– పెట్రోల్, డీజిల్ సరఫరాపై వదంతులు నమ్మొద్దు
– సరఫరా పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్
– ఫిర్యాదుల కోసం అందుబాటులోకీ 1967 టోల్ ఫ్రీ నెంబర్
– అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేదని, ప్రజలకు సరిపడ సరఫరా చేసేందుకు అవసరమైన నిల్వలు ఉన్నాయని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. డీజిల్, పెట్రోలు కొరత ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అనవసరంగా ఆందోళన చెందకండి అంటూ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా, ఇతర సమస్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ అధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇంధన సరఫరా కోసం ప్రత్యేకంగా కంట్రొల్ రూమ్ను ఏర్పాటు చేశామని, ఫిర్యాదుల కోసం 1967 టోల్ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని, వ్యవసాయ అవసరాల కోసం డీజిల్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. ఇంధన సరఫరాలో ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడితే అప్పటికప్పుడు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో మానిటరింగ్ కమిటీ సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సాధారణ సరఫరాతో పోల్చి చూసినపుడు ప్రస్తుతం 210% డీజిల్ సరఫరాను, పెట్రోల్ సరఫరాను 132% పెంచినట్టు ఆయన పేర్కొన్నారు. రోజువారీగా పెట్రోల్, డీజిల్లు కలిపి 36,404 కిలో లీటర్లు సరఫరా చేస్తుండగా ప్రస్తుతం సాధారణ స్థాయి కంటే 175% అధికంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇంధన సరఫరాపై పుకార్లు షికార్లు చేసిన నేపథ్యంలో ప్రజల్లో అనవసర ఆందోళన మొదలై ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




