– రియాజ్ ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
– హతుడు కానిస్టేబుల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
– రియాజ్ శిక్షార్హమైన నేరస్థుడు
– కానీ శిక్ష విధించాల్సిన వ్యవస్థ వేరు
– రాష్ట్ర మానవహక్కుల సంఘం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కానిస్టేబుల్ తుపాకీ గుంజుకుని, అతనిపై తిరగబడ్డాడనే పేరుతో షేక్ రియాజ్ ని పోలీసులు చంపేయటం బూటకపు ఎన్ కౌంటర్ మాత్రమే కాక, ఇది తెలంగాణ పోలీసు శాఖలో పెరుగుతున్న హింసా ప్రవృత్తికి నిదర్శనమని మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ నెల 17న తరచుగా బైకులు, చైన్ స్నాచింగ్ లాంటి దొంగతనాలు చేసే షేక్ రియాజ్ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో అతను బైక్ నడుపుతున్న కానిస్టేబుల్ ప్రమోద్ ను పాశవికంగా కత్తితో పొడిచి, అక్కడి నుండి పారిపోయాడు. ఊహించని ఈ దాడి కారణంగా కానిస్టేబుల్ దాదాపు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ కానిస్టేబుల్ న్యాయంగా డ్యూటీ నిర్వహిస్తుండగా, అతనిపై జరిగిన దాడిలో చనిపోవటం చాలా బాధాకరం. ఇది అందర్నీ నిర్గాంతపరిచిన విషయం. ఈ దుశ్చర్యకు పాల్పడిన హంతకునికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే. అయితే ఆ శిక్షను ఎవరు అమలు చేయాలనేదే నాగరిక సమాజంలో కీలకమైన విషయమని వారు పేర్కొన్నారు. నిందితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుండి తప్పించుకోకుండా పోలీసులు తగిన సాక్ష్యాధారాలతో అతని నేరాన్ని నిరూపించి, చట్ట ప్రకారం కోర్టు ద్వారా శిక్ష పడేలా చేయటానికి ఇక్కడ పూర్తి అవకాశాలున్నాయి. కానీ, అలా కాకుండా పోలీస్ వ్యవస్థ రియాజ్ ను హత్య చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తున్నదని వారు ప్రకటనలో పేర్కొన్నారు. ముందస్తు పథకం ప్రకారం పోలీసుల మీద మరొకరు తిరుగుబాటు చేయకుండా, రియాజ్ ఉదంతం ఒక బెదిరింపుగా ఉండాలని చేసిన కౌంటర్ హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. ఆసుపత్రి నాలుగవ అంతస్తులో చుట్టుపక్కల వేరెవరు రోగులూ, వారి బంధువులూ లేకుండా ఉంచిన గదిలో జరిగిన ఈ హత్య నిజమైన ఎన్ కౌంటర్ కాదని నిరూపించడానికి మృతుని బంధువులకు గానీ, హక్కుల సంఘాలకు గానీ, స్వచ్ఛంద సంస్థలకు గానీ ఎటువంటి అవకాశం ఉండదు. కాబట్టి రూల్ ఆఫ్ లాను, కోర్టులను, రాజ్యాంగ నియమాలని కాపాడటమా లేక ‘వారిలో ఒక మనిషి చనిపోతే వారు ఊరుకుంటారా?‘ అని సరిపెట్టటమా అనేది ఈరోజు ప్రభుత్వం ముందూ, రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల కమిషన్ల ముందూ, హైకోర్టు, సుప్రీంకోర్టుల ముందూ ఉన్న ప్రశ్న అని అన్నారు. ఈ ఎన్కౌంటర్ను సుమోటోగా తీసుకొని విచారణ జరిపి చట్ట ఉల్లంఘనదారులు ఎంతటి వారైనా, వారికి శిక్షలు పడేలా చేయాలని హైకోర్టును, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ను కోరుతున్నామన్నారు. దీనికి సంబంధించి హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను తక్షణమే సస్పెండ్ చేసి వారిపై హత్య నేరం మోపాలని కోరారు. రియాజ్ చేతిలో మరణించిన ప్రమోద్ కుటుంబానికి మా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





