-ఫేజ్-1 వాల్యుయేషన్. ఫేజ్-2 విస్తరణకు కన్సల్టెంట్గా ‘ఎస్బీఐక్యాప్స్’
– కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ
– సమన్వయ సభ్యులుగా కేంద్ర అధికారి, ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ
– ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశంలో నిర్ణయం
– కేంద్ర మంత్రులతో సిఎం రేవంత్ చర్చలు ఫలప్రదం
దిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 23 : హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, విస్తరణపై కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై ఉన్న ఆటంకాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా రెండు రోజులు సమావేశమయ్యారు. తొలుత సోమవారం రాత్రి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఖట్టర్ నివాసంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్- 1 వాల్యుయేషన్, ఫేజ్-1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్-2 విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ను నియమించాలని కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్గా ‘ఎస్బీఐక్యాప్స్’(SBICAPS)ని ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్-1 వాల్యుయేషన్, ఫేజ్-2 విస్తరణ, ఇతర అంశాలపై ఈ సంస్థ సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టనున్నారు. అధ్యయనం సమయంలో కన్సల్టెంట్ సంస్థతో సమన్వయానికి ప్రతినిధులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి(ఎంఏ అండ్ యూడీ) శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ అధికారులు ఇద్దరూ సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియ వేగంగా సాగేందుకు కృషి చేస్తారు. ఈ పరిణామంతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు కేంద్ర ఆమోదం లభించడం సులభతరం కానుంది. ఇది హైదరాబాద్ నగర ట్రాఫిక్ కష్టాలను తీర్చడమే కాక, భవిష్యత్తు ప్రజా రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలవనుంది. కేంద్రమంత్రి ఖట్టర్ నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో.. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మెట్రో ప్రాజెక్టుకు అప్పులు, రెండో ఫేజ్కు అనుమతులు, నిధులు కావాలని సీఎం రేవంత్ కోరినట్లు సమాచారం. సమావేశంలో సీఎస్ రామకృష్ణ రావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు. రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలోనే ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపు తున్నారు. ఇప్పటికే దిల్లీలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు. అలాగే, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఉదయం దిల్లీకి చేరుకున్నారు.
రేవంత్ కోరారు.. కేంద్ర మంత్రులను కలిసాం : ‘ఎక్స్’లో కిషన్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సోమవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో, మంగళశారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో రేవంత్ సమావేశమయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణపైనే చర్చ జరిగింది. రేవంత్తో కలిసి కేంద్ర మంత్రులను కలవడంపై కిషన్ రెడ్డి సోషల్ డియా ఎక్స్ వేదికగా స్పందించారు.’కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు నాకు లేఖ రాశారు. 22వ తేదీన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో, 23వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో సమావేశం ఏర్పాటు చేయించాను. మెట్రో రైల్ విస్తరణపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎల్లవేళలా పనిచేస్తా’ అని ‘ఎక్స్’లో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





