- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- సీడబ్ల్యూసీలో తెలంగాణ కుల గణనపై చర్చ
- దేశానికే ఆదర్శంగా నిలిచిందని అగ్రనేతల కితాబు
- సర్వేకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన సీఎం
న్యూదిల్లీ, మే 2 : తెలంగాణలో అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహించడం తనకెంతో గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికిన ప్రక్రియ అని. కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలవడం తనకెంతో గర్వంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా వెల్లడించారు. జన గణనలో కుల గణనకు తెలంగాణ మోడల్ ను పరిగణనలోకి తీసుకోవాలని అఖిల భారత కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసిందని తెలిపారు.
నాలుగు గోడల మధ్య, నలుగురి ఆలోచనలతో కాకుండా, మొత్తం పౌర సమాజం, తెలంగాణ మేధావులు, వివిధ కుల సంఘ నాయకులు, విద్యావేత్తల నుంచి అత్యంత పారదర్శకంగా సలహాలు, సూచనలు స్వీకరించి శాస్త్రీయంగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టిన విషయాన్ని సీడబ్ల్యూసీ తన తీర్మానంలో ప్రస్తావించిందని హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం.
ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియ విషయంలో.. దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా నిలవడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. అత్యద్భుతంగా, అత్యంత పారదర్శకంగా కుల గణన నిర్వహించి తెలంగాణ ప్రతిష్ఠను దేశ స్థాయిలో చాటిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరొక్కసారి అభినందనలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ లో ఒక పోస్టులో వివరించారు.