హైదరాబాద్, ప్రజాతంత్ర : మే 12న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ఏసీఎఫ్) 50 వసంతాల పరిపూర్తి స్పూర్తి సభలను హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు అరుణోదయ సంస్కృతిక సమాఖ్య (Arunodaya Samskruthika Samakhya) రెండు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క అన్నారు. 1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాలలో అమరులు జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడింది. 2024 డిసెంబర్ 14, 15వ తేదీల్లో హైదరాబాద్ లోనే తన 50 వసంతాల సభలను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే తన 50 ఏళ్ళ చరిత్రను, కృషిని, పరిస్థితిని సృజించుకునే పనితో పాటు ‘అరుణోదయం’ అనే సావనీర్ ను ఆవిష్కరించుకోవడం. అలాగే అరుణోదయ డాక్యుమెంటరీని, విప్లవ ప్రజా సంస్థల 50 ఏళ్ల ప్రస్థానపు పాటను ప్రదర్శించుకుంటామని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క తెలిపారు. 50 ఏళ్లుగా ఒక విప్లవ సాంస్కృతిక సంఘంగా ఉన్నా అరుణోదయ ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొంటూ పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్సూర్ అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులపై జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని, అలాగే ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలకు ముందుకు రావాలని తెలిపారు. అరుణోదయ 50 ఏళ్ళ పరిపూర్తి స్పూర్తి ముగింపు సభలకు ముఖ్య అతిథులుగా సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, చెన్నై రైటర్ మీనా కందస్వామి సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల, ఉపాధ్యక్షులు అనిత, రాష్ట్ర కమిటీ సభ్యులు లింగన్న, రాకేష్, చిన్నన్న, గంగా,నూతన్, తదితరులు పాల్గొన్నారు.
అరుణోదయ 50 వసంతాల పరిపూర్తి స్ఫూర్తి సభ పోస్టర్ ఆవిష్కరణ
