్ట్ నిర్మించకుండా సర్వేల పేరుతో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ పాలకులు ఈ ప్రాంతానికి రెండో పర్యాయం అన్యాయం తలపెట్టారు. తెలంగాణ ఏర్పడ్డాకా కేసీఆర్ మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రక్కన పెట్టడం వల్ల ఈ ప్రాంతానికి మూడవ దఫా అన్యాయం జరగింది. సీతారామా ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో తుమ్మల నాగేశ్వరా రావు సీతారామా ప్రాజెక్ట్ నీటీను నాగార్జున సాగర్ ఆయకట్టుకు తరలించుకు పోవడం మూలంగా ఈ ప్రాంతానికి నాలుగోవ సారి అన్యాయం జరుగుతోంది.
రాజకీయ ప్రయోజనాలకు ‘సీతారామ’ బలి..
మొదటి ప్రతిపాదిత సీతారామ ప్రాజెక్ట్ నమూనాకు ఆతర్వాత చేసిన రీడిజైన్ పూర్తి విరుద్దంగా/తేడాగా ఉందని గోదావరి రివర్ బోర్డ్ అథారిటీ తన వార్సిక నివేదిక 2018-19(పేజీ నం.31, పేరా నం.7.4.2)లో సైతం స్పష్టం చేసింది. ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజక వర్గాల ప్రజల తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి సీతారామ ప్రాజెక్ట్ మొదట ప్రస్తావించిన డిపిఆర్ ను సమూలంగా మార్చేసి పనులు చేస్తున్నారు. బాధిత ప్రాంతాలపై వివక్ష చూపుతూ నాగార్జున సాగర్ ఆయకట్టుగా ఉన్న సత్తుపల్లి, కల్లూరు, వైరా, ఖమ్మం, పాలేరు ప్రాంతాల రెండవ పంటకు నీళ్ళను తరలిస్తూ స్థిరీకరించటం సమంజసం కాదన్న వాదనలో ఆయా ప్రాంతాల విద్యావంతులు, మేథావులు, ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. కాగా నిర్మాణ సమయంలో పర్యవేక్షణ లోపించడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అభియోగాలు మోపబడ్డ కాంట్రాక్ట్ కంపెనీలకె లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ లు కట్టబెట్టడం, లెక్కకు మించి కాంట్రాక్ట్ కంపెనీలకు టెండర్లు ఇవ్వటం, కాలువలను ఇష్టారితిన మళ్లించడం, అధికార దుర్వినియోగం.
ఆర్ధిక దుర్వినియోగం, స్వార్ధపూరిత రాజకీయ ప్రయోజనాలు వెరసి సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి గందరగోళంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గతేడాది ప్రధాన కాల్వలకు రెండు చోట్ల గండ్లు పడి పంటపొలాలు మునిగిపోయాయి. ఈ సంవత్సరం ములకలపల్లి మండలంలోని వీకే రామవరం సమీపంలో పాసేజ్ పిల్లర్ కూలిపోయి సుమారు 200 మీటర్ల కాంక్రీట్ లైనింగ్ దెబ్బతినడంతో ఈ ప్రాజెక్ట్ కాలువల నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని గోదావరి నీటిను సీతారామా ప్రాజెక్ట్ ఆయకట్టు ప్రజలకు ఇవ్వకుండా కృష్ణా నది పరీవాహక ప్రాంతంగా ఉన్న నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతానికి అక్రమంగా తరలించుకు పోవడం సహజ న్యాయ సూత్రాలకు, జాతీయ అంతర్జాతీయ జల నియమాలకు పూర్తి విరుద్దం.
ఈ అక్రమ నీళ్ల తరలింపు మానవ హక్కుల ఉల్లంఘనకు, రాజ్యంగా ఉల్లంఘనకు పాల్పడడమే అవుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి భాద్యత వహించవలసి ఉంది. గత ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పని చేస్తున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన తుమ్మల నాగేశ్వరా రావు కనుసన్నల్లో ఈ ప్రాజెక్ట్ రీడిజైన్, నిర్మాణం జరుగుతోంది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అథారిటీ, సిడబ్ల్యూసి, కేంద్ర జలవనరుల శాఖ కల్పించుకొని సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనుమతులను రద్దు చేస్తూ, ప్రాజెక్ట్ పనులను పున: పరిశీలించి ఆయా ప్రాంతాలకు న్యాయం చేయాలి. ప్రాజెక్ట్ అవినీతి అక్రమాలపై, జాతీయ స్తాయిలో విచారణ చేపట్టి పాత, కొత్త డిపిఆర్లను బయట పెట్టాలి. మొదటి ప్రతిపాదిత ప్రాంతాలైన ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ శాసన సభ నియోజక వర్గాలకు సాగు, తాగు నీరు అందించాలి.
(సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జల కుట్రలను, అక్రమ నీటి తరలింపును నిరసిస్తూ)
విశ్వ జె. న్యాయవాది
రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ విద్యావంతుల వేదిక,
7793968907