– తొలుత ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు
– ప్రజాప్రతినిధులతో మాట్లాడనున్న మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ అంశాలపై రెవెన్యూ, హసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం నుండి క్షేత్రస్థాయి సమీక్షలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు హిమాయత్నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, మధ్యాహ్నం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి ఇటువంటి సమావేశాలను దశలవారీగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తొలి విడతగా మూడున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయగా లక్షకు పైగా ఇళ్ళు గృహ ప్రవేశాలకు సిద్దమైన నేపధ్యంలో మంత్రి నిర్వహించే ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పూర్తి, కేటాయింపు, మౌలిక వసతుల కల్పన వంటి విషయాలను కూడా చర్చించనున్నారు. అంతేగాక త్వరలో రెండవ విడత ఇళ్ల మంజూరుకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా భూ వివాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, తాజాగా అమలు చేస్తున్న భూధార్ , సర్వేమ్యాప్ల వంటి కీలక రెవెన్యూ అంశాలపై జిల్లా అధికారులతో మంత్రి చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. అలాగే జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా హౌసింగ్ అధికారులు పాల్గొననున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




