– రక్త గ్రూపులు సరిపోకున్నా 60 ఏళ్ల వ్యక్తికి భార్య కిడ్నీ దానం
– ఏబీఓ ఇన్కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన ‘కేర్’
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 22 : రక్త గ్రూపులు సరిపోకపోవడంతోపాటు యాంటీబాడీలు అధికంగా ఉండటం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న 60 ఏళ్ల ఉపాధ్యాయుడికి కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్యులు క్లిష్టమైన ఏబీఓ ఇన్కంపాటిబుల్ కిడ్నీ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. రెండేళ్లుగా డయాలసిస్పై ఆధారపడుతున్న ఆయనకు భార్య కిడ్నీ దానం చేయడంతో కొత్త జీవితం లభించింది. మూడేళ్లుగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి(సీకేడీ)తో బాధపడుతున్న ఆయన రెండేళ్లుగా వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు. తరచూ హాస్పిటల్లో చేరాల్సి రావడంతో రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ ఉపాధ్యాయుడిగా తన విధులను కొనసాగించారు. వయస్సు, అధిక యాంటీబాడీ స్థాయిలు, మధుమేహం, అధిక రక్తపోటు కారణంగా సరైన కిడ్నీ దాతను గుర్తించడం సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆయన భార్య కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చారు. అయితే ఇద్దరి రక్త గ్రూపులు సరిపోకపోవడం మరో ప్రధాన సవాలుగా నిలిచింది. దీంతో హాస్పిటల్కు చెందిన నెఫ్రాలజీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ నిపుణుల బృందం ప్రత్యేక ప్రణాళికతో ఏబీఓ ఇన్కంపాటిబుల్ కిడ్నీ మార్పిడికి సిద్ధమైంది. శరీరంలో యాంటీబాడీల స్థాయిని తగ్గించేందుకు రోగికి పలుమార్లు ప్లాస్మాఫెరిసిస్ నిర్వహించడంతోపాటు, మార్పిడి చేసిన కిడ్నీని శరీరం తిరస్కరించకుండా అవసరమైన ఇమ్యూనోసప్రెసివ్ చికిత్స అందించారు. రోగి వయస్సు, మధుమేహం, గతంలో తరచూ ఇన్ఫెక్షన్లు రావడం వల్ల కిడ్నీ తిరస్కరణను నివారించడంతోపాటు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నియంత్రించడం వైద్యుల ముందున్న ప్రధాన సవాలు. ప్రత్యేక వైద్య విధానాలతో రోగిని సిద్ధం చేసిన అనంతరం భార్య నుంచి సేకరించిన కిడ్నీని విజయవంతంగా మార్పిడి చేశారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు. కేర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్- నెఫ్రాలజీ డాక్టర్ బి.ఆర్.జి.అరవింద రెడ్డి మాట్లాడుతూ ‘రక్త గ్రూపులు సరిపోకపోవడం వల్ల కిడ్నీ మార్పిడి అసాధ్యమని భావించాల్సిన అవసరం లేదు. ఎంపిక చేసిన రోగుల్లో ప్రత్యేక డీసెన్సిటైజేషన్ చికిత్స ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ రోగిలో యాంటీబాడీలు అధికంగా ఉండటం, వయస్సు, మధుమేహం, అధిక రక్తపోటు కారణంగా మరింత జాగ్రత్తగా చికిత్స చేయాల్సి వచ్చింది’ అన్నారు. కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్- రీనల్ ట్రాన్స్ప్లాంట్ అండ్ యూరాలజీ డాక్టర్ సుశాంత్ కులకర్ణి మాట్లాడుతూ ‘రక్త గ్రూపులు సరిపోకపోవడం, యాంటీబాడీలు అధికంగా ఉండటం, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఇది క్లిష్టమైన కిడ్నీ మార్పిడి. నెఫ్రాలజీ, ట్రాన్స్ప్లాంట్ బృందాల సమన్వయం, ముందస్తు ప్రణాళికతో మార్పిడిని విజయవంతంగా నిర్వహించగలిగాం’ అన్నారు. కేర్ హాస్పిటల్స్ కన్సల్టెంట్- నెఫ్రాలజీ డాక్టర్ జె.అల్ రంగనాథ్ మాట్లాడుతూ ‘రెండేళ్లుగా వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్న రోగికి ఈ కిడ్నీ మార్పిడి సాధారణ, స్వతంత్ర జీవితానికి తిరిగి చేరుకునే అవకాశం కల్పించింది. కిడ్నీ తిరస్కరణను నివారిస్తూనే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడం ఈ కేసులో కీలకంగా నిలిచింది’ అన్నారు. కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రమోద్ గుప్తా మాట్లాడుతూ ‘రక్త గ్రూపు సరిపోకపోయినా భర్తకు కిడ్నీ ఇచ్చేందుకు భార్య ముందుకు రావడం గొప్ప విషయం. వైద్య నిపుణుల సమన్వయంతో క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఆధునిక చికిత్స అందించి కిడ్నీ మార్పిడిని విజయవంతం చేయగలిగాం’ అన్నారు. చివరి దశ మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వారికి కుటుంబంలో కిడ్నీ దానం చేసేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తి ఉన్నప్పటికీ రక్త గ్రూపులు సరిపోని సందర్భాల్లో ఏబీఓ ఇన్కంపాటిబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక చికిత్సా అవకాశంగా పరిగణించవచ్చు. ఇందుకు ప్రత్యేక డీసెన్సిటైజేషన్ చికిత్స, ఇమ్యూనోసప్రెషన్తోపాటు మార్పిడి అనంతరం నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరం. రక్త గ్రూపులు సరిపోకపోవడం వల్ల కిడ్నీ దానం ఎప్పుడూ అసాధ్యం కాదనే విషయాన్ని ఈ కేసు స్పష్టం చేస్తోంది. రెండేళ్లుగా డయాలసిస్పై ఆధారపడిన ఈ ఉపాధ్యాయుడికి విజయ వంతమైన కిడ్నీ మార్పిడి మెరుగైన జీవన ప్రమాణాలతో తిరిగి సాధారణ జీవితాన్ని కొనసాగించే అవకాశం కల్పించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





