నీళ్ల మంత్రి ఉత్తమ్ సొంత జిల్లాలోనే సాగునీటికి కటకట
మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చి రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చిందని, పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కల్పించిందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సాగు నీటి శాఖ మంత్రి సొంత జిల్లా సూర్యపేటలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. యాసంగి సాగు నీటి విడుదల షెడ్యూల్ పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రకటనలు ఇచ్చారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ -2 లో భాగంగా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తదితర నియోజకవర్గాల్లోని 3,36,630 ఎకరాలకు సాగునీటిని వి+డుదల చేస్తామని ప్రకటనల్లో పేర్కొన్నారు.
ప్రచారం చేసుకున్నారు గానీ, రైతన్నల పంట పొలాలకు నీళ్లు మాత్రం విడుదల చేయడం లేదు. మీ ప్రభుత్వ మాటలు నమ్మి నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏం కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నాట్ల దశలోనే సాగునీటికి గోస పడితే, మన్ముందు సాగు నీటి సరఫరా ఎలా చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సహా మంత్రుల మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవని మరోసారి రుజువైందన్నారు. అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించడం మానేసి, ఇప్పటికైనా ఆచరణకు దిగండి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం మానేసి, పంట పొలాలకు నీళ్లు అందించండి. ఆందోళనలో ఉన్న రైతన్నకు దన్నుగా నిలవండి అని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.





