హైడ్రా అంటే ఎందుకు కడుపు మంట?

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 8: హైడ్రా విద్యుక్త ధర్మంలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకున్నామని, ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. . 1908 లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయి. ఆనాడు వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిజాం నిర్మించారని గుర్తుచేశారు. హైదరాబాద్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు.  మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చామని తెలిపారు. బెంగుళూరులో చెరువులను పరిరక్షించుకోకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వరదల సమయంలో ముంబై, చెన్నై వరదలతో సతమతమవుతున్నాయని తెలిపారు. మరోవైపు కాలుష్యాన్ని నియంత్రికపోవడంతో దిల్లీలో పార్లమెంట్ నుంచి పాఠశాల వరకు సెలవులు ప్రకటిస్తున్న పరిస్థితి నెలకొందని అన్నారు. మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయి. ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి  అందుకే ఎవరేం అనుకున్నా హైడ్రాను తీసుకొచ్చాం. చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించదు. హైదరాబాద్ లో చిన్న వర్షం వస్తే కాలనీలకు కాలనీలే మునిగిపోతున్నాయి.  హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు.. రోడ్డుపై నీరు నిలవకుండా,  విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా, వర్షాలు పడిన సమయంలో ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యతను హైడ్రా చూసుకుంటోంది. నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి.  కొందరు రోడ్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు.

వీటిని నియంత్రించాల్సిన అవసరం లేదా? నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యంగా వదిలేద్దామా? అందుకే హైడ్రాను ఏర్పాటు చేసుకున్నాం.  హైడ్రా ద్వారా చెరువులను కాపాడి వాటిని పునరుద్ధరిస్తున్నాం.  చెరువులను , నాలాలను, మూసీని ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే కోపం.  అలాంటి కొంతమంది మా నిర్ణయాలను వ్యతిరేకించినా… ప్రజల కోసం మేం వెనక్కి తగ్గేది లేదు.  పునరుద్ధరించుకుంటామంటే కొందరికి బాధ అవుతోంది. ప్రకృతిని కాపాడుతామంటే కొందరికి దుఃఖం వొస్తోంది. ఆక్రమణలు తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందని మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు.  వాళ్ళు కడుపు నిండా విషం నింపుకుని ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు మేలు జరగొద్దని చూస్తున్నారని, గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా నది, దిల్లీలో యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేసుకుంటున్నారని, కానీ మేం మూసీని పునరుద్ధరణ చేస్తామంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకులు చేస్తే కరెక్టు.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పా…? అని ప్రశ్నించారు. తనపై కక్ష ఉంటే చూపండని, కానీ  ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దని హితువు పలికారు. వారసత్వ సంపదను కాపాడుకుని నగరాన్ని పునరుద్ధరించుకుందామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. హైడ్రా అధికారులు  పేదల పట్ల మానవీయ కోణంతో, సానుభూతితో వ్యవహరించాలని, పేదలకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, పెద్దల పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page