జనగణనతోపాటే కులగణన చేయనున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు అన్ని రాజకీయపార్టీలు స్వాగతించాయి. అయితే ఈ ప్రకటన రావడానికి తామే కారణమంటూ ఆ క్రెడిట్ను తమఖాతాలో వేసుకోవడానికి విపక్షాలు పోటీపడుతున్నాయి. కులగణన విషయంలో రాజకీయపక్షాలు కొంతకాలంగా కేంద్రంపైన తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఆమేరకు వివిధ రాష్ట్రాలు శాసనసభలో తీర్మానించి, కేంద్రప్రభుత్వానికి పంపించాయికూడా. అందులో గతంలో తెలంగాణలో అధికారంలోఉన్న బిఆర్ఎస్తోపాటు, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. అయినప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏనాడు దానిపైన పెద్దగా స్పందించలేదు.
. కనీసం దానిగురించిన ప్రస్తావన కూడా ఏనాడు చేయలేదు. అలాంటిది ఎవరూ ఊహించని విధంగా కేంద్రం దీనిపై ప్రకటనచేసి అన్ని వర్గాలవారిని ఆశ్చర్యపర్చింది. ప్రధానంగా పహల్గామ్ దాడితో దేశమంతా టెన్షన్ వాతావరణంలోఉన్నప్పుడు ఇలాంటి ప్రకటన వెలువడడాన్ని ఎవరూ ఊహించే అవకాశం కూడాలేదు. ఉగ్రదాడి, పాకిస్తాన్ వ్యవహారంలాంటి ఉద్రిక్తత పరిస్థితిలో కేంద్రం సమావేశాల మీద సమావేశాలను నిర్వహిస్తూనే జన, కులగణనపైన కూడా నిర్ణయం తీసుకోవడంవెనుక కేంద్రప్రభుత్వ రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్జోడో యాత్రలో తరుచు కులగణన విషయాన్ని ప్రస్తావించారు. తాము అధికారంలోకి వొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా తప్పనిసరిగా కులగణన చేపడుతామని దేశప్రజలకు హామీఇచ్చారు కూడా. తామిచ్చిన హామీమేరకు తమపార్టీ అధికారంలోఉన్న తెలంగాణలో కులగణన చేపట్టిన విషయాన్ని ఆయన తరుచు కేంద్రప్రభుత్వానికి గుర్తుచేస్తూ వొస్తున్నారు. అంతేగాక బిజేపీ ఏలికలోఉన్న 18 రాష్ట్రాల్లో కనీసంగానైనా ఇలాంటి ప్రయత్నం చెయ్యకపోవడాన్ని ఆయన ఎత్తిచూపుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రం అయిన గుజరాత్లో భారతీయ జనతాపార్టీ అనేక సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ కులగణన విషయాన్ని ఏనాడు పట్టించుకోలేదని రాహుల్ చేస్తున్న విమర్శలకు అడ్డుకట్టగా కేంద్రం ఈ ప్రకటన చేసిఉండవచ్చన్న అభిప్రాయాలుకూడా వ్యక్తమవుతున్నాయి. రాజకీయ నాయకుల విషయం ఎలాఉన్నా, దేశ వ్యాప్తంగా అణగారిన వర్గాల ప్రజలు కులగణన విషయంపైన పట్టుదలతోఉన్నారు. ఈ అంశాన్ని తీసుకుని కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తున్న తీరుకు కళ్ళెం వేయడంలో భాగంగానే బిజెపి సర్కార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఉండవచ్చనుకుంటున్నారు. అంతేగాక త్వరలో బీహార్లో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటుందన్న చర్చకూడా జరుగుతున్నది.
ఏదిఏమైనా కేంద్ర క్యాబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ(సీసీపీఏ) జనగణనతోపాటు కులగణనపై తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించిన వెంటనే అందుకు తామే కారణమని, ఆ క్రెడిట్ తమదేనని ఎవరికివారు ప్రజలమెప్పు పొందేప్రయత్నం చేస్తున్నారు. కులగణన విషయంలో ప్రభుత్వంపై తాము తెచ్చిన వొత్తిడి పనిచేసిందని విపక్షనేత రాహుల్గాంధీ అంటుండగా, నాలుగేళ్ళుగా తమనాయకుడి కృషి ఫలించిందని తెలంగాణరాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు చాటుకుంటున్నాయి. అంతేకాదు, ఈ విషయంలో తమ ప్రభుత్వం ఒకఅడుగు ముందే ఉందంటున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. తాము ఇటీవల చేసినసర్వే దేశానికి రోల్ మాడల్ అవుతుందంటున్నారు. దాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తున్నారు. గతంలో ఏ రాష్ట్రం చేయని విధంగా కులగణనను చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలంటున్న రేవంత్రెడ్డి మాటలపై బిజెపి నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కులగణన విషయంలో తెలంగాణ నిర్వహించిన సర్వే రోల్ మోడల్కాదని, అది రాంగ్ మోడల్ అని బిజెపి రాష్ట్రఅధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి కొట్టిపారేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే అసమగ్రమే కాకుండా పూర్తిగా అశాస్త్రీయమంటారాయన. బిసీల్లో అన్నివార్గాలకు న్యాయం జరగాలంటే నిస్పక్షపాతంగా, శాస్త్రీయపద్దతిలో సర్వే నిర్వహించాల్సి ఉందంటున్న కిషన్రెడ్డి వాస్తవానికి దేశాన్ని అత్యధికకాలం పనిచేసిన కాంగ్రెస్ కులగణనను ఏనాడు పట్టించుకోలేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు.
స్వాతంత్య్రం వొచ్చినప్పటి నుండి ప్రజలను మతంపేరుతో విడగొట్టిన కాంగ్రెస్, కులాలపై కపటప్రేమ కనబరుస్తూ వొచ్చిన కాంగ్రెస్ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంవెనుక తమ ఘనత ఉందనడం అతిశయోక్తిగా ఉందంటారాయన. ఏమైనప్పటికీ కేంద్రం జనగణనతోపాటు కులగణన చేసే నిర్ణయం తీసుకుంది. అయితే కాంగ్రెస్ సర్వేపైన వేలెత్తి చూపిస్తున్న బిజెపి, దానికి మించిన శాస్త్రీయంగా నిర్వహించడంతోపాటు ఒక నిర్ధిష్ట సమయంలోపుగా పూర్తిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది 50 శాతం రిజర్వేషన్ కోటా పరిమితిని దాటేందుకు మార్గం సుగమం చేస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.