ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
మహేశ్వరంలో మలబార్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ తయారీ యూనిట్‌ ప్రారంభం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నామని, దీనిని డిసెంబర్‌ 9న ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. మహేశ్వరంలో మలబార్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ తయారీ యూనిట్‌కు ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ మలబార్‌ గ్రూప్‌ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. మహేశ్వరంలో ఫోర్త్‌ సిటీ (భారత్‌ ఫ్యూచర్‌ సిటీ)ని నిర్మించబోతున్నామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. పెట్టుబడులు పెట్టేవారికి లాభాలు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణపై నమ్మకం ఉంచిన మలబార్‌ గ్రూప్‌నకు అభినందనలు తెలిపారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ 2035 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. తెలంగాణ జీఎస్‌పీడీలో తయారీ తయారీ రంగంలోనూ తెలంగాణను హబ్‌గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ శివారుల్లో ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌, మహేశ్వరంలో జ్యూవెల్లరీ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌, జహీరాబాద్‌లో ఈవీ అండ్‌ డిఫెన్స్‌ హబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్‌ విండో సిస్టమ్‌ ‘టీజీ- ఐపాస్‌’ ద్వారా 4200 యూనిట్లకు అనుమతులు మంజూరు చేశామని, వీటిలో 98 శాతం యూనిట్లకు 15 రోజుల్లోనే అనుమతులిచ్చామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి టీజీ ఐపాస్‌ను ఏఐతో అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడిరచారు. ‘న్యూ ఇండస్ట్రియల్‌ పాలసీ 2025’ రూపకల్పనకు శ్రీకారం చుట్టామని, ఈ పాలసీ రూపకల్పనలో పారిశ్రామిక దిగ్గజాలను భాగస్వామ్యం చేస్తున్నామని, క్షేత్రస్థాయి అనుభవాలకు పెద్ద పీట వేస్తూ మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు. గ్రీన్‌ ఇన్సెంటివ్స్‌ ఫర్‌ క్లీన్‌ మాన్యుఫాక్చరింగ్‌, సెక్టార్‌ స్పెసిఫిక్‌ ఇండస్ట్రియల్‌ జోన్స్‌, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఏఐ ఆధారిత డిజిటల్‌ గవర్నెన్స్‌ తదితర అంశాలకు కొత్త పాలసీలో ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. మలబార్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ తెలంగాణను తయారీ రంగంలో హబ్‌గా తీర్చిదిద్దేందుకు దిక్సూచిగా మారుతుందని బలంగా విశ్వసిస్తున్నానన్నారు. తెలంగాణలో ఫర్నిచర్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకు రావాలని, ప్రభుత్వం తరఫున  సహకరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతిభ గల తెలంగాణ యువతకు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వంతో చేతులు కలపాలని శ్రీధర్‌బాబు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page