– 12 వరకు అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7 : శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణపై సోమవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు ఉభయ సభలను ఈనెల 12 వరకు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. సమావేశాల పొడిగింపుపై అవసరమైతే మరోసారి సమీక్ష జరపాలని నిర్ణయించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ప్రధానంగా ప్రజా సమస్యలపై చర్చించేందుకు అజెండా రూపొందించారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహరాల మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల హాజరయ్యారు. ఉదయం శాసనసభకు వెళ్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని నిరసిస్తూ బీఆర్ఎస్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది. బీఏసీ సమావేశంలో 22ఏ, ఫీజు రీయింబర్స్మెంట్పై స్వల్పకాలిక చర్చలు జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 22ఏ నిషేధిత భూముల జాబితాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతోపాటు మరో 22 కీలకమైన అంశాలపై చర్చ జరిపేందుకు కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ఏలేటి డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు మైనారిటీ అంశాలపైనా చర్చలు జరపాలని ఎంఐఎం నేత బలాలా సైతం కోరారు. ఈ నేపథ్యంలో ఎన్ని రోజులైనా సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు సభలో తెలిపారు.
బీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్
రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, అసెంబ్లీని కనీసం 20 నుంచి 30 రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు శాసనమండలి సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించినట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. సభ్యుల కోరిక మేరకు అవసరమైతే మరిన్ని రోజులు పొడగిస్తామన్నారు. సుఖేందర్రెడ్డి అధ్యక్షతన తన ఛాంబర్లో మండలి బీఏసీ సమావేశం జరిగింది. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన సభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, ఎఫ్ఎండీ, శ్రీపాల్ రెడ్డి, శాసన మండలి సెక్రటరీ డా.నరసింహాచార్యులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు