– ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తా
– డీజీపీ ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దని 1991, 1995, 1996 బ్యాచ్ల డీఎస్పీలకు డీజీపీ సి.వి.ఆనంద్ సూచించారు. పదోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు తాను చొరవ తీసుకుంటానని, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా బ్యాచ్లకు చెందిన డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా 37మందికి పదోన్నతులు రావాల్సి ఉంది. అయితే కొందరు అధికారులు కోర్టులను ఆశ్రయించడంతో పదోన్నతుల ప్రక్రియ పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో డీజీపీ చొరవ తీసుకుని తన కార్యాలయంలో ఆయా బ్యాచ్ల అధికారులతో సమావేశమయ్యారు. కేసుల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు వారం రోజుల సమయం ఇచ్చారు. కోర్టు కేసుల కారణంగా పదోన్నతుల ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోందని డీజీపీ తెలిపారు. ‘కేసులు వేసుకుని నష్టపోవద్దు.. మీ సమస్య పరిష్కారానికి నేను ముందుంటా.. అందరూ సహకరిస్తే త్వరగా పదోన్నతులు కల్పించవచ్చు’ అని అన్నారు. ప్రస్తుతం ఉన్న 37 అదనపు ఎస్పీ ఖాళీలకు వెంటనే పదోన్నతులు కల్పిస్తామన్నారు.
కేసుల ఉపసంహరణకు ముందుకు
డీజీపీతో సమావేశం అనంతరం వరంగల్ జోన్కు చెందిన 1991, 1995, 1996 బ్యాచ్ల అధికారులు కోర్టులో దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు డీజీపీ¾కి లేఖ అందించారు. హైదరాబాద్ సిటీకి చెందిన 1991, 1995,1996 బ్యాచ్ల అధికారులు కూడా కేసుల ఉపసంహరణకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డీఎస్పీల నుండి అదనపు ఎస్పీలుగా పదోన్నతుల అంశం కొలిక్కి వచ్చే అవకాశం ఏర్పడింది. డీజీపీ ఆనంద్ చొరవతో సమస్య పరిష్కారం దిశగా కదలిక రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





