– రూ.10 కోట్లు నష్టపరిహారం చెల్లించండి
– డిసెంబర్ 15కు వాయిదా వేసిన సిటీ సివిల్ కోర్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను ప్రచురించినందుకు, ప్రసారం చేసినందుకు ఈ దావా వేశారు. పరువు నష్టం కలిగించిన తప్పుడు సమాచారాన్ని తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆయన అందులో డిమాండ్ చేశారు. కేటీఆర్ ఫిర్యాదులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 2025 ఆగస్టు 8న బండి సంజయ్ తప్పుడు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలలో తెలంగాణ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్, ఆర్థిక అవకతవకలకు కేటీఆర్ను ముడిపెట్టారు. ఏబీఎన్ తెలుగు, ఎన్టీవీ, టీవీ 5, వీ6, ఏఎన్ఎన్ తెలుగు వంటి టీవీ ఛానెళ్లు, అలాగే ఇండియా టుడే, ఎన్డీటీవీ, డెక్కన్ హెరాల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లు, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్బుక్/ఇన్స్టాగ్రామ్) వంటి సోషల్ మీడియా సంస్థలు ఈ వ్యాఖ్యలను విస్తృతంగా ప్రసారం చేశాయి. ఈ వ్యాఖ్యలు కేవలం పరువుకు భంగం కలిగించడమే కాక తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయి. ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినప్పటికీ బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సంజయ్ కేవలం రాజకీయ కక్షతో విపరీతమైన నిందారోపణలతో దుష్పచారానికి పాల్గపడ్డరని ఆ ఫిర్యాదులో కేటీఆర్ పెర్కోన్నారు. కేంద్ర మంత్రి ఇలాంటి బాధ్యతారహితమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజాప్రతినిధుల విశ్వసనీయత, గౌరవానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని కూడా ఈ ఫిర్యాదు నొక్కి చెప్పింది. తన కేసులో బండి సంజయ్ నుండి బేషరతుగా బహిరంగ క్షమాపణ, తదుపరి పరువు నష్టం కలిగించే అంశాలను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిందితులను నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు విన్నవించుకున్నారు. కాగా, ఈ దావాపై సోమవారం విచారించిన కోర్టు తదుపరి విచారణకు డిసెంబర్ 15కు వాయిదా వేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





