క్రియేటివిటీ హబ్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతాం

– ఫ్యూచర్స్‌ ఫండ్‌, ఈ-స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేద్దాం రండి
– ఇండియా జాయ్‌-2025 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 1: హైదరాబాద్‌ కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాదు.. భారత దేశపు క్రియేటివిటీ హబ్‌గానూ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వీఎఫ్‌ఎక్స్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ అసోసియేషన్‌(టీవీఏజీఏ) సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్‌ సిటీలోని హెచ్‌ఐఐసీలో రెండు రోజుల పాటు ఇండియా జాయ్‌ 2025 పేరిట నిర్వహించనున్న ఇండియాస్‌ ప్రీమియర్‌ మీడియా అండ్‌ ఎంటర్‌ెటైన్‌మెంట్‌ కాంగ్రెగేషన్‌ను శనివారం ఆయన శనివారం లాంఛనంగా ప్రారంభించారు. సాంకేతికత, సృజనాత్మకత కలిసే చోటుగా హైదరాబాద్‌ పిక్సెల్‌, కవిత్వం, అవకాశాల నగరంగా ప్రపంచానికి మార్గ నిర్దేశం చేస్తుందని మంత్రి వివరించారు. క్రియేటివ్‌ రంగానికి చేయుతనిచ్చేలా క్రియేటివ్‌ ఫ్యూచర్స్‌ ఫండ్‌, ఈ-స్పోర్ట్స్‌ అకాడమీ, మహిళా క్రియేటర్ల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫాంను ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సంబంధిత దిగ్గజ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 3.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్న భారతదేశ గేమింగ్‌ పరిశ్రమ విలువ 20 శాతం సీఏజీఆర్‌తో 2028 నాటికి 6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందన్నారు. దేశం మొత్తం వీఎఫ్‌ఎక్స్‌ అవుట్‌పుట్‌లో మన వాటా సుమారు 25 శాతం ఉండటం మనకు గర్వకారణమన్నారు. హైదరాబాద్‌ ఓటీటీ కంటెంట్‌ ప్రొడక్షన్‌లో 35 శాతం వృద్ధి రేటు నమోదు కావడం ఇక్కడి ఎకో సిస్టంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఇమేజ్‌ టవర్‌, ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌, ఏఐ సిటీ తదితరాల అందుబాటులోకి వస్తే ఈ ఎకో సిస్టం మరింత పటిష్టం అవుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇమేజ్‌ టవర్‌ను వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తెస్తామన్నారు. క్రియేటివిటీలో సానుభూతి, వైవిధ్యం, సస్టైనబులిటీ, భారతీయ గుర్తింపు ప్రతిబింబించేలా చొరవ తీసుకోవాలని యువ క్రియేటర్స్‌కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం నియంత్రించేదిగా కాకుండా కో క్రియేటర్‌గా మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్‌ జాజు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దిల్‌ రాజు, యువ కథానాయకుడు తేజ సజ్జా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌, టీవీఏజీఏ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ చిలక, కార్యదర్శి మాధవ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page