ఉద్దేశపూర్వకంగానే బిఆర్ఎస్ గొడవలు
గత పదేళ్లలో అన్నీ సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు?
గ్రామాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 : రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని, కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బిఆర్ఎస్ పత్రికలోనే చెప్పారని మంత్రి సీతక్క వెల్లడించారు. అంటే కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే కొంత గొడవ జరిగిందని, అది కూడా బిఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా చేశారని ఆరోపించారు. మిగతా 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతోందన్నారు. పదేళ్ల తర్వాత గ్రామ సభలు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారని, గ్రామ సభల్లోనే అర్హులని గుర్తిస్తున్నామని, గతంలో ఎమ్మెల్యేలు చెప్పిన వారికే పథకాలు వొచ్చేవని, ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలు ఇండ్లలో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేసేవారని విమర్శించారు. కానీ తమ ప్రజా ప్రభుత్వంలో గ్రామ సభల్లోనే ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా లబ్ధిదారులను గుర్తిస్తుంటే కావాలనే బిఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. బిఆర్ ఎస్ హయాంలో వోట్లప్పుడే పథకాలు అరకొరగా ఇచ్చేవారు. కానీ తాము ప్రజా అవసరాలు, ఆర్థిక వనరుల ను బట్టి పథకాలను అమలు చేస్తున్నాం.
పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు..అందుకే ఉద్దేశ పూర్వకంగా బిఆర్ఎస్ గొడవలు సృష్టిస్తోందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు ఆర్థిక సామాజిక రాజకీయ కుల సమగ్ర ఇంటింటి సర్వేలో పాల్గొనలేదు. ఇప్పుడు వాళ్ళకి పథకాలు రావనే ఆందోళన ఉంది. ఏ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజా పాలన దరఖాస్తులు తీసుకున్నాం. గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు తీసుకుంటున్నాం. బిఆర్ఎస్ చేతకాని తనం వల్లే సమస్యలు వొస్తున్నాయి. పదేళ్లలో అన్నీ సాఫీగా చేస్తే ఇన్ని సమస్యలు ఎందుకు? వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా రైతు బంధు ఇచ్చారు. కానీ లెక్కల కష్టాన్ని నమ్ముకున్న కూలీలకు ఎలాంటి సాయం చేయలేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఇస్తామని పేర్కొన్నారు. బిఆర్ఎస్ హయాంలో అద్భుతాలు ఏమి జరగలేదని, బెలూన్ లాగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఒకే సారి అమాంతం పైకి రాలేదని, బిఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందలేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసి , ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహించి.. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ బాటలు వేసిందని, మంచి నీ తమ ఖాతాల్లో, చెడును మంది ఖాతాల్లో వేయడం బిఆర్ఎస్ కు అలవాటేనని ఎద్దేవా చేశారు.
త్వరలో సర్పంచ్ ఎన్నికలు
సీఎం వొచ్చాక బీసీ కమిషన్ రిపోర్ట్ కు ఆమోదం లభిస్తుందని, రిపోర్ట్ దాదాపుగా పూర్తికావొచ్చిందని మంత్రి సీతక్క వెల్లడించారు. సర్పంచ్ ఎన్నికలను కూడా త్వరగా నిర్వహిస్తామని తెలిపారు. బిఆర్ ఎస్కు పాలన చేత గాదు అనీ తమపై విమర్శలు చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పాలించ లేదా అని సీతక్క ప్రశ్నించారు. కెటిఆర్ అందరికీ రైతు బంధు ఇవ్వాలని అంటున్నారని, 500 ఎకరాలు ఉన్నోళ్లకు రైతు బంధు ఇవొద్దని మా ప్రభుత్వం అనుకుంటుంటోందని చెప్పారు. గ్రామ సభలో ప్రదర్శించే జాబితాపై ప్రజల అభిప్రాయాలు తీసుకుని లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.