భూ భారతితో సమస్యలకు పరిష్కారం…
కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను కాపాడుతాం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: భూ భారతి తో రైతుల భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూ భారతి చట్టాన్ని పటిష్టంగా అమలు పరిచేందుకు 4 జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసామని, ఆయా జిల్లాలలో జిల్లాకు ఒక మండలం ఎంపిక చేసి భూ భారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్) చట్టం అమలు చేస్తున్నామన్నారు. 2025, మే 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా 28 జిల్లాలోనూ జిల్లాకు ఒక మండలం ఎంపిక చేసి భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు పరుస్తామన్నారు.
వలిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం భూ భారతి(ఆర్ఓఆర్)చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోమన్ క్యాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కు నివాళులర్పించారు. తదనంతరం భూ భారతి కరపత్రాలను ఆవిష్కరించారు.
అంతకుముందు భూ భారతి చట్టంపై కలెక్టర్ హనుమంతరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గతంలో సాదా బైనామా ధరణిలో అవకాశం లేకపోవడంతో కోర్టు కూడా ఏమీ చేయలేకపోయిందన్నారు. ధరణి కింద స్వీకరించినా పరిష్కారం కాని 9.26 లక్షల దరఖాస్తులను భూభారతి లో పరిష్కరిస్తామన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ రెవెన్యూ, ఫారెస్ట్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములపై పోర్టల్ ద్వారా ఫిర్యాదులు అందించవచ్చని, ఆక్రమించిన వారు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.శిథిలావస్థకు చేరుకున్న తహశీల్దార్ కార్యాలయాలపై నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కోరిక మేరకు అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తానన్నారు. కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ…ధరణిలో అప్పీల్ వ్యవస్థ లేదని,నేరుగా కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి వొచ్చేదన్నారు. కానీ భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థ ఉండడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. అనంతరం మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఉర్ రెహమాన్ అవేస్ చిస్తీ, భువనగిరి మార్కెట్ చైర్మన్ కనుకుంట్ల రేఖ బాబురావు, వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్య భీమా నాయక్, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.