ఆరోగ్య భారతావనికి సవాళ్లు..

దేశాభివృద్ధి ప్రజల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆదాయ అసమానతలు, పేదరికం, విద్య, సామాజిక చైతన్యం, వైద్యుల అందుబాటు, నివసించే ప్రదేశం, భౌతిక వాతావరణం, పర్యావరణం, కాలుష్యం, సామాజిక పరిస్థితులు, ప్రకృతి విపత్తు లాంటి అనేక అంశాలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఆరోగ్యం అంటే కేవలం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడమే కాదు. మనిషి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యం అంటారు.

నానాటికి దేశ వ్యాప్తంగా కోట్లాది ప్రజల ఆరోగ్య హక్కుకు ముప్పు పెరుగుతోంది. కాలుష్యం వాతావరణ సంక్షోభానికి, స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే హక్కును దూరం చేస్తోంది. వాయు కాలుష్యం ప్రతి ఐదు సెకన్లకు ఒక ప్రాణాన్ని తీస్తోంది. ప్రపంచంలో 140 దేశాలు తమ రాజ్యాంగంలో ఆరోగ్యాన్ని మానవ హక్కుగా గుర్తించాయి. అయినా కూడా చాలా దేశాలు తమ ప్రజలు ఆరోగ్య సేవలను పొందేందుకు అర్హులని నిర్ధారించడానికి చట్టాలను ఆమోదించడం లేదా ఆచరణలో పెట్టడం గానీ లేదు. నాణ్యమైన ఆరోగ్య సేవలు, సురక్షితమైన తాగునీరు, స్వచ్ఛమైన గాలి, మంచి పోషకాహారం, నాణ్యమైన నివాసం, మంచి పని పర్యావరణ పరిస్థితులు, స్వేచ్ఛను పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.

మన దేశంలో హక్కులు:
మనదేశంలో రాజస్థాన్‌ ‌ప్రభుత్వం ఆరోగ్య హక్కు బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ అన్ని ప్రజారోగ్య సౌకర్యాలలో ఉచిత సేవలను పొందే హక్కును కల్పిస్తుంది. పశ్చిమ్‌ ‌బంగా ఖేత్‌ ‌మజ్దూర్‌ ‌సమిటీ కేసులో సుప్రీంకోర్టు ‘సంక్షేమ రాజ్యంలో ప్రజల సంక్షేమాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని, ప్రజలకు తగిన వైద్య సదుపాయాలను అందించడం ప్రభుత్వ బాధ్యత’ అని పేర్కొంది. అలాగే పర్మానంద్‌ ‌కటారా వెర్సెస్‌ ‌యూనియన్‌ ఆఫ్‌ ఇం‌డియా కేసులో  ‘ బాధితుడు అమాయకుడైనా, నేరస్థుడైనా సరే తగిన నైపుణ్యంతో ప్రాణాలను రక్షించడం వైద్యుని వృత్తి పరమైన    బాధ్యత ‘ అని తెలిపింది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 21 ‌జీవించే హక్కును కల్పించింది. అలాగే ఆర్టికల్స్ 38, 39, 42, 43, 47 ‌లలో రాష్ట్రాలు ప్రజలకు కల్పించవలసిన ఆరోగ్యానికి సంబంధించిన బాధ్యతలను తెలుపుతున్నాయి.

మన దేశంలో ఆరోగ్య పరిస్థితి
భారత్‌లో దాదాపుగా దేశ జనాభాలో 11.4 శాతం మధుమేహంతో జీవిస్తున్నారని ‘లాన్సెట్‌’ ‌తెలిపింది. దాదాపు 13.6 కోట్ల మందికి ప్రీడయాబెటిస్‌ ఉం‌దని కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనాలు తెలుపుతున్నాయి. వీటికి సాధారణ డయాబెటిస్‌ అదనం. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోనే మధుమేహం ఎక్కువ.  దేశంలో క్యాన్సర్‌ ‌కేసులు పెరుగుతున్నాయి. పౌష్టికాహార లోపం మరో సవాలు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 5 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్న పిల్లలలో 35.5 శాతం మంది  వయసుకు తగ్గ ఎత్తు లేరు. 19.3 శాతం మంది ఎత్తుకు తగిన బరువు లేరు. 32.1 శాతం మంది వారి వయస్సుకు తగ్గ బరువు లేరు. 3 శాతం మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు. 15 నుండి 49 మధ్య వయస్సు గల వారిలో 18.7 శాతం మందిలో పోషకాహరలోపం ఉంది.

రక్తహీనత కూడా ఎక్కువ మందిలో ఉంది. ప్రపంచంలో తలసరి పడకల సంఖ్య తక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. ప్రతీ పదివేల జనాభాకు 15 పడకలు అందుబాటులో ఉన్నాయి.  ‘ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టడం, వ్యాధులను నివారించడం, మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, సాంకేతికతను మరింత అందుబాటులోకి తీసుకురావడం  ద్వారా ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచాలి ‘ అని జాతీయ ఆరోగ్య విధానం 2017 తెలిపింది. ఇది 2025 నాటికి క్యాన్సర్‌, ‌హృదయ సంబంధ వ్యాధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, మధుమేహ అకాల మరణాలను 25 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘భారతదేశ వృద్ధాప్య జనాభా 2050 నాటికి మొత్తం జనాభాలో 20.8%కి రెట్టింపు అవుతుందని ఇండియా ఏజింగ్‌ ‌రిపోర్ట్ 2023 అం‌చనా వేసింది. పెరుగుతున్న వృద్ధాప్య జనాభా వయస్సు సంబంధిత ఆరోగ్య సవాళ్లలో .పెరుగుదలతో కూడి ఉంటుంది.

అనుకూలంశాలు:
2025-26 లో ఆరోగ్య సంరక్షణ రంగానికి 99,858.56 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది దాదాపు 11 శాతం  పెరుగుదల. 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం దేశ ఆరోగ్య సంరక్షణ వ్యయం 2025లో 2.5%గా ఉండగా 2026 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో 1.9%గా ఉంటుందని అంచనా. ఆయుష్మాన్‌ ‌భారత్‌ 2024-25 ‌నుంచి 29% పెరుగుదలతో 9,406 కోట్లు. కేటాయించింది. బేసిక్‌ ‌కస్టమ్స్ ‌డ్యూటీ నుంచి కొత్తగా 36 రకాల ప్రాణాలను రక్షించే మందులకు రాయితీలు ఇచ్చారు. 2025-26 నాటికి ప్రభుత్వ దవాఖానలలో 200 కొత్త క్యాన్సర్‌ ‌డే-కేర్‌ ‌కేంద్రాలు ప్రారంభిస్తారు. వొచ్చే మూడేళ్లలో జిల్లా స్థాయి కేన్సర్‌ ‌చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా 10 వేల మెడికల్‌ ‌సీట్లు, ఐదేళ్లలో 75,000 సీట్లు సాధించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. రిజిస్ట్రార్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా విడుదల చేసిన నమూనా రిజిస్ట్రేషన్‌ ‌వ్యవస్థ ప్రకారం , దేశంలో ప్రసూతి మరణాల నిష్పత్తి  2014-16లో 130 నుండి 2018-20లో లక్ష సజీవ జననాలకు 97 కి 33 పాయింట్లు గణనీయంగా తగ్గింది. శిశు మరణాల రేటు2014 లో 1000 సజీవ జననాలకు 39 నుండి 2020 సంవత్సరంలో 1000 సజీవ జననాలకు 28 కి తగ్గింది. 2014 లో ప్రతి 1000 జననాలకు 26గా ఉన్న నవజాత శిశు మరణాల రేటు 2020 నాటికి ప్రతి 1000 జననాలకు 20 కి తగ్గింది. 2014 లో 1000 జననాలకు 45 గా ఉన్న 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటు 2020లో 1000 జననాలకు 32 కి తగ్గింది. జాతీయ ఆరోగ్య ఖాతాల అంచనాల ప్రకారం మొత్తం ఆరోగ్య వ్యయం లో ఒక శాతంగా, జేబు నుండి ఖర్చు 2013%-%14లో 64.2% నుండి 2021%-%22లో 39.4% కి తగ్గింది.

సవాళ్లు:
ప్రతి 1,000 మందికి 1.3 దవాఖానలు పడకలు మాత్రమే ఉన్నాయి. ఇది డబ్ల్యూహెచ్‌ఓ ‌సూచించిన 1,000 మందికి 3.5 కంటే చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. 7.7 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు. చైనా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 13.5 కోట్లకు పెరుగుతుందని అంచనా. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో అనారోగ్యాలతో బాధపడుతున్న వారిలో అత్యధిక సంఖ్యలో మన దేశంలోనే ఉన్నారు. ‘15 నుంచి 49 ఏళ్ల మహిళలలో 6.4 శాతం, పురుషులలో 4.0 శాతం ఊబకాయంతో ఉన్నారు ‘ అని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఐదవ రౌండ్‌ ‌నివేదిక తెలిపింది. దేశంలో క్యాన్సర్‌ ‌కేసుల సంఖ్య 2022లో 14.6 లక్షల నుంచి 2025 నాటికి 15.7 లక్షలకు పెరుగుతుందని అంచనా.  హృదయ సంబంధ వ్యాధులు మన దేశంలో ప్రధాన ఆరోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1.79 కోట్ల గుండెపోటు మరణాలలో ఐదోవంతు మనదేశంలోనే సంభవిస్తున్నాయి. ఇంకా రక్తపోటు, అవయవాల జబ్బులు , మొదలైనవి అదనం. ముఖ్యంగా యువతలో నిత్యం పొగాకు, మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. వీటి వినియోగం వలన ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు పాడైపోతాయి. అంతే కాక  వివిధ కేన్సర్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా, నిర్మాణ కార్యకలాపాలు పెరుగుదల, ఎక్కువవుతున్న కర్మాగారాలు, వాహనాల సంఖ్య కారణంగా గాలి కాలుష్యం వలన ఆస్తమా, బ్రాంకైటిస్‌ ‌వంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. నీటి కాలుష్యము వలన , శుద్ధి చేయని నీరు త్రాగడం వలన పొట్టకు సంబందించిన వ్యాధులు కూడా పెరుగుతున్నాయి.

కారణాలు:
మారుతున్న జీవనశైలి, మెరుగైన జీవన ప్రమాణాలు, నగరాలకు వలసలు, అస్తవ్యస్తమైన పని గంటలు, కూర్చునే అలవాట్లు, ఒత్తిడి, కాలుష్యం, ఆహారపు అలవాట్లలో మార్పు, ఫాస్ట్ ‌ఫుడ్‌ ‌సులభంగా అందుబాటులో ఉండటం వంటివి దేశంలో మధుమేహం పెరగడానికి కొన్ని కారణాలు. అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం పొగాకు, మద్యం వినియోగం లాంటివి క్యాన్సర్‌ ‌రోగులు పెరగడానికి కారణాలు. వీటికి కారణం క్రమరహిత ఆహారపు అలవాట్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, జంక్‌ ‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం వ్యాయామం లేకపోవడం, రాత్రులు ఆలస్యంగా నిద్రపోవడం, ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చొని పనిచేసే ఉద్యోగాలు చేయడం వంటివి ఉన్నాయి.

పరిష్కారాలు:
ఎదురవుతున్న సవాళ్లను జాప్యం లేకుండా పరిష్కరించాలి. వైద్యుల సంఖ్య పెంచాలి. ఔషధాలపై అసలు సుంకమే విధించకూడదు. ఇక ప్రజలు కూడా వ్యక్తిగత శ్రధ్ధపై దృష్టి పెట్టాలి. మాతా శిశు మరణాల రేటును ఇంకా తగ్గించాలి. గిరిజన ప్రాంతాలలో అధునాతన వైద్య సౌకర్యాలు కల్పించాలి. ప్రజలందరికీ ఆరోగ్య బీమా పరిధిలోకి తేవాలి. సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించడానికి మరియు మొత్తం ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి మౌలిక సదుపాయాల అంతరాలు, మానసిక ఆరోగ్య సమస్యలు, స్థోమత సవాళ్లను పరిష్కరించడం చాలా కీలకం.
image.png
జనక మోహన రావు దుంగ
ఫోన్‌: 8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page