పాశమైలారం ఘటనపై సీఎం సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న సహాయక చర్యల గురించిన వివరాలను అక్కడున్న మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్లనుంచి ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సెట్రేరియట్లో డీజీపీ, సీఎస్లతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్వర్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్, లేబర్ డిపార్టుమెంట్ పీఎస్, హెల్త్ సెక్రటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీ రనిలను కమిటీలో సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతలను కూడా ఈ కమిటీకి అప్పగించారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కాగా, మంగళవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలిస్తారు.