మొత్తం 112 మంది వోట్లర్లు
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారని, 23న బుధవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, రెండు పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సిబ్బందితో పాటు మరికొంత మంది సిబ్బందిని రిజర్వ్ లో పెట్టామని చెప్పారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో నలుగురు చొప్పున సిబ్బంది ఉంటారని, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.
సుమారు 200 నుంచి 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. దాదాపు 500 మంది అధికారులు, సిబ్బంది ఎలక్షన్ డ్యూటీ లో పాల్గొంటున్నట్లు తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులకు మినహా జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో పనిచేసే మిగతా ఉద్యోగులకు 23న సెలవు దినంగా ప్రకటించినట్లు తెలిపారు. అట్టి ఉద్యోగులందరూ జూన్ నెల రెండో శనివారం 14-06-2025 కార్యాయ విధులకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, హైదరాబాద్ డిప్యూటీ కలెక్టర్ రవి, తదితరులు పాల్గొన్నారు.