– యూనిఫాంల నాణ్యతపై రాజీ పడేది లేదు
– పంపిణీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
– త్వరగా సరఫరా చేసేలా సంస్థలపై ఒత్తిడి పెంచాలి
– యూనిఫాం సరఫరాపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత వాటి నాణ్యత, సైజు ఇతర అంశాలపై ప్రతీ విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ (ఫీడ్ బ్యాక్) తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. దాని ఆధారంగా వచ్చే ఏడాది పంపిణీ, వాటి రంగులు ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులకు యూనిఫాంల అందజేతపై ఎంసీఆర్హెచఆర్డీలో గురువారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో చదివే విద్యార్థులకు అందజేసే యూనిఫాంల నాణ్యతలో రాజీపడమని స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి పిల్లలందరికీ యూనిఫాం అందజేయాల్సినదేనని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించనని హెచ్చరించారు. మహిళా సంఘాలు కుట్టు పని వేగవంతం చేసేలా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్యకు సీఎం సూచించారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు యూనిఫాంల అందజేతలో అడ్డగోలుగా వ్యవహరించారని సీఎం అన్నారు. తాము వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, నాణ్యమైన యూనిఫాంలు అందిస్తామని తెలిపారు. పేద పిల్లల కోసం పని చేస్తున్నామనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వచ్చే సంవత్సరం జూన్ 2నాటికే విద్యార్థులకు యూనిఫాం అందేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, ఆయా శాఖల అధికారులు బాల మాయాదేవి, షఫీ ఉల్లా, విజయేంద్ర బోయి, దివ్య తదితరులు పాల్గొన్నారు.
నీటి వనరులను అనుసంధానించాలి : వాటర్ బోర్డుపై సమీక్షలో సీఎం
క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో తాగు నీటి సరఫరాకు సంబంధించి సమగ్ర తాగు నీటి సరఫరా మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీలతోపాటు విలీన మున్సిపాలిటీల్లోనూ తాగు నీటి సరఫరాలో ఏకరూపత ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు మాస్టర్ ప్లాన్ ఉండాలని సూచించారు. హైదరాబాద్ మహా నగర తాగు నీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో గురువారం రాత్రి సమీక్షించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం నెలకొనడంతో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, హైదరాబాద్ చుట్టూ ఉన్న తాగు నీటి వనరులను అనుసంధానించాలని సీఎం సూచించారు. ఏదైనా కారణాలతో ఒక సోర్స్ నుంచి నీరు సరఫరా కాకపోయినా మరో సోర్స్ నుంచి వచ్చే నీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అనుసంధానత ఉపయోగపడుతుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పలు ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులకొకసారి తాగు నీరు సరఫరా చేస్తున్నారని, ఇక ముందు ఆ పరిస్థితి ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాగు నీటి సరఫరా పనులను ఏడాదిన్నరలోపు కచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు తేల్చిచెప్పారు. ఎస్టీపీల నిర్మాణ పనులపై ఆరా తీశారు. వాటిని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటిని వేగంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. తాగు నీటి సరఫరా పనులు, ఎస్టీపీల నిర్మాణ పనుల ప్రగతిపై ప్రతి నెలా తనకు నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతి తెలుసుకునేందుకు వీలుగా డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. రానున్న రోజుల్లో పరిశ్రమలు, వివిధ నిర్మాణ పనుల్లో గ్రే వాటర్ వాడేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని సీఎం సూచించారు. సమీక్షలో ఎంఏ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి, జేఎండీ మయాంక్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు