రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఏమైనా జరుగుతున్నదా ? అయితే కుట్రదారులెవరు? వారికున్న బలమేంటి? కుట్ర రచన చేస్తున్నది రాజకీయ వర్గాల, వ్యాపార వర్గాల అన్నదిప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. సుమారు పదహారు నెలలకింద ప్రజాస్వామ్య రీతిలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉంది. పార్టీ అధిష్టానవర్గం ఆశిస్సులతో, రాష్ట్ర నాయకుల సమ్మ తితో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఎనుముల రేవంత్రెడ్డి ప్రభుత్వంపైన ఎందుకు ఈ ప్రచారం జరుగుతున్నదన్న విషయంలో అటు రాజకీయ వర్గాలు, ఇటు మేధావి వర్గాల్లో చర్చకు దారితీసింది. వాస్తవానికి రాష్ట్రముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదన్న ప్రచారం అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి వర్గాలు పెద్ద ఎత్తున కొనసాగించాయి.. వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ఆ మాట నిలుపుకోలేకపోయిందంటున్న వి పక్షాలు ఈ ప్రభుత్వం మూడునాళ్ళ ముచ్చటేనంటూ విమర్శిస్తూ వొచ్చాయి.
ఈ విషయంలో ప్రధానంగా బిఆర్ఎస్, అప్పుడప్పుడు బిజెపి పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కొందరు, ఆరు నెలలకే కుప్పకూలి పోతుందని ఇంకొందరు జ్యోతిష్యం చెబుతూ వొచ్చారు. బిఆర్ఎస్ నేతలైతే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, అదే జరిగితే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వొచ్చే అవకాశంలేకపోలేదన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వొస్తున్నారు. తాజాగా బిజెపి ఎంపి ఆరవింద్ అయితే ముఖ్యమంత్రిని మార్చే అవకాశముందని, సరైన వ్యక్తి కోసం అధిష్టానం చూస్తున్నట్లుగా పేర్కొన్నారు, అదే పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి పదహారు నెలలకే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోతుం దంటూనే, అయినా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం కొనసాగాలనే కోరుకుంటున్నామంటూ నర్మగర్భంగా మాట్లాడారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వీటన్నిటిపై ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ఘాటుగానే స్పందించారు. ఎవడ్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేదంటూ ముఖ్యమంత్రిగా ఇంద్రవెల్లిలో జరిగిన మొట్టమొదటి బహిరంగ సభలోనే రేవంత్రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. పలు సభలు, సమావేశాల సందర్భాల్లో ఇదే విషయాన్ని ఎత్తుకుని నేటికి విపక్షాలను చీల్చి చెండాడుతూనే ఉన్నారు.
అయితే తాజాగా బిఆర్ఎస్కు చెందిన దుబ్బాక ఎంఎల్ఏ కొత్త ప్రభాకర్రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనాత్మకంగా మారాయి. రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింది. ఆయన ఈ మాటలను అన్యాపదేశంగా అన్నారా లేక నిజంగానే దీని వెనుక రాజకీయ కుతంత్రం ఏదైనా నడుస్తున్నదా అన్న విషయంపై రాజకీయవర్గాలు విశ్లేషించు కుంటున్నాయి. ఇంతకాలం బిఆర్ఎస్ లేదా బిజెపిలు రేవంత్రెడ్డి ప్రభుత్వం పడిపోతుందంటూ వ్యాఖ్యా నించినా, ప్రజలను ఆకట్టుకోవడం కోసం సహజంగా ప్రతి పక్షాలు చేసే ఆరోపణలు గానే కొట్టి పారేయ వొచ్చు. కాని కొత్త ప్రభాకర్రెడ్డి మాటల్లో కొత్తదనం కనిపించింది.
గతంలో ఎంపీగా ఎన్నికైన ప్రభాకర్ రెడ్డికి సహజంగానే సౌమ్యుడన్న పేరుంది. గతంలో ఆయనెప్పుడు ఇలాంటి సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కాకపోవడంతో పలువురు పలు విధాలుగా ఆయన మాటలను విశ్లేషించుకుంటున్నారు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటూ తమకు అభ్యర్థనలు వొస్తున్నాయి. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు ఈ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కావాల్సిన వ్యయాన్ని భరించడానికి కూడా తాము సిద్దంగా ఉన్నామంటూ వారు తనతో చెప్పారన్న విషయాన్ని ప్రభాకర్రెడ్డి బహిరంగంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నది. దీని అర్థం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కావాల్సిన ఎమ్మెల్యేలను కొనుగోలుకు కావాల్సిన డబ్బును తాము సమకూరుస్తామని బిల్డర్స్, పారిశ్రామికులు తనతో చెప్పినట్లు తెలుస్తున్నది.
దీంతో కాంగ్రెస్పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు దీనిపైన ఘాటుగానే స్పంది స్తున్నారు. బిఆర్ఎస్పార్టీ అధిష్టానానికి తెలియకుండా ఇంత సీరియస్ మాటలను ఒక ఎమ్మెల్యే మాట్లాడే అవకాశ ముం డదన్న అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ మాటల వెనుక ఏదోఒక రాజకీయపార్టీ ఆలోచన లేకుండా ఉండదంటున్నారు. బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో ఉన్నారన్నది బహిరంగ రహస్యమే..! ప్రభాకర్రెడ్డిని కెసిఆర్ ఆత్మతో పోల్చిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీనివెనుక కెసిఆర్ ఆలోచన ఉండి ఉంటుంద ంటు న్నారు. కాగా చోటామోటా కాంట్రాక్టర్లు కూలిస్తే కూలిపోయే ప్రభుత్వం తమదికాదని పిసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ అంటే, ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర దారులను వెంటనే అరెస్టుచేయాలని పిసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవంగా తాను కావాలని అన్న మాటలు కావని, బిల్డర్లు, పారిశ్రామికులు తనతో అన్న మాటలే చెప్పానని కొత్త ప్రభార్రెడ్డి వివరణ ఇచ్చుకున్నప్పటికీ దీన్ని ఇలానే వదిలేయకుండా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని దర్యాప్తు జరిపించాల్సిన అవసర ముంది. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకారి, భవిష్యత్లో రాజకీయాలను బిల్డర్లు, వ్యాపారవేత్తలు శాసించేట్లుగా కనిపిస్తున్నది, తమకు నచ్చని ప్రభు త్వాన్ని గద్దె దింపి, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని లేదా వ్యక్తులను గద్దె నెక్కించే ధోరణి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం.