“అక్కడి ఆంధ్ర ప్రముఖులు తెలంగాణా ప్రాంతం గురించి చులకన భావం కలిగి ఉండి తెలంగాణా వారికి తెలుగు సరిగా రాదనీ, ఉర్దూ మీడియంలో విద్యా బోధన ఉంటుంది కాబట్టి చదువుకున్న వారిలో శాస్త్ర సంబంధిత విషయ పరిజ్ఞానం తక్కువ అనీ ఇంకా ఇతర అభిప్రాయాలను వెలిబుచ్చినప్పడు పీవీ, రామానుజరావు గార్లు వారికి వాస్తవాలు సోదాహరణంగా వివరించేవారట. ఒక్కొక్క సారి వారితో దీర్ఘ వాదోపవాదాలు చేసేవారట!”
(పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి 105 జయంతి సందర్బంగా బాల్య విశేషాల గురించి మరొక్కసారి)
సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ భావ ప్రకటనలో, అనుసరించవలసిన పద్ధతిలో స్వీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన మెలకువలను పీవీ నేర్చుకొనడం అప్పుడే మొదలైంది. అనేక వైరుధ్యాలతో కూడిన సమస్యలను అవగాహన చేసుకొనడం, ఆ సమస్యల పరిష్కార విధానం స్వంతంగా రూపొందించడం మెల్లిమెల్లిగా నేర్చుకొనడం ఆరంభమయింది. ఒక విధంగా చెప్పాలంటే అతిగా మాట్లాడే, తిరుగుళ్ళ అమాయకపు పీవీ ప్రవర్తన, వ్యక్తిత్వం అదృశ్యమవుతూ తక్కువ మాట, గంభీర ఆలోచనా ధోరణి, అంటీ ముట్టని నడవడి రూపుదిద్దుకోవడం మొదలైంది పూనాలోనే.
ఇక పీవీ పూనాలో తిరుగని వీధి లేదు, హాజరు కాని సినిమా హాలు లేదు. ‘టీ’ సేవింపని హోటలు లేదు. పూనా చుట్టు ప్రక్కల గల చూడ తగిన ప్రదేశాలన్నీ చూడటం జరిగింది. ఇదంతా కాలేజీ వెలుపలి వివరాలు. ఇక కాలేజీ వ్యవహారాలను చూస్తే, చదువులో ఇక్కడా ఫస్టే! ఇకపోతే, కాలేజీ విద్యార్థి సంఘం నిర్దేశించిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వాడు. కాలేజీ నిర్వహించిన వక్తృత్వ పోటీలో, ఇంకా ఆటలల్లో టెన్నిస్ పోటీలో పాల్గొన్నాడు. కాలేజీ మేగజైనులో రచనలు చేసాడు. మిగతా కాలేజీ విద్యార్థుల్లాగే పీవీ లో కూడా ‘సౌందర్యారాధన’ భావం అంతో ఇంతో ఉందన్నది కూడా వాస్తవం. ఐతే సహజంగా బిడియస్తుడు కాబట్టి ఇటువంటి మనోదౌర్బల్యం పీవీ లో తక్కువే అని చెప్పుకోవాలి. మొత్తానికి పూనా నుండి గ్రాడ్యుయేటు గా హైదరాబాద్ చేరుకున్నాడు పీవీ, డిగ్రీతో బాటు ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తిత్వంతో. అక్కడ నుండి వంగరకు.
మొదటి సారి భావ సంఘర్షణ వంగరలో కుటుంబ సభ్యుల కలయికతో మునుపటి స్వైర విహారాల, చర్చోప చర్చల పీవీ, సంగీత సభల్లో ‘వాహ్‘ శ్రోతగా, క్లాసు లో ఫస్ట్ మార్క్ ఆన్సర్ షీట్ల తో పాటు ఉపాధ్యాయుల ప్రశంసల్ని అందుకున్న విద్యార్థిగా – ఇలాంటి ఎన్నో ఆనందకర పాత్రల్ని పోషించి ఇన్నేండ్లు ఆకాశంలో విహరించిన పీవీ ఒక్క సారిగా కుటుంబ బాధ్యతలు, ఆదాయ వ్యయ చిట్టాలు తెలిసి రావడంతో భూమిపైకి దిగి వచ్చాడు. భావ సంఘర్షణ మొదలయింది. ఏదైనా ఉద్యోగం చేయడమా లేక వంగరలో స్థిరపడి వ్యవసాయం చేసుకోవాలా?… మరో చిన్న కోరిక కూడా మనసులో మెలుగుతోంది. ‘పై చదువులు చదవాలని’! వేసవి సెలవుల్లోపల ఈ “కిం కర్తవ్యం?” అనే దానికి సమాధానమివ్వాలి. తరగతి చదువుల ప్రశ్నలకైతే ఠకీ మని సమాధానం రాసి మొదటి మార్కులు కొట్టేసే పీవీకి ఈ బ్రతుకు చదువు ప్రశ్నకు బాగా ఆలోచించవలసి వచ్చింది. తుదకు ఉద్యోగం ‘జాన్ తా నహీ‘, వ్యవసాయం ‘మాన్ తా నహీ‘ అనుకున్నాడు.
‘వకాలత్ పఢ్ నా హీ మేరీ పసంద్ హై’ అని నిర్ణయించుకున్నాడు – అదీ తన ఫేవరిట్ ఊరు నాగ్ పూర్ లో. నాగ్ పూర్ పాతదే – కాని పీవీ వ్యాసాంగాలు కొత్తవి నాగ్ పూర్ లో గది అద్దెకు తీసుకొని కాలేజీలో చేరి ‘లా’ చదువు ప్రారంభించాడు పీవీ. కానీ వెనకటి తిరుగుళ్ళ పీవీ కాదు. ఇకపోతే రెండవ ప్రపంచ యుద్ధం చాయలు మన దేశంలో కూడా ఉన్నాయి, మరో వైపు బెంగాల్ లో దారుణ క్షామ స్థితి. ఇక జాతీయ నాయకులంతా జైళ్ళలో ఉన్నారు. దేశంలో రాజకీయ స్తబ్ధత, ప్రజలలో నిరుత్సాహం నెలకొని ఉన్నాయి. పర్రిస్థితులని అర్థం చేసుకున్న పీ వీ తన కలానికి పని చెప్పాడు. తన లోని వివిధ భావాలని వ్యక్త పరుస్తూ కొన్ని కవితలు, వ్యాసాలు రాసాడు. వాటిలో బెంగాల్ కరువు భూమికతో రాసిన ఒక కథ ఇతివృత్తం అద్భుతమని పీవీ సన్నిహిత మిత్రులు పేర్కొనే వారు. కథ ఇలా సాగుతుంది… ‘కరువు రక్కసికి కుటుంబ సభ్యులను కోల్పోయి ఏకాకిగా మిగిలిన ఒక యువతి ఆకలి కాగలేక చివరకు భిక్షమెత్తుకునేందుకు సన్నద్ధమౌతుంది. కాని బిచ్చం కూడా లభ్యం కాని దురవస్థ స్థితిలో తన శరీరాన్ని కూడా అమ్ముకునేందుకు సిద్ధమవుతుంది.’ ఆత్మాభిమానం కల ఆ యువతి తన దిగజారుడు తీరుకు పడే ఆమె మనో వేదనను ‘అద్భుతంగా చిత్రీకరించాడు పీవీ’ అని ఆ మిత్రులు చెబుతారు. అంటే వెనుకటి పీవీకి, ప్రస్తుత చైతన్య పూరిత భావ ప్రకటన చేయగల ఆలోచనా ధోరణులు, రచనా ప్రక్రియలో నేర్పూ గల పీవీకి మధ్య వ్యత్యాసం నాగపూర్ పట్టణానికి కూడా అర్థమయివుంటుంది.
ఈసారి నాగ్ పూర్ లో పీవీ విద్యార్థి జీవనం లో ఒక క్రొత్త పరిణామం సంభవించింది. అప్పుడే క్రొత్తగా నాగ్ పూర్ లో ఆహార రేషనింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఉద్యోగానికై ఒక దరఖాస్తు పడేసి చూద్దాం అని పీవీ దరఖాస్తు చేయగా ఆయనకు ఇన్ స్పెక్టర్ గా నియామకం వచ్చింది. ఈ ఉద్యోగంలో చేరి పీవీ సంపాదిస్తూ ఆ డబ్బుతో నే చదువుకున్నాడని తెలుస్తుంది. ఇది పీవీ లో ఎంతో ఆత్మ సంతృప్తి కలగ జేసింది అని సన్నిహిత మిత్రుల వ్యాఖ్యానం. అదే సమయంలో పీవీకి శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు సహాధ్యాయి. రామానుజరావుగారు పీవీ లో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి నవలల గురించి ఆసక్తి కలిగించినట్లు తెలుస్తుంది. దీనితో పీవీ విశ్వనాథ వారి రచనలు ‘ఏక వీర’, ‘ చెలియలి కట్ట ‘, ‘వేయి పడగలు’ చదవడం జరిగింది. ఇకపోతే, పీవీలో నాగ్ పూర్ లోని ప్రముఖ వ్యక్తులను కలిసి వారితో పరిచయాలను యేర్పరుచుకోవాలన్న కొత్త వ్యాసంగం మొదలయింది.
అప్పటికే నాగ్ పూర్ లో ఉన్న ప్రముఖ తెలుగు వారిని కలిసి వారితో స్నేహమేర్పడి కబుర్లు చెప్పుకొనడం జరుగుతుండేది. ఈ కబుర్లలో పీవీ కి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. అక్కడి ఆంధ్ర ప్రముఖులు తెలంగాణా ప్రాంతం గురించి చులకన భావం కలిగి ఉండి తెలంగాణా వారికి తెలుగు సరిగా రాదనీ, ఉర్దూ మీడియంలో విద్యా బోధన ఉంటుంది కాబట్టి చదువుకున్న వారిలో శాస్త్ర సంబంధిత విషయ పరిజ్ఞానం తక్కువ అనీ ఇంకా ఇతర అభిప్రాయాలను వెలిబుచ్చినప్పడు పీవీ, రామానుజరావు గార్లు వారికి వాస్తవాలు సోదాహరణంగా వివరించేవారట. ఒక్కొక్క సారి వారితో దీర్ఘ వాదోపవాదాలు చేసేవారట! అట్లాగే చాలా మంది ఉత్తర భారతీయులు ఆంధ్ర ప్రాంతం వారిని ‘మద్రాసీ‘లుగా భావించే వారనీ, కర్నాటక సంగీతాన్ని ‘అరవ మేళంగా ‘ అనుకునే వారనీ, త్యాగరాజ కీర్తనల భాష తమిళంగా భావించేవారనీ వారికి గూడా నిజ వివరాలు చెప్పేవారని తెలిసింది.
మొత్తానికి – పీవీ నాగ్ పూర్ నుండి లా డిగ్రీ, దానితో బాటు వినూత్న అనుభవాల తోడు తీసుకొని ఇక భవిష్యత్ జీవన సంగ్రామానికై హైదరాబాదు చేరాడు. లా డిగ్రీ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ అని చెప్పనవసరం లేదు కదా! అనేక భావ సంఘర్షణల మధ్య భవిష్యత్ జీవన దిశా నిర్దేశం – రాజకీయాల వైపుగా చదువు ముగించి భవిష్యత్ బ్రతుకు బాటలో పయనించడానికి 1945 లో న్యాయ శాస్త్ర పట్టాతో పీవీ హైదరాబాదు చేరి ప్రఖ్యాత న్యాయవాది శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి దగ్గర జూనియర్ గా చేరాడు. బూర్గుల గారి నాయకత్వ లక్షణం, నానా ముఖ ప్రతిభ, వ్యవహార దక్షత పీవీకి బాగా నచ్చాయి. చదువులో లాగానే వకాలత్ వ్యవహారంలోనూ పీవీ అందరి మన్నన పాత్రుడయ్యాడు. హైకోర్టులో పీవీ వాదనా పటిమ సీనియర్ లాయర్ల మెప్పును పొందింది. వాదనలో తాను చెప్పే పాయింట్స్ వివరంగా, విషయ పరిజ్ఞానంతో కూడి ఉండేవని, కేసు నెగ్గించుకోవడంలో పీవీ చూపే వాదనా చాతుర్యం, అందులో చూపించే ఆధార వివరాలు పేరుమోసిన లాయర్లనే చకితులను చేసేవట. ఇక పీవీ హైదరాబాదు చేరేసరికి అక్కడ రాజకీయ సాంఘిక పరిస్థితు లెట్లున్నాయో క్లుప్తంగా తెలుసు కుందాం.
(రేపటి సంచికలో )
–పాములపర్తి నిరంజన్ రావు
పిన్నా శివకుమార్





