మళ్లీ ప్రిలిమ్స్ నుంచి పరీక్షల పక్రియ
పాత జీ.ఓ. ప్రకారమే ఎగ్జామ్ జరపాలని అభ్యర్ధన
పిసిసి చీఫ్, కెటిఆర్లతో విడివిడిగా అభ్యర్థల భేటీ
తెలంగాణలో గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షల వివాదం ముదురుతోంది. మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనతో నగరంలో వాతావరణం హీటెక్కింది. అటు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కీలక నేతలతో అభ్యర్థులతో భేటీ కావడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. గ్రూప-1 అభ్యర్థులు అటు కాంగ్రెస్, ఇటు బిఆర్ఎస్ నేతలను కలవడం చర్చనీయాంశంగా మారింది. గాంధీ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల డిమాండ్లను తెలుసుకున్నారు. జీ.ఓ. 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. పాత జీవో 55 ప్రకారం పరీక్షల నిర్వహణ జరగాలన్నారు. పాత నోటిఫికేషన్ లో ఇచ్చిన 503 పోస్ట్లలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వవద్దన్నారు.పెంచిన 60 పోస్ట్ ల్లో మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా 503 పోస్ట్ ల్లో60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది). జీ.ఓ. 29, రిజర్వేషన్ల అంశాల్లో కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరించి పరీక్షలు పెట్టాలనిమహేష్ ను కోరారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరి ప్రకారం పరీక్షలు ఉండాలని అన్నారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రభుత్వానికి సమాచారం అందిస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. సాయంత్రం వరకు దీనిపై తగిన సమాచారం ఇస్తామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కేటీఆర్ పై పీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు.
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అంటూ కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని కేటీఆర్ ను విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో నే.. డీఎస్సీ.. వైద్యారోగ్యశాఖ లో ఉద్యోగాలు. గ్రూప్స్.. పోలీసు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రు ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి మిగులు రాష్టాన్ని్ర అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు. ఇకపోతే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో గ్రూప్ -1 అభ్యర్థులు సమావేశమయ్యారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసేలా సర్కార్పై ఒత్తిడి తేవాలని కేటీఆర్కు అభ్యర్థులు విన్నవించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల సమస్యలను కేటీఆర్ విన్నారు. అయితే గ్రూప్-1 మెయిన్స్ను రీ షెడ్యూల్ చేయాలని గత కొద్ది రోజుల నుంచి అభ్యర్థులు డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కానీ కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఇదిలా ఉంటే ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ గత రాత్రి వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువు అభ్యర్థులు మాట్లాడుతూ జీ.ఓ. 29, జీ.ఓ. 55పై ఎటూ తేల్చకుండా, తప్పుడు ప్రశ్నల అంశాన్ని పరిష్కరించకుండా ఆగమేఘాల ద గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు గ్రూప్-1 పరీక్ష ప్రిలిమ్స్లో అన్ని ప్రశ్నలూ తప్పులతడకలేని, 150 ప్రశ్నలకు 20 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని గుర్తుచేశారు.
ఈ కేసులన్నీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కెటిఆర్ కు కూడా అభ్యర్ధులు వివరించారు. దీనిపై కెటిఆర్ సానుకూలంగా స్పందిస్తూ, దీనిపై న్యాయ సలహా తీసుకుంటామని హా ఇచ్చారు.. అభ్యర్దులకు అన్నివిధాల అండగా ఉంటామని కెటిఆర్ హా ఇచ్చారు. కాగా, గ్రూప్ 1 మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థులు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్షపై దాదాపు 33 కేసులు వచ్చాయని.. వాటన్నింటినీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులంతా ఒక్కసారిగా దూసుకురావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సమాచారం అందుకున్న పోలీసులు అభ్యర్థులను అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లకు తరలించారు. అయితే, ఈ వివాదం కొనసాగుతుండగానే ఈ నెల 21 నుంచి షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ నిర్వహణకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 14న టీజీపీఎస్సీ హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ క్రమంలోనే గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.





