బడి సదువులు బాగు పడేదెలా!?

“లక్షల సంఖ్యలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖాలీల లెక్కలు ప్రభుత్వం దృష్టిలో లేవనుకోలేము. జిల్లా విధ్యాధికారి పోస్ట్ నుండి ఆఫీస్ సబార్డినేట్ సిబ్బంది వరకు ఉన్న  ఖాలీల సంఖ్య ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. వందల పాఠశాలల్లో గంట కొట్టేందుకు ఆఫీస్ సబార్డినేట్లు, ఆఫీస్ పనులకు గుమస్తా సిబ్బంది లేరు. వెయ్యి మంది ,ఆపై ఎక్కువ విద్యార్థుల నమోదు శాతం కలిగిన ఉన్నత పాఠశాలల్లో సైతం బడి గంట కొట్టేందుకు కనీసం తాత్కాలిక సిబ్బంది కూడా లేకపోవడం విచారకరం..”
T.P T.F ఉపాధ్యాయుడు.
మొబైల్ : 9951624126

ప్రభుత్వ విద్య అభివృద్ధి పై కాంగ్రెస్ సర్కారు కురిపిస్తున్న అభిమానంలో నిజాయితీ ఉందనే  భ్రమలలోంచి తెలంగాణ సమాజం తేరుకోవాలి. ఆలోచనలో కపట ప్రేమ, అమలు చేసే పథకాల డొల్లతనం, ఆచరణలో వైఫల్యాలు, పాఠశాల నిర్వహణలో లోపాలను గమనించాలి. బడిబాట నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోలేక పోవటానికి గల వాస్తవ కారణాలను ఆవగతం చేసుకోవాలి. మండుటెండలలో బడిబాట నిర్వహించినా కూడా నమోదు శాతం లక్ష్యాన్ని ఎంతో కొంతైనా కూడా అధిగమించలేక పోతున్నాం. ఇప్పటికే ఉన్న నమోదును కాపాడుకోలేక పోతున్నాం. పాఠశాల విద్య నిర్వహణ మార్గదర్శకాలను ప్రభుత్వం నిర్ధేశించాలి.అధికారులు అమలు చేయాలి. కానీ అధికారులే విద్యా నిర్వహణ మార్గదర్శకాలు రూపొందించే పేరిట ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తే విద్యాభివృద్ధి కునారిల్లి పోతుంది. ఆ ఫలితాల మేరకు మూడు, నాలుగు సెక్షన్లతో ఉండేటి   వందల ప్రభుత్వ పాఠశాలలు నమోదు శాతం పడిపోవటంపట్ల, జీరో నమోదు పాఠశాలలుగా మారుతున్నాయి.ఇందుకు ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యాభారం మోసేందుకు గల విముఖతయే కారణమనాలి. ఒక వైపు విద్యార్థుల నమోదు ఉన్న  బడిలోనే  మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటుంది . మరొక వైపు మౌలిక సదుపాయాలు,చాలినంత సిబ్బంది ఉన్న  బడులకే పిల్లలను పంపే ఉద్దేశంతో తల్లిదండ్రులున్నారు .. ఈ డోలాయమాన పరిస్థితులు కొంత కాలంగా కనిపిస్తున్నాయి. అంతిమంగా ఈ ధోరణులు పాఠశాలల మూసివేతకు దోహదపడుతున్నాయి.

లక్షల సంఖ్యలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖాలీల లెక్కలు ప్రభుత్వం దృష్టిలో లేవనుకోలేము. జిల్లా విధ్యాధికారి పోస్ట్ నుండి ఆఫీస్ సబార్డినేట్ సిబ్బంది వరకు వున్న ఖాలీల సంఖ్య ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. వందల పాఠశాలల్లో గంట కొట్టేందుకు ఆఫీస్ సబార్డినేట్లు, ఆఫీస్ పనులకు గుమస్తా సిబ్బంది లేరు. వెయ్యి మంది ,ఆపై ఎక్కువ విద్యార్థుల నమోదు శాతం కలిగిన ఉన్నత పాఠశాలల్లో సైతం బడి గంట కొట్టేందుకు కనీసం తాత్కాలిక సిబ్బంది కూడా లేకపోవడం విచారకరం.తాత్కాలిక పద్దతిన ఏర్పాటు చేసిన స్వచ్ఛ్ వర్కర్ సిబ్బందికి ఇచ్చే అతి తక్కువ జీతం రెండు,మూడేండ్లకు కానీ మంజూరు కావు. బోధనా సిబ్బంది కొరత రాష్ట్ర వ్యాపితంగా స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూంది. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ఉపాధ్యాయుల వర్క్ అడ్జస్ట్ మెంట్ అనే ప్రహసనం కొంతకాలంగా కనిపిస్తున్నది. ఇది అనధికార హేతుకీకరణను తలపిస్తుంది. జీరో నమోదు, ఇరవై మంది విద్యార్థులు కన్నా తక్కువ నమోదు వున్న పాఠశాలల ఉపాధ్యాయులు ,మండల స్థాయిలో, సమీప మండల స్థాయిలో డిప్యుటేషన్లకు కదిలిపోక తప్పదు.ఇంతగా ఈ వర్క్ అడ్జస్ట్ మెంట్ వ్యవహారం తరువాత కూడా ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉండటం లేదు.
తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే కనీస ఆంశం ప్రభుత్వాలు ఏనాడో మరచిపోయాయి. అడ్మిషన్లు,టి.సి. లు రాసేందుకు ఒకరు , పరీక్షల నిర్వహణకు ఒకరు, ఉచిత పాఠ్య,నోట్ పుస్తకాల పంపిణీకి ఒకరు, ఏకరూప దుస్తుల పంపిణీకి ఒకరు, ఇలా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరీకీ ఏదో ఒక ఆదనపు బాధ్యతలు తప్పటం లేదు.ఫలితంగా జూన్ నెల మొత్తం తరగతుల నిర్వహణ నామమాత్రమే! విద్యాసంవత్సరం ప్రారంభ నుండే విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించఘ లక్ష్యంతో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు పాఠశాలల తనిఖీ కోసం బృందాల ఏర్పాటు,ప్రారంభ పరీక్ష ఫలితాలు పోస్టింగ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల భారం,వడ్డీల చెల్లింపుల ఫలితంగా నిధుల లేమి వెరసి పాఠశాలల మౌలిక సౌకర్యాల ఏర్పాటు అవసరాన్ని మరచిపోయేలా చేసింది. రక్షిత తాగునీటి సౌకర్యం, వాష్ రూంల ఏర్పాట్లు లేని పాఠశాలల సంఖ్య తెలియంది కాదు.ఇన్ని సమస్యలతో వున్న పాఠశాల విద్య బాగుపడేందుకు ప్రభుత్వం నిజాయితీ తో శాస్త్రీయ  వైఖరితో కార్యాచరణ అమలు చేయాలి..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరగటానికి ఆచరణ యోగ్య మైన  ఫథకాలు సిద్దంచేయాలి.
“ఒక వైపు విద్యార్థుల నమోదు ఉన్న  బడిలోనే  మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అంటుంది . మరొక వైపు మౌలిక సదుపాయాలు,చాలినంత సిబ్బంది ఉన్న  బడులకే పిల్లలను పంపే ఉద్దేశంతో తల్లిదండ్రులున్నారు .. ఈ డోలాయమాన పరిస్థితులు కొంత కాలంగా కనిపిస్తున్నాయి. అంతిమంగా ఈ ధోరణులు పాఠశాలల మూసివేతకు దోహదపడుతున్నాయి.”  
పథకాలకు లేదు- నిధుల భరోసా
తెలంగాణ పై ఉన్న మొత్తం రుణ భారం 2024-25 నాటికి రూ.6,89,021 కోట్లని కాగ్‌ తేల్చింది. ప్రభుత్వేతర రుణాలకు అత్యధిక గ్యారంటీలు ఇచ్చిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పింది. అత్యధిక అప్పుల భారం పెరిగిన రాష్ట్రాల్లోనూ తొలి స్థానాన్ని ఆక్రమించింది. 2015-16 నుంచి 2024-25 మధ్య పదేళ్లకాల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి కాగ్‌ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్ర అప్పులు ఏటా పెరిగిపోతున్నాయి. పదేళ్లలో నాలుగేళ్లపాటు రెవెన్యూ లోటులో పడిపోయింది. ప్రతి సంవత్సరమూ ఆర్థిక లోటులోనే కొట్టుమిట్టాడుతూంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ ప్రాధాన్యత రంగాలలో విద్యను విస్మరిస్తుంది. విద్యారంగం పై వార్షిక బడ్జెట్ లో కేటాయింపులు ఏమాత్రం సరిపోయేవి కావు.
ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి బడ్జెట్ లో నిధుల కేటాయింపును చూపటం వలన లబ్ధిదారులకు నమ్మకం కలిగే ఆవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందచేస్తున్న ఏయే పథకాలకు ఏయే ప్రయివేట్ సంస్థలు ఆర్ధిక సహకారం ఆందిస్తున్నాయో వాటన్నింటికి ప్రభుత్వ నిధుల వాటా కూడా ఉండాల్సిన అవసరముంది. ప్రైవేటు సంస్థల ఆధ్వర్యాన కొనసాగిస్తున్న పథకాల నిర్వహణా తీరుతెన్నులపై పూర్తి అజమాయిషీ ప్రభుత్వమే తీసుకోవాలి. లేనట్లయితే నాణ్యత ప్రమాణాలను ఆశించలేము. పాఠశాలల అభివృద్ధికి భూములను ఆర్థిక సంస్థలకు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పెట్టే ప్రయత్నాలు ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో చేస్తున్నామనే మాటలలో గల నిజాయితీని శంకించాల్సి వస్తోంది.
పాఠశాల విద్య విద్యార్థులు సంక్షేమానికి ఆమలుచేసే అన్ని రకాల పథకాల ప్రయోజనాలు రాష్ట్రంలో ప్రభుత్వ బడుల విద్యార్థులందరికీ సమానంగా నిర్వహణకు ఆందాలి.అమలు చేసే ప్రతి పథకానికి బడ్జెట్ లో నిధుల కేటాయింపులు తప్పక చూపాలి. ఈ రెండు అంశాలు విస్మరించబడితే ఆ పథకాలకు భవిష్యత్ మనుగడ ఉంటుందన్న  భరోసా లేదు.. అవి కేవలం ప్రజలకు భ్రమలు కల్పించటమే ఆవుతుంది. అమలు చేసే పథకాల సంఖ్య తగ్గినా కానీ విద్యార్థులందరికీ సమానంగా ఆందాలి.ఇరవై ఎనిమిది లక్షల మంది విద్యార్థులుంటే క్షేత్రస్థాయిలో ఆరేడు లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఆందుతున్న అల్పాహారం కూడా అదే రీతిన కొనసాగుతోంది.ఈ అసమానతల పథకాల ఆమలు ఫై రాష్ట్రమంతటా విశేషంగా ప్రచారం జరుగుతుంది.
వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, రంగారెడ్డి,వరంగల్ , హనుమకొండ జిల్లాలలో ఎంపిక చేసిన పాఠశాల ,కళాశాల విద్యార్థు లకు హరేకృష్ణ మూమెంట్‌ ఆధ్వర్యంలో బ్రేక్‌ఫాస్ట్‌ అందుతుంది.హైదరాబాద్,మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లోని 26,294 మంది విద్యార్థులకు 4,132 మంది కళాశాల విద్యార్థులకి మన్నా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బ్రేక్‌ఫాస్ట్‌ అందుతుంది.. బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని హరే కృష్ణ మూమెంట్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్,మున్నా ట్రస్ట్‌లు మొత్తం ఎనిమిది జిల్లాల్లో అమలు చేయనున్నాయి. ప్రభుత్వం అందించే పథకాలకు ప్రయివేట్ సంస్థల ఆర్ధిక సహకారాన్ని తీసుకోవటం వలన ఆ పథకాల కొనసాగింపు ఎంతకాలం ఉంటుందనేది  ప్రశ్నార్ధకంగా కనిపిస్తుంది.
ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు యూనిఫాంతో పాటు బ్రాండెడ్‌ బూట్లు, సాక్సులు, పాఠ్య ,నోట్ ఫుస్తకాలు,టై, బెల్టులను అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.688 కోట్లు కేటాయించింది.యాభై మంది విద్యార్థులున్న ఒక తరగతిలో నలుగురికి ఆ కిట్ అందచేశారు. మిగత విద్యార్థులకు ఆ కిట్ అందలేదని వారి తల్లి దండ్రులు ఆందోళన చేసే అవకాశం వుంది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు రెండ జతల యూనిఫారాల కోసం 2.97 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇందులో మఫత్‌లాల్‌ కంపెనీ 2.41 కోట్ల మీటర్లు, తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ 55.32 లక్షల మీటర్ల వస్ట్రం సరఫరా చేస్తున్నాయి. కుట్టుపని బాధ్యతలను స్థానిక స్వయంసహాయక సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది. జూలై ఒకటవ తేదీ నాటికి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు యూనిఫాం అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకం ప్రారంభం నుండి కూడా ఉచిత ఏకరూప దుస్తులలో నాణ్యత ఏ కోశానా కనిపించలేదు. స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం , విద్యారంగాధికారుల జోక్యం తో వస్త్ర నాణ్యత క్షేత్ర స్థాయిలోకి వచ్చేసరికి కనిపించదు. కుట్టులో నాణ్యత జీరో శాతంగా ఉండటంతో  విద్యార్థుల కు ఆందిన నెల రోజులలోనే ఆనుపయోగంలోకి చేరుతున్నాయి. క్లాసుల వారీగా కొలతలు కాకుండా విద్యార్థుల నుండి వ్యక్తిగత కొలతలు సేకరించాలి.కుట్టు , దారం , గుండీలు ,హుక్కులు, జిప్పులు వంటి సామాగ్రి ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు వుండటం లేదు.
పాఠశాల విద్య అభివృద్దియే ప్రభుత్వ లక్ష్యం ఆని భావిస్తే రాష్ట్ర చరిత్రలో ఏనాడు చూడని విధంగా ఉపాధ్యాయుల ఆరు డి.ఏ. లు , నాలుగేళ్ళుగా దరికి రాని పి.ఆర్.సి. కమిషన్ ఆమలు, వేలాది మంది ఉపాధ్యాయుల పదవీ విరమణ బకాయిల చెల్లింపులు, కోట్ల రూపాయల వివిధ పెండింగ్ బిల్లుల చెల్లింపు పై దృష్టి పెట్టాలి. ఇందుకు భిన్నంగా ఉపాధ్యాయుల జీతాలు ఎక్కువున్నాయని ఎలుగెత్తి చాటి ,ముఖ్యమంత్రి తెలంగాణ సమాజానికి, ప్రభుత్వ ఉపాధ్యాయులకు మధ్య దూరం పెంచే పనిలో ఉన్నారు.ఆరుట్ల బడిని చూసి మురిసి పోవటం కన్నా రాష్టంలో “ఇరవై ఏడు వేల” ప్రభుత్వ బడులను ఆరుట్ల బడిగా అభివృద్ధి చేయటానికి నిజాయితీగా కార్యాచరణ రూపొందించాలి. ఇందుకు భిన్నంగా రాష్ట్రంలోని ఇరవై మూడు వేల బడులకు సమాధి కట్టేందుకు సిద్దపడుతున్న ప్రభుత్వం విద్య మీద చూపిస్తున్న కపట ప్రేమను పరిశీలించాలి. ప్రజలను మభ్య పెట్టే ఈ పథకాల డొల్లతనాన్ని అర్ధం చేసుకోవాలి. ప్రభుత్వ విద్యను కాపాడు కో వటం ఒకసామాజిక బాధ్యతగా తెలంగాణ సమాజం భావించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *