కర్రెగుట్టల ఉదంతం లేవనెత్తుతున్న ప్రశ్నలు

ఏప్రిల్‌ 21 నుంచి మూడు వారాలుగా తెలంగాణ – ఛత్తీస్‌ గడ్‌ సరిహద్దుల్లోని కర్రెగుట్టలను చక్రబంధం చేసిన భారత ప్రభుత్వ సాయుధ భద్రతా బలగాలు, అర్ధసైనిక బలగాలు సాధించదలచుకున్నదేమిటి అనే ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించవలసి ఉంది. మూడు వారాలుగా సాగుతున్న ఈ ప్రక్రియలో భద్రతా బలగాలు ఇప్పటికి కొన్ని కొండలను ఆక్రమించి, వాటి మీద త్రివర్ణ పతాకం ఎగరేయడం మినహా సాధించినదేమీ కనబడడం లేదు.

ఈ చుట్టివేత – ఏరివేత ప్రక్రియను ప్రధానంగా నిర్వహిస్తున్నది కేంద్ర రిజర్వ్‌ పోలీస్‌ బలగాలకు (సి ఆర్‌ పి ఎఫ్‌) కు చెందిన కమాండో బెటాలియన్‌ ఫర్‌ రిసొల్యూట్‌ యాక్షన్‌ (కోబ్రా) దళాలు, సి ఆర్‌ పి ఎఫ్‌ జవాన్లు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, బస్తర్‌ ఫైటర్స్‌ వంటి పోలీసు, అర్ధసైనిక బలగాలు అని అధికారులు చెపుతున్నారు. వైమానిక దళం సహాయం తీసుకుంటున్నామని కూడా అంటున్నారు గనుక ఈ దాడిలో భారత సైన్యానికి కూడా భాగం ఉందనుకోవాలి. మూడు వారాలుగా ఇరవై నాలుగు వేల మంది బలగాలు కొండలను జల్లెడ పడుతున్నాయి. వైమానిక దళం హెలికాప్టర్లు ప్రతి రోజూ ఐదారు సార్లు కొండల మీద చక్కర్లు కొడుతున్నాయి. ఈ మొత్తం ఆపరేషన్‌ కు – సిబ్బంది జీతభత్యాలు, ఆహారపదార్థాలు, ఇంధనం, మందుగుండు – ఇప్పటికి ఇరవై ముప్పై కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చయి ఉంటుంది. బైటికి వచ్చిన వార్తల ప్రకారమే కొన్ని వందల మంది జవాన్లు ఎండదెబ్బ తిని, ఇద్దరు ముగ్గురు జవాన్లు మందుపాతరలలో గాయపడి ఆస్ప త్రులలో చికిత్స పొందు తున్నారు. ఇలా కోట్లాది రూపా యల ప్రజాధనాన్ని ఉపయోగించి, పేద, మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చిన భద్రతా బలగాల జవాన్ల ప్రాణాలను ప్రమాదంలో పెడుతూ, గుట్టల మీద బాంబుల వర్షం కురిపిస్తూ ఈ ప్రయాస అంతా ఎందుకు జరుగుతున్నట్టు?

మొత్తంగా సమాజమే తప్పనిసరిగా అడగవలసిన ప్రశ్నలూ, అన్వేషించవలసిన సమాధానాలూ ఎన్నో ఉన్నాయి. ఏదో ఒకటే సమాధానం ఉంటుందని కూడా కాదు. ప్రశ్నలూ అనేకం ఉన్నాయి, సమాధానాలు కూడా అనేకం ఉండవచ్చు. ఒక్కొక్క ప్రశ్నకే భిన్నమైన, ప్రత్యామ్నాయ సమాధానాలు ఉండవచ్చు. ఆ ప్రశ్నలూ సమాధానాలూ ఓపికగా అన్వేషించే క్రమంలో సుదీర్ఘ సంభాషణ అవసరం అవుతుంది. ఈలోగా ఆదివాసులైనా, మావోయిస్టులైనా, భద్రతా బలగాలైనా ఎటువైపు కూడా ప్రాణనష్టం జరగకుండా ఇరువైపులా కాల్పుల విరమణ పాటిస్తే సంభాషణకు, చర్చకు, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడానికి, అర్థవంతమైన శాంతి సాధనకు ప్రయత్నించడానికి అవకాశం దొరుకుతుంది. అటువంటి చర్చకు ఉపయోగపడే ప్రశ్నలను, ఆలోచనలను లేవనెత్తడమే ఈ వారం ఈ శీర్షిక లక్ష్యం.

ఛత్తీస్‌ గడ్‌ దక్షిణ కొసన ఉన్న బీజాపూర్‌, సుక్మా జిల్లాల్లో, తెలంగాణ ఈశాన్య భాగాన ఉన్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వ్యాపించి ఉన్న కర్రెగుట్టలు దండకారణ్యంలో మావోయిస్టుల చివరి స్థావరమని, ఆ గుట్టల్లో వంద నుంచి మూడు వేల దాకా మావోయిస్టులు తల దాచుకున్నారని ఎవరికి తోచిన అంకె వారు చెపుతున్నారు. మూడు వారాలు గడిచినా, హెలికాప్టర్ల నుంచి బాంబు దాడులు, మెషిన్‌ గన్‌ రాపిడ్‌ ఫైర్‌ జరుపుతున్నప్పటికీ, డ్రోన్ల ద్వారా, థర్మల్‌ ఇమేజింగ్‌ ద్వారా మనుషుల ఆచూకీ, ఆయుధాల ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నిస్తు న్నప్పటికీ, అత్యున్నత నైపుణ్యం గల జాగిలాలను ఉపయోగిస్తున్నప్పటికీ, ఎన్నోసార్లు ఎదురుబొదురు కాల్పులు జరిగాయని వార్తలు వస్తున్నప్పటికీ. ప్రాణహాని జరిగిన వార్తలు రాలేదు. చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు రెండు వందల మంది ఆదివాసులను ప్రభుత్వ బలగాలు బందీలుగా పెట్టుకున్నాయని తొలి రోజుల్లో వార్తలు వచ్చాయి, వారిని విడిచిపెట్టిన దాఖలా లేదు. వారిలోనుంచే ఇప్పటికి ఒకసారి ముగ్గురిని, ఒకసారి ఒక్కరినీ, మొత్తం నలుగురిని చంపి, ఎదురుకాల్పుల్లో చనిపోయినట్టుగా ప్రకటించారని వార్తలు వస్తున్నాయి.

ఇది రాస్తున్న సమయానికి మరొక పెద్ద ఎన్‌ కౌంటర్‌ జరిగిందని, పదిహేడు మంది మరణించారని అంటున్నారు. బహుశా తమ దగ్గర బందీలుగా ఉన్న ఆదివాసులలో మరి కొంత మందిని చంపివేసి, ఆలివ్‌ గ్రీన్‌ డ్రెస్సులు తొడిగి, తమ ఆయుధాగారంలోంచి కొన్ని ఆయుధాలు తీసి వారి పక్కన పెట్టి మావోయిస్టులుగా చూపుతారని అనుమానించవచ్చు.  ‘‘సీనియర్‌ మావోయిస్టు నాయకులు చనిపోయారని, లేదా తీవ్రంగా గాయపడి ఉన్నారని మాకు సమాచారం ఉంది. కఠినమైన భౌగోళిక పరిస్థితులవల్ల మేం వాళ్లున్న దగ్గరికి వెళ్లి మృతదేహాలను, గాయపడినవారిని స్వాధీనం చేసుకోలేకపోతున్నాం’’ అని మంగళవారం నాడు ఒక ఛత్తీస్‌ గడ్‌ పోలీసు అధికారి అన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఎన్నో గుహలను, సొరంగాలను ధ్వంసం చేశామని, మావోయిస్టులు అమర్చిన 250 మందు పాతరలను పనికి రాకుండా చేశామని కూడా ఆయన అన్నారు. ఆ గుహల్లో, సొరంగాల్లో వేల కిలోల పేలుడు పదార్థాలు, ఆహార పదార్థాలు, మందులు, దైనందిన అవసరపు వస్తువులు స్వాధీనం చేసుకున్నామని కూడా అన్నారు.  ‘కర్రెగుట్టలను రక్షిస్తాం’, ‘బస్తర్‌ ను రక్షిస్తాం’, మావోయిస్టు రహిత ఛత్తీస్‌ గడ్‌ తయారు చేస్తాం’ అని భద్రతా బలగాల అధికారులు, అధికారపక్ష రాజకీయ నాయకులు అంటున్నారు. ‘‘సురక్షితమైన, భద్రమైన బస్తర్‌ ను తయారు చేస్తాం’’ అని ఒక అధికారి అన్నారని బుధవారం వార్తలు వచ్చాయి.

ఇదేదో ప్రభుత్వ సాయుధ బలగాలకూ మావోయిస్టులకూ ఆదివాసులకూ మాత్రమే సంబంధించిన సమస్య కాదు. ఇవాళ ఘర్షణలో ఆ మూడు శక్తులూ ఘర్షణలో ప్రాణాలు పోగొట్టుకునే ప్రక్రియలో చిక్కుకుని ఉండవచ్చు. కాని ఇది మన సమాజానికంతటికీ సంబంధించిన సమస్య. మన సహజ వనరులకూ, మానవ వనరులకూ సంబంధించిన సమస్య. మన పాలనా విధానానికీ, అభివృద్ధి నమూనాకూ సంబంధించిన సమస్య. పాలకవర్గాలకూ ప్రజలకూ నిరంతరాయంగా జరిగే వర్గపోరాటంలో ఒకానొక సన్నివేశానికి సంబంధించిన సమస్య. ఇది ఇంత సంక్లిష్టమైనది గనుక దీని మీద సులభమైన వైఖరి తీసుకునే అవకాశం లేదు. ఉద్యమకారుల వ్యూహంలోని పొరపాట్లవల్లనే ఈ పర్యవసానం వచ్చిందని సులభమైన సూత్రీకరణ చెయ్యడానికి వీలులేదు. రాజ్యం ఇట్లా కాకపోతే ఎట్లా ఉంటుంది అని పెద్దమనిషితనం నటిస్తూ, వాస్తవంగా సాగుతున్న మారణకాండను కప్పిపుచ్చే వైఖరి తీసుకోవడానికి వీలులేదు.

భవిష్యత్‌ తరాలకు అవసరమైన మన సంపన్న ఖనిజ వనరులకు సంబంధించిన ఇంత కీలకమైన అంశం మీద, మనుషుల ప్రాణాలకు సంబంధించిన సున్నితమైన అంశం మీద మన పత్రికలు, ప్రచార సాధనాలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా వేదికలు సాగిస్తున్న హడావిడి, అబద్ధ ప్రచారం, ఒలకబోస్తున్న అజ్ఞానం, మిడిమిడి జ్ఞానం చూస్తుంటే జుగుప్స కలుగుతున్నది. ఒకప్పుడు జర్నలిస్టు అని గర్వంగా చెప్పుకుని నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న వృత్తి, ఇవాళ ఇంత హీనస్థితికి దిగజారిపోయిందా అని సిగ్గు కలుగుతున్నది. కర్రెగుట్టలకు కొన్ని కిలోమీటర్ల ఇవతలనే పత్రికల, ఛానళ్ల విలేఖరులను పోలీసులు ఆపేస్తున్నారు గనుక, వాస్తవంగా ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. ఆపివేసిన చోటి నుంచే ఎవరికి తోచిన వంటలు వారు వండి వడ్డిస్తున్నారు. వాస్తవాలు చెప్పాలనే, అవాస్తవాలు చెప్పగూడదనే కనీస నియమం లేదు.

మొత్తంగా సమాజమే తప్పనిసరిగా అడగవలసిన ప్రశ్నలూ, అన్వేషించవలసిన సమాధానాలూ ఎన్నో ఉన్నాయి. ఏదో ఒకటే సమాధానం ఉంటుందని కూడా కాదు. ప్రశ్నలూ అనేకం ఉన్నాయి, సమాధా నాలు కూడా అనేకం ఉండవచ్చు. ఒక్కొక్క ప్రశ్నకే భిన్నమైన, ప్రత్యామ్నాయ సమాధానాలు ఉండవచ్చు. ఆ ప్రశ్నలూ సమాధానాలూ ఓపికగా అన్వేషించే క్రమంలో సుదీర్ఘ సంభాషణ అవసరం అవుతుంది. ఈలోగా ఆదివాసులైనా, మావో యిస్టులైనా, భద్రతా బలగాలైనా ఎటువైపు కూడా ప్రాణనష్టం జరగకుండా ఇరువైపులా కాల్పుల విరమణ పాటిస్తే సంభాషణకు, చర్చకు, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడానికి, అర్థవంతమైన శాంతి సాధనకు ప్రయత్నించడానికి అవకాశం దొరుకుతుంది. అటువంటి చర్చకు ఉపయోగపడే ప్రశ్నలను, ఆలోచనలను లేవనెత్తడమే ఈ వారం ఈ శీర్షిక లక్ష్యం.

మొట్టమొదట, ఈ ప్రక్రియలో వైమానిక దళం హెలికాప్టర్లను వాడి, కొండల మీద బాంబు దాడులు చేస్తున్నారనే అంశమే తీసుకుందాం. వైమానికదళపు హెలికాప్టర్ల నుంచి బాంబు దాడులు శత్రు దేశాలలో, యుద్ధ సమయాలలో మాత్రమే జరుగుతాయి. దేశం లోపల ప్రజల మీద ఎటువంటి ప్రత్యర్థులపైనైనా సరే, సైన్యాన్ని, వైమానికదళాన్ని, హెలికాప్టర్లను వాడడం అనుచితం, అమానుషం. కొండల మీద కార్పెట్‌ బాంబింగ్‌ చేస్తే, సైనిక హెలికాప్టర్ల నుంచి మెషిన్‌ గన్‌ రాపిడ్‌ ఫైర్‌ చేస్తే, సాయుధులు కాని సాధారణ ప్రజానీకం కూడా చనిపోవచ్చు. అటువంటిది యుద్ధాలలో మాత్రమే జరుగుతుంది. వేరు వేరు అంచనాలలో 288 చ.కి.మీ. నుంచి 800 చ.కి.మీ. ఉందని చెపుతున్న కర్రెగుట్టల పర్వత శ్రేణిలో, అంటే డెబ్బై వేల ఎకరాల నుంచి రెండు లక్షల ఎకరాల వరకు విస్తరించిన భూభాగంలో, ఇరవై ముప్పై ఎత్తైన శిఖరాలు, లోయలు, సమతల ప్రదేశాలు, సొరంగాలు, సెలయేళ్లు, జలపాతాలు, కనీసం ఏడెనిమిది ఆదివాసి గ్రామాలు, అపారమైన జంతు వృక్ష జాతులు ఉన్న ప్రాంతంలో కార్పెట్‌ బాంబింగ్‌ జరిపితే సాధారణ ప్రజానీకం చనిపోతే ప్రభుత్వం బాధ్యత పడుతుందా? ఈ దాడులలో వృక్ష, జంతుజాతులకు జరుగుతున్న ప్రమాదాన్ని, పర్యావరణ ప్రమాదాన్ని లెక్క కట్టారా? వందల మందో, వేలమందో మావోయిస్టులు అక్కడ ఉన్నారనే అంచనాతో మొదలైన భద్రతా బలగాలు, మూడు వారాల తర్వాత వారు ఇంకా అక్కడే ఉన్నారని అనుకుంటున్నారా? ఇంతకాలం ఆహార పదార్థాలు, మందులు, సమాచార సంబంధాలు లేకుండా ఉండగలగడం సాధ్యమేనా? ఒకవేళ మిగిలిన కొండలన్నీ పట్టుకుని, అప్పటికి మావోయిస్టులు అక్కడ దాగి ఉంటే వారిని చంపివేస్తే ఛత్తీస్‌ గడో, దేశమో మావోయిస్టు రహితం అయిపోతుందా? ఆకలి రహిత, దారిద్య్ర రహిత, దోపిడీ రహిత, పీడన రహిత, అసమానత రహిత, అన్యాయ రహిత భారతదేశం తయారవుతుందా?

ఆ ఎత్తైన కొండ చరియలలోకి కాల్బలం ప్రవేశించడం కష్టసాధ్యమని, అందువల్లనే ఆలస్యం అవుతున్నదని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో రెండు మూడు కొండలను స్వాధీనం చేసుకుని వాటి మీద త్రివర్ణ పతాకం ఎగరేసి, అదేదో ఘన విజయం అన్నట్టు పత్రికలకు, ఛానళ్లకు ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. సాధారణంగా పొరుగు దేశాలతో యుద్ధాలు జరిగినప్పుడు, ఆ దేశపు భూభాగాన్ని ఆక్రమించినప్పుడు జెండా ఎగరేస్తారు. హిమాలయ శిఖరాలు, దక్షిణ ధ్రువం వంటి అసాధ్యమైన ప్రాంతానికి చేరినప్పుడు సాధించిన అఖండ విజయానికి గుర్తుగా జెండా ఎగరేస్తారు. కర్రెగుట్ట పైకి అర్ధ సైనిక బలగాలు చేరడం వీటిలో ఎటువంటి విజయం? ఇంతకాలమూ కర్రెగుట్టలు భారత భూభాగంలో, భారత ప్రభుత్వ అధీనంలో లేవా? అక్కడ ప్రత్యామ్నాయ రాజ్యాధికారం కోసం పోరాటమో, ప్రయత్నమో జరుగుతూ ఉండవచ్చు. అంతమాత్రాన అది స్వాధీనం చేసుకున్నాం అని ప్రకటించి జెండా ఎగరెయ్యవలసినంత శత్రు భూభాగం అయిపోయిందా? ఇటువంటి హాస్యాస్పద, అనుచిత ఆలోచన వచ్చినందుకు, అమలులో పెట్టినందుకు ప్రభుత్వ అర్ధ సైనిక బలగాల సారథులను ఏమనాలి?

నిజానికి పాత రాచరికాల రోజులలో శత్రు భూభాగాల మీద జెండా ఎగరేయడం విజయ సూచికగా ఉండేది గాని, ఇప్పుడు జెండా ఎగరెయ్యడానికి ఆ భూభాగాల్లోకి ప్రవేశించవలసిన అవసరమే లేదు. ఇవాళ మన మార్కెట్ల మీద దేశదేశాల బహుళ జాతి సంస్థల జెండాలు ఎగురుతున్నాయి. మన నట్టింట్లో దేశదేశాల ఆర్థిక ప్రయోజనాల జెండాలు ఎగురుతున్నాయి. స్వయంగా భారత ప్రభుత్వమూ, 1991 నుంచి అధికారంలో ఉన్న అన్ని పార్టీలూ, మన దేశ సార్వభౌమాధికారాన్ని, స్వావలంబనను ధ్వంసం చేసి, మన ప్రజల జీవితాలను పణంగా పెట్టి, ఎన్నెన్నో విదేశీ జెండాలు ఇక్కడ ఎగరడానికి కారణమయ్యాయి. ఆ పాలకులు చెప్పిన పనల్లా చేసే, చెయ్యమన్న దుర్మార్గమల్లా చేసే సైనిక, అర్ధ సైనిక బలగాలు, ఆదివాసుల హక్కుల కోసం, జల్‌ జంగల్‌ జమీన్‌ ఇజ్జత్‌ కోసం సాగుతున్న పోరాటాన్ని ధ్వంసం చేసి విజయం సాధించినట్టు జెండా ఎగరేయడం హాస్యాస్పదం, విషాదం, క్రూరం.

పదహారు నెలలుగా మధ్య భారత అరణ్యాలలో సాగుతున్న ఆపరేషన్‌ కగార్‌ ను ఆపాలని, అసలు మావోయిస్టులను నిర్మూలించి, ఆదివాసులను ఖాలీ  చేయించి, ఆ ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడానికే ఈ ఆపరేషన్‌ అని ఎన్నో రాజకీయ పార్టీలు, ప్రజా సంస్థలు, వేలాది మంది ప్రజలు కోరుతున్నారు. తక్షణమే ఈ మారణహోమాన్ని ఆపడానికి కాల్పుల విరమణ పాటించమని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ ప్రజాగళాన్ని వినకుండా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉండడం, మారణహోమాన్ని సాగించడానికే ముందుకు పోవడం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ‘‘సురక్షితమైన, భద్రమైన బస్తర్‌’’ అన్నప్పుడు ప్రభుత్వ దృష్టిలో కార్పొరేట్లకు సురక్షితమైన, భద్రమైన బస్తర్‌ అనే అర్థం చేసుకోవాలి.

చివరిగా, భవిష్యత్‌ తరాలకు అవసరమైన మన సంపన్న ఖనిజ వనరులకు సంబంధించిన ఇంత కీలకమైన అంశం మీద, మనుషుల ప్రాణాలకు సంబంధించిన సున్నితమైన అంశం మీద మన పత్రికలు, ప్రచార సాధనాలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా వేదికలు సాగిస్తున్న హడావిడి, అబద్ధ ప్రచారం, ఒలకబోస్తున్న అజ్ఞానం, మిడిమిడి జ్ఞానం చూస్తుంటే జుగుప్స కలుగుతున్నది. ఒకప్పుడు జర్నలిస్టు అని గర్వంగా చెప్పుకుని నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న వృత్తి, ఇవాళ ఇంత హీనస్థితికి దిగజారిపోయిందా అని సిగ్గు కలుగుతున్నది.
కర్రెగుట్టలకు కొన్ని కిలోమీటర్ల ఇవతలనే పత్రికల, ఛానళ్ల విలేఖరులను పోలీసులు ఆపేస్తున్నారు గనుక, వాస్తవంగా ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. ఆపివేసిన చోటి నుంచే ఎవరికి తోచిన వంటలు వారు వండి వడ్డిస్తున్నారు. వాస్తవాలు చెప్పాలనే, అవాస్తవాలు చెప్పగూడదనే కనీస నియమం లేదు. నోటికి ఏది వస్తే అది, బుర్రకు ఏది తోస్తే అది ప్రచారంలో పెడుతున్నారు. ఒక గంట తర్వాతనో, ఒక రోజు తర్వాతనో అవి అబద్ధాలని తేలిపోతాయనే సిగ్గు కూడా ఉండడం లేదు.

మొత్తానికి కర్రెగుట్టల ఉదంతం మన సమాజం ఉన్న విచిత్ర స్థితికి దర్పణం పడుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page