– ప్రయాణికుల వ్యానును ఢీకొన్న లారీ
– ఏడుగురు అక్కడికక్కడే మృతి
రామ్గఢ్, జూన్ 26: ఝార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల వ్యానును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా మెరుగైన చికిత్స కోసం రాంచీకి తరలించారు. ఈ ప్రమాదంతో ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది. మృతులంతా బ్యాండ్, తాషా బృందానికి చెందిన కళాకారులేనని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం గురువారం అర్ధరాత్రి సమయంలో రామ్గఢ్ జిల్లాలోని రజరప్ప పోలీస్స్టేషన్ పరిధిలో లారి-బర్లౌంగ్ సమీపంలోని రామ్గఢ్-బొకారో జాతీయ రహదారి (ఎన్హెచ్-23)పై జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా దెబ్బతిన్న వ్యానులో చిక్కుకున్న వారిని బయటకు తీసి రామ్గఢ్ సదర్ హాస్పిటల్కి తరలించారు. అయితే వారిలో ఏడుగురు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో రాంచీలోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బల్సగరా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, మారంగ్మర్చా గ్రామానికి చెందిన బ్యాండ్-తాషా బృంద సభ్యులు ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వ్యానులో వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మొత్తం అంతా ఒకే వాహనంలో తిరిగి బల్సగరా వైపు బయలుదేరారు. ఇదే సమయంలో రామ్గఢ్ వైపు నుంచి వేగంగా వస్తున్న బొగ్గు లారీ ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఎదురుగా వచ్చిన వ్యానును ఢీకొట్టింది. లారీ ఢీకొట్టిన వేగానికి వ్యాను పూర్తిగా ధ్వంసమైంది. వాహనం ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుల్లో ఆరుగురు మారంగ్మర్చా గ్రామానికి, ఇద్దరు బల్సగరా ప్రాంతానికి చెందిన వారిగా భావిస్తున్నప్పటికీ అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రామ్గఢ్ సదర్ హాస్పిటల్ సివిల్ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, మొత్తం ఎనిమిది మందిని ఆస్పత్రికి తీసుకువచ్చారని, వారిలో ఏడుగురు అప్పటికే మృతి చెందారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం రాంచీకి పంపినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. రామ్గఢ్ ఎస్డీపీఓ ఆలోక్ రంజన్ మాట్లాడుతూ, ప్రాథమిక దర్యాప్తులో లారీ రాంగ్సైడ్లోకి వచ్చి వ్యానును ఢీకొట్టినట్లు తెలుస్తోందన్నారు. వ్యానులో బ్యాండ్-తాషా బృంద సభ్యులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఢీకొట్టిన తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమైందని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ప్రమాదంతో మృతుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్గఢ్-బొకారో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో రహదారిపై రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. స్థానిక ప్రజలతో అధికారులు చర్చలు జరిపి రహదారి దిగ్బంధాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. గ్రామస్థుల ఆరోపణల ప్రకారం, ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ శాశ్వత భద్రతా చర్యలు తీసుకోవడం లేదన్నారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలకు కారణమవుతున్న ఈ ప్రాంతాన్ని ‘బ్లాక్ స్పాట్’గా గుర్తించి వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం ఇదే ప్రాంతంలో నాలుగు రోజుల వ్యవధిలోనే పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





