ఆయుధాల చోరీ కేసులో నలుగురి అరెస్ట్

కేసు ఛేదించిన పోలీసులు, మిలిటరీ అధికారులు

‌హైదారాబాద్‌,‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11: ‌హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉన్న మద్రాస్‌ ‌రెజిమెంట్‌ ‌బెల్‌ ఆఫ్‌ ఆర్మస్‌లో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసును పోలీసులు, మిలిటరీ అధికారులు అత్యంత సమర్థవంతంగా ఛేదించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ ‌వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ ‌చేసినట్లు ఆయన తెలిపారు. చోరీకి గురైన అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆగస్టు 31న జరిగిన ఈ ఆయుధాల దొంగతనంలో బెల్‌ ఆఫ్‌ ఆర్మస్ ఇన్‌ ‌ఛార్జ్, అమ్యునేషన్‌ ‌సెక్షన్‌ ఇన్‌ ‌ఛార్జ్ ‌సహకారం ఉన్నట్లు విచారణలో తేలింది. మొదట బెల్‌ ఆఫ్‌ ఆర్మస్‌లోకి ప్రత్యక్షంగా ప్రవేశ అర్హత ఉన్న 16 మందిపై దృష్టి సారించిన అధికారులు, సుదీర్ఘ సాంకేతిక విచారణ చేపట్టారు. ఈ క్రమంలో హవాల్దార్లు టి.పి.ఎస్‌. ‌రావు, మల్లేశ్‌ అలియాస్‌ ‌రాజుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో వారిపై నిఘా పెట్టారు. విచారణ సమయంలో మల్లేశ్‌ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, సాంకేతిక ఆధారాలతో నిలదీయడం, అధికారులు అతడి భార్యకు పరిస్థితి వివరించడంతో అసలు నిజం బయటపడింది. భార్య గట్టిగా ప్రశ్నించడంతో మల్లేశ్‌ ఆయుధాల దొంగతనం ఒప్పుకున్నాడు. దర్యాప్తు వివరాల ప్రకారం.. నిందితుడు మల్లేశ్‌ ఆగస్టు 28, 29 తేదీల్లో ఆయుధాగారం వద్ద రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో సీసీ కెమెరాలు లేని మార్గాలను గుర్తించాడు. ఆగస్టు 30న కార్గిల్‌ ‌గేట్‌ ‌నుంచి లోపలికి వచ్చి పరిస్థితులను గమనించి, 31వ తేదీన పక్కా ప్రణాళికతో ఆయుధాలను చోరీ చేశాడు. ఆర్మీ నుంచి తనను అకారణంగా తొలగించారన్న కోపంతోనే మల్లేశ్‌ ఈ ‌చర్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆయుధాలను చోరీ చేశాక మొదట ఒక చోట పాతిపెట్టి, ఆ తర్వాత మరో ప్రాంతానికి ఎందుకు మార్చాడనే కోణంలో లోతైన విచారణ సాగుతోందని డీజీపీ వివరించారు. ఈ చోరీకి ఎలాంటి అంతర్జాతీయ ముఠాలతో గానీ, ఉగ్రవాద సంస్థలతో గానీ సంబంధాలు ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని డీజీపీ సీవీ ఆనంద్‌ ‌స్పష్టం చేశారు. దేశ అంతర్గత భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశం ఉన్న ఈ ప్రమాదకర ఆయుధాల చోరీని సత్వరమే ఛేదించిన మిలిటరీ అధికారులను, హైదరాబాద్‌ ‌సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ను, దర్యాప్తు బృందాలను డీజీపీ సీవీ ఆనంద్‌ ‌ప్రత్యేకంగా ప్రశంసించారు.

——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *