– ఒక్కో వాహనానికి 200 లీటర్లకు మించి అమ్మరాదు
– పెట్రోల్ బంకులపై ఆంక్షలు విధించిన కేంద్రం
న్యూదిల్లీ,జూన్ 12: పశ్చిమాసియా పరిణామాలతో ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ను నింపవద్దని రిటైల్ అవుట్లెట్ల యాజమాన్యాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బల్క్ ఇంధన ధరలు, రిటైల్ ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా డీజిల్ ధర పెట్రోల్ బంకుల్లో లీటర్కు రూ.95.20గా ఉండగా.. బల్క్ ధర రూ.134.50 పలుకుతోంది. దీంతో ఇటీవల కొన్ని పరిశ్రమ వర్గాలకు చెందిన, వాణిజ్య వినియోగదారులు బల్క్ సప్లయ్ చైన్ల నుంచి కాకుండా పెట్రోల్ బంకుల నుంచి ఎక్కువ మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు అసాధారణ స్థాయిలో పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో రిటైల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీన్ని అరికట్టేందుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలిచ్చింది. పరిశ్రమ, వాణిజ్య అవసరాల కోసం వినియోగదారులు రిటైల్ పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. బల్క్ సప్లయ్ చైన్ల నుంచే వారు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. అంతేగాక, పెట్రోల్ బంకుల వద్ద ఒక వాహనానికి లేదా ఒక కస్టమర్కు రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ను విక్రయించొద్దని ఆదేశించింది. ఈ డీజిల్ను పునర్విక్రయించకూడదని సూచించింది. ఈ ఆదేశాలు తొలుత 90 రోజుల వరకు అమల్లో ఉంటాయని, అవసరమైతే పరిస్థితిని బట్టి పొడిగిస్తామని పెట్రోలియం మంత్రిత్వశాఖ తమ ఉత్తర్వుల్లో వెల్లడించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


