బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీనే

– సీఎం నాయకత్వంలో అఖిలపక్షం వచ్చేందుకు సిద్ధం
– బిల్లుపై బీజేపీ నేతలు ప్రధాని, రాష్ట్రపతి వద్ద సమయం తీసుకోండి
– 18న బీసీ బందులో సకల వర్గాలు పాల్గొనాలి
– మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే.. బీజేపీ నైజం ఏమిటో రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలిసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ సర్వేను శాస్త్రీయంగా నిర్వహించామని, సర్వే వివరాలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించామని తెలిపారు. ఖమ్మంని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో పార్టీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018లో స్థానిక ఎన్నికల సమయంలో స్థానిక సంస్థలలో 50% పెంచకుండా క్యాబ్‌ విధిస్తూ చట్టం తీసుకొచ్చిందని, దాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్‌ ఇచ్చామని చెప్పారు. బీసీ రిజర్వేషన్‌లపై కేబినెట్‌ తీర్మానం చేయగా సర్వే నిర్వహించామని, డేడికేషన్‌ కమిషన్‌ను నియమించామని, అసెంబ్లీలో ఏకగ్రీవంగా రెండు బిల్లులు ఆమోదింపజేసి గవర్నర్‌కు పంపామని, ఇలా అన్ని దశల్లో అవసరమైన చర్యలు చేపడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్ని నెలలుగా బీసీ చట్టం అమల్లోకి రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసినా కేంద్ర నుంచి అనుమతి రాలేదన్నారు. బీసీలకు ఇచ్చిన హామీని తూచా తప్పక పాటించేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో దిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేపట్టి అన్ని పార్టీలను ఆహ్వానించగా దేశంలోని ఇతర పార్టీలన్నీ మద్దతు తెలియజేసినా బీజేపీ ఎందుకు అడ్డుపడుతోందని ప్రశ్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసును గెలిచేందుకు దేశంలో అనుభవిజ్ఞులైన అభిషేక్‌ మను సింఘ్వి, రవివర్మ వంటి న్యాయ కోవిదులను కాంగ్రెస్‌ ప్రభుత్వం నియమించి కొట్లాడిన సంగతి దేశ ప్రజలందరికీ తెలుసునన్నారు. ఈనెల 18న రాష్ట్రంలో బీజేపీికి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్‌ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా డిప్యూటీ సీఎం సీఎం విజ్ఞప్తి చేశారు. మేము అడిగితే కేంద్ర పెద్దలు సమయం ఇవ్వడం లేదు.. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు రామచందర్‌ రావులు ప్రధాని మోదీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం గురించి సమయం తీసుకోండి.. నాయకత్వం వహించండి అని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు రాష్ట్రం నుంచి అఖిలపక్ష పార్టీలు బీజేపీ నాయకత్వంలో దిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, పార్టీకి చిత్తశుద్ధి ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ రాగానే బీసీల రిజర్వేషన్‌ అంశంపై చర్చించి ఈనెల 23న జరగనున్న కేబినెట్‌ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుంటామని భట్టి వివరించారు.

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

అంతకుముందు జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా రూ.400 కోట్ల బోనస్‌ ప్రకటిస్తున్నామన్నారు. దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాననన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని, దీంతో ఆ పార్టీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలిసిందన్నారు. ఈనెల 18న రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్‌ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా భట్టి విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page