– 90శాతం పూర్తి చేశామని అబద్ధాల ప్రచారం
– గత ప్రభుత్వ నిర్లక్ష్యం అంతాఇంతా కాదు
– మండిపడ్డ మంత్రి జూపల్లి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 19: బీఆర్ఎస్ నేతలకు పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ 2015లో అప్పటి సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారని గుర్తు చేశారు. రూ.లక్ష కోట్ల ప్రాజెక్టుకT పదేళ్లలో రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెడితే 90 శాతం ఎలా పూర్తి అయినట్లు అని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఎలా పూర్తి చేశారని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్టులపై గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. గట్టు, కల్వకుర్తి, జూరాల, కోయిల్ సాగర్, భీమా అన్ని ప్రాజెక్టుల విషయంలో పక్షపాతం చూపారని మంత్రి మండిపడ్డారు. కల్వకుర్తి పంపులు బాగు చేయలేకపోయారని, పాలమూరు ప్రాజెక్టు నీటి కేటాయింపులు సాధించలేకపోయారని తెలిపారు. కృష్ణా నీటిని పదేళ్లు ఏపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని చెప్పింది బీఆరఎస్ కాదా అని ప్రశ్నించారు. గద్వాల్లోని ర్యాలంపాడు రిజర్వాయర్ను పదేళ్లలో రిస్టోర్ చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి చర్చించామని చెప్పారు. సీఎం కూడా పాలమూరు వాసి కాబట్టి ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కల్వకుర్తి కింద చేపట్టనున్న గొల్లపల్లి రిజర్వాయర్ను చేపట్టవద్దని బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తుండడంపై మంత్రి జూపల్లి మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





