ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది పాత్రికేయుల సేవ. దేశానికి అన్నదాతలు వెన్నెముక అయితే వార్తా సమాచారాన్ని ప్రజలకు అందించే పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి ఊపిరి పోస్తారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రజాస్వామ్యానికి మూడు మూల స్తంభాలు కాగా నాలుగో స్తంభంగా ప్రసార మాధ్యమాలు నిర్వర్తించే పాత్ర అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వానికి ప్రజలకు నడుమ వారధిగా నిలుస్తూ పారదర్శకతకు, జవాబుదారీతనానికి పెద్దపీట వేయడంలో పత్రికలు, ప్రసార మాధ్యమాలు కీలక భూమిక పోషిస్తాయి. మారుతున్న ప్రపంచంలో నిరంతరం జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తేవడంలో పాత్రికేయుల కృషి అమూల్యమైనది.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం – నేపథ్యం:
ప్రతి ఏటా మే 3వ తేదీన జరుపుకునే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, పత్రికా స్వేచ్ఛ ఆవశ్యకతను ప్రపంచానికి గుర్తుచేస్తుంది. 1991లో ఆఫ్రికన్ పాత్రికేయులు నమీబియాలోని విండ్ హాక్లో చేసిన తీర్మానాలకు గుర్తుగా 1993లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం, దాని పరిరక్షణకు చర్యలు చేపట్టడం, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళులర్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యాలు.
ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట అంశంపై దృష్టి సారిస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2025 ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ ఇతివృత్తం ‘పాత్రికేయం, ప్రసార మాధ్యమాలు, మానవ హక్కులపై కృత్రిమ మేధ చూపే ప్రభావం’. ఇది నేటి డిజిటల్ ప్రపంచంలో పాత్రికేయం ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లు, అవకాశాలను ప్రతిబింబిస్తుంది. కృత్రిమ మేధ ఒకవైపు వార్తల సేకరణ, విశ్లేషణ, వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వార్తల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నప్పటికీ, మరోవైపు అనేక కొత్త ప్రమాదాలను కూడా సృష్టిస్తోందన్న వాస్తవాన్ని ఈ ఇతివృత్తం నొక్కి చెబుతోంది.
యుద్ధ క్షేత్రంలో యోధులు – అసామాన్య ధైర్యానికి అభివందనం !
యుద్ధాలు, అంత ర్యుద్ధాలు, ఘర్షణలు జరిగే ప్రాం తాలలో పనిచేయడం పాత్రికేయులకు నిత్యం ప్రాణాలతో చెలగాటం లాంటిది. బాంబు దాడులు, కాల్పులు, అపహరణలు, నిర్బంధాలు వంటి ప్రమాదాలు వారిని వెన్నాడుతూనే ఉంటాయి. సిరియా, యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, ఉక్రెయిన్, ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ జరిగిన పాలస్తీనా వంటి చోట్ల వందలాది పాత్రికేయులు ప్రాణాలు కోల్పోయారు లేదా తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయానక పరిస్థితులలోనూ, మహిళా పాత్రికేయులు అసాధారణ ధైర్యంతో పనిచేస్తున్నారు. పురుష సహోద్యోగులతో పాటు సమానంగా ప్రమాదాలను ఎదుర్కొంటూనే, వారు లైంగిక వేధింపుల భయం, భద్రతాపరమైన ఆందోళనలు, సాంస్కృతిక కట్టుబాట్లు, కుటుంబ బాధ్యతలు వంటి అదనపు సవాళ్లను కూడా అధిగమించాల్సి వస్తోంది. వారి తెగువ, నిబద్ధత, బాధితుల గళాన్ని వినిపించాలనే తపన స్వేచ్ఛా పాత్రికేయానికి నిలువెత్తు నిదర్శనం.
కృత్రిమ మేధ: అవకాశాలు – ఆపదలు:
ఈ ఏడాది ఇతివృత్తానికి అనుగుణంగా కృత్రిమ మేధ పాత్రను పరిశీలిస్తే, ఇది వేగవంతమైన సమాచార విశ్లేషణకు, సుదూర సంవేదన ద్వారా యుద్ధ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు, తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి ఉపయోగపడే వీలుంది. అయితే, ఇదే సాంకేతికత కృత్రిమ నకిలీ దృశ్యాల (డీప్ఫేక్స్) తయారీకి, అసత్య వార్తల సృష్టికి, ప్రచార యుద్ధాలకు ఆయుధంగా మారే ప్రమాదం ఉంది. ఇది క్షేత్రస్థాయిలో పనిచేసే పాత్రికేయుల విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. ముఖ గుర్తింపు వంటి నిఘా సాంకేతికతలు విలేకర్ల భద్రతకు పెను ముప్పుగా పరిణమించవచ్చు. కృత్రిమ మేధ అల్గారిథమ్ల పక్షపాతం, పారదర్శకత లోపం, మానవీయ కోణం కొరవడటం వంటివి కూడా ప్రతికూల ప్రభావాలే. మానవ హక్కుల పరిరక్షణకు కృత్రిమ మేధ ఉపయోగపడే అవకాశం ఉన్నట్లే, గోప్యతా హక్కు ఉల్లంఘన, వివక్షకు దారితీసే ప్రమాదాలూ ఉన్నాయి. కాబట్టి, మానవ విలువలు, ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ, నైతిక, చట్టపరమైన చట్రాల నడుమ కృత్రిమ మేధను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
క్షీణిస్తున్న స్వేచ్ఛ – భారతదేశ పరిస్థితి:
రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే అంతర్జాతీయ సంస్థ ఏటా విడుదల చేసే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక, ఆయా దేశాలలో పాత్రికేయుల స్వేచ్ఛా స్థాయిని వెల్లడిస్తుంది. 2024 సంవత్సరం సూచికలో 180 దేశాలలో భారతదేశం 159వ స్థానంలో నిలిచింది. 2023 నాటి 161వ స్థానంతో పోలిస్తే స్వల్ప మెరుగుదల కనిపించినా, పొరుగు దేశాలైన పాకిస్తాన్ (152), శ్రీలంక (150) కంటే వెనుకబడి ఉండటం ఆందోళనకరం. రాజకీయ, చట్టపరమైన, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక పరిస్థితుల పరంగా స్కోరు తగ్గడం గమనార్హం. పాత్రికేయులపై దాడులు, నిర్బంధాలు, చట్టపరమైన వేధింపులు పెరగడం పత్రికా స్వేచ్ఛకు అవరోధంగా మారుతున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతం విలేకర్లకు రెండవ అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా నిలవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తుంది.
వారసత్వం – బాధ్యత:
భారతదేశంలో స్వతంత్ర పాత్రికేయానికి పునాది వేసిన ‘భారతీయ పాత్రికేయ పితామహుడు’ జేమ్స్ అగస్టస్ హికీ స్ఫూర్తిని మనం గుర్తుంచుకోవాలి. 1780లో ‘బెంగాల్ గెజెట్’ పత్రికతో ఆయన ప్రారంభించిన నిర్భయ, నిష్పాక్షిక వార్తా సంస్కృతి నేటికీ ఆదర్శం. భారత రాజ్యాంగపు 19(1)(ఎ) అధికరణం వాక్ స్వాతంత్య్రం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛల ద్వారా పత్రికా స్వేచ్ఛకు హామీ ఇస్తుంది. అయితే, అధికరణ 19(2) కింద కొన్ని పరిమితులూ ఉన్నాయి. ఈ స్వేచ్ఛను కాపాడుకుంటూ, సంక్షోభ సమయాలలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం విలేకర్ల కర్తవ్యం. ఖచ్చితమైన సమాచారం అందించడం, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడం, బాధితుల పక్షాన నిలవడం అత్యవసరం.
స్వేచ్ఛకు రక్షణ – భద్రతకు భరోసా:
ప్రాణాలకు తెగించి, ప్రతికూల పరిస్థితులలోనూ నిజాలను నిగ్గు తేల్చేందుకు పోరాడుతున్న ప్రతి పాత్రికేయుడికి, ముఖ్యంగా యుద్ధ క్షేత్రాలలోని ధీర వనితలకు వందనాలు. విధి నిర్వహణలో అమరులైన పాత్రికేయుల త్యాగాలను స్మరించుకుందాం. ఈ ఏడాది ఇతివృత్తం నొక్కిచెప్పినట్లు, కృత్రిమ మేధ వంటి సాంకేతిక సవాళ్లను నైతికంగా అధిగమిస్తూ, విలేకర్ల భద్రతకు భరోసా కల్పించడం, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం మనందరి సామాజిక బాధ్యత. విశ్వసనీయమైన, నైతిక విలువలతో కూడిన పాత్రికేయం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగలమని, సమాజానికి సరైన సమాచారం అందించగలమని గుర్తించుకుందాం.
కింజరాపు అమరావతి
8247286357