– వరద బాధితులను సహాయక శిబిరాలకు తరలించాలి
– తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
– ఇన్చార్జి మంత్రులు వరద బాధితులకు అందుబాటులో ఉండాలి
– రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని, పశువులకు ఆపద రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైనచోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహాయం అందించాలని ఆదేశించారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాతోపాటు, హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు. అన్నిచోట్ల వరి కోతలు మొదలయ్యాయని, అనుకోని ఉపద్రవం ఏది వచ్చినా రైతులకు ఆవేదన మిగులుస్తుందని సీఎం అన్నారు. ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందుకు తగినట్లు పౌరసరఫరాల విభాగం కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. చాలాచోట్ల ధాన్యం తడిసిపోయిందని, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయి రైతులు నష్టపోవటం ఆందోళన కలిగించిందని సీఎంఅన్నారు. కళ్లాల్లో, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మిల్లుల, గోదాములు అందుబాటులో లేనిచోట దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికో ఇన్చార్జి అధికారిని నియమించాలని, ఇప్పుడున్న ఇన్చార్జిలు నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే వేరే వాళ్లను నియమించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతీ ఐకేపీ సెంటర్ నుంచి ఏరోజుకారోజు సాయంత్రం రిపోర్టు తెప్పించుకోవాలని, రిపోర్టు ఇవ్వక నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసి అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించేలా, ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలకు ధాన్యం తడవకుండా తగినన్ని టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలి. విధానపరమైన నిర్ణయాలు అవసరమైతే వెంటనే సివిల్ సప్లయిస్ కమిషనర్, సీఎస్ దృష్టికి తీసుకురావాలని సీఎం చెప్పారు. వరద తగ్గిన తర్వాత వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వేలు చేసి నష్టపు అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు. తుఫాను, వర్షాల ప్రభావమున్న జిల్లాల్లో చేపడుతున్న సహాయక చర్యలు, రోడ్లు, రహదారుల పునరుద్ధరణ చర్యలు, ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఇన్చార్జి మంత్రులు సమీక్షించాలని సీఎం కోరారు. తమ సొంత జిల్లాల్లో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, ఇన్చార్జిగా ఉన్న జిల్లాల్లో ప్రజలను ఆదుకునే చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పారు. ఎంతటి విపత్తు వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందంటూ అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, వెంటనే విద్యుత్తు పునరుద్ధరించేలా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలతో ఖమ్మం జిల్లాలో ఒక డీసీఎం వ్యాన్, డ్రైవర్ వాగులో కొట్టుకుపోవటం దురదృష్టకరమని సీఎం అన్నారు. అన్ని రహదారులపై ఉన్న బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్ వేలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను నివారించవచ్చని అన్నారు. రహదారులపైకి వరద నీళ్లు వచ్చే ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనాలు అటువైపు వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు నిషేధాజ్ఞలు అమలు చేయాలని తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ను డైవర్ట్ చేయాలని, కుంభవృష్టి కురిసే సమయంలో ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించాలని అన్నారు. వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసుల సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే హైదరాబాద్ నుంచి హైడ్రా టీమ్లను, అవసరమైన సామగ్రిని పంపించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. వరంగల్లో తక్షణ సహాయక చర్యలకు అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని కూడా ఆదేశించారు. వరంగల్లో వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, ఎక్కడైనా వరదలో ఇండ్ల కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీటితోపాటు, ఆహార పొట్లాలు సరఫరా చేయాలని సూచించారు. వరంగగల్లో వరద బాధితులకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టరేట్లో టోల్ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రస్థాయిలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి వర్షాలు, వరదలు, విపత్తులు వచ్చినప్పుడు వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఓఎస్?డీ వేముల శ్రీనివాసులు. విపత్తుల నిర్వహణ విభాగం స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, హెదరాబాద్ జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో పాటు తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తా..
వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహిస్తానని, వాతావరణం అనుకూలంగా లేనందున ఇవాళ్టి వరంగల్ పర్యటన వాయిదా వేసుకున్నానని సీఎం తెలిపారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.సిబ్బంది సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నామన్నారు. ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం కలగుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాజెక్టుల ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వరంగల్లో వరద బాధితులకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
———————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





